వెన్నెల విలువ
వసుంధర
వాసుదేవరావు కుటుంబమంతా సినిమాకు వెళ్ళారు. వంట మనిషి రమణమ్మ ఒక్కర్తీ యింట్లో వుంది. ఆమెకు నవలల పిచ్చీ . ఓ చేతిలో నవల పట్టుకుని రెండో చేత్తో పులుసు కలుపుతుండగా ఎవరో వీధి తలుపు తట్టారు.
రమణమ్మ వెళ్ళి తలుపు తీసింది.
సుమారు ముప్పై అయిదేళ్ళ వ్యక్తీ లోపల అడుగు పెట్టాడు. రమణమ్మ అతణ్ణి చూసీ "నువ్వా?" అంది.
"అవును నేనే!" అన్నాడతడు. అతడి ముఖం కరుకుగా వుంది. మాట కరుకుగా వుంది.
"ఎందుకొచ్చావ్ ?" అంది రమణమ్మ.
"నీ కోసమే వచ్చాను ...." అన్నాడతడు.
"నా కోసమా?"
"అవును నిజంగా నీ కోసమే!"
"నా దగ్గరేముంది?"
అతడు నవ్వి "వెన్నెల విలువ చంద్రుడెం చెప్పగలడు?" అన్నాడు.
"కవిత్వం నేర్చుకున్నావే!" అందామె.
"కవిత్వం కూడు పెట్టదు. కూడు పెట్టేవి కూడా చాలా నేర్చుకున్నాను. " అన్నాడతడు.
"ఇంతకీ ఇప్పుడిక్కడి కెందు కొచ్చావో చెప్పు...."
"చెప్పానుగా నీ కోసమని ...."
రమణమ్మ యిబ్బందిగా నవ్వి "థాంక్స్ !" అంది.
"కాసేప్పోయాక నేనే నీకు థాంక్స్ చెబుతాను...." అన్నాడతడు.
"ఎందుకని?"
"నేనీ ఇల్లు దోచుకోవాలనుకుంటున్నాను. అందుకు నీ సాయం కావాలి " అన్నాడతడు తాపీగా.
రమణమ్మ భయం భయంగా అతడి వంక చూసి "ఏదో మాములుగా రోజులు గడిచి పోతున్నాయి నాకు. నన్నిబ్బందుల్లో యిరికించకు " అంది.
"నీ మీద అనుమానమేదీ వుండదు. నీకు ప్రమాదమూ వుండదు.... నువ్వు నాకు సాయం చేసినట్లు యెవ్వరికీ తేలియదు" అన్నాడతడు.
"వద్దు...." అంది రమణమ్మ.
"నా దోపిడీ వల్ల నీకూ ప్రయోజనముంటుంది. ఇక్కడ సంపాదించిన డబ్బుతో నీ కూతుర్ని నా కూతురిలా పెంచుతాను " అన్నాడతను.
రమణమ్మకో కూతురుంది. ఆమెకు పదహారో యేట అక్రమ సంతానంగా పుట్టిందా పిల్ల. ఆ పిల్ల కిప్పుడు పధ్నాలుగేళ్ళు . ఆ పిల్లకు అర్నేల్లప్పుడు రమణమ్మ ఎరిగున్న వాళ్ళకు అప్పజెప్పింది. తనకు పెళ్ళయిందనీ భర్త పోయాడనీ అందరికీ చెప్పుకుంది. అయిన వాళ్ళెవరూ లేక ఆ తర్వాత ఆమెకు పెళ్ళి కావడమూ కష్టమయింది.
ఆ తర్వాత నుంచి రమణమ్మ ఆ ఇంటా ఈ యింటా పనులు చేస్తూ గడపసాగింది. అప్పుడప్పుడు కూతురి గురించి విచారిస్తుండేది. ఎరిగున్న వాళ్ళకు చాలా కాలం పిల్లలు లేరు. మూడేళ్ళు వచ్చేదాకా రమణమ్మ కూతుర్ని వాళ్ళు బాగానే పెంచారు. ఆ తర్వాత వాళ్ళకిద్దరు పిల్లలు కలిగారు. అప్పట్నించీ వాళ్ళకు రమణమ్మ కూతురి పై ఆసక్తి తగ్గిపోయింది. ఆ పిల్ల వాళ్ళింట్లో పనిపిల్లలా బ్రతుకుతోంది.
రమణమ్మ ప్రస్తుతం తను బాల వితంతువని చెప్పుకుంటోంది. ఆ విధంగా ఎప్పటికైనా ఎవరైనా తన్ను పెళ్ళి చేసుకోనవచ్చునని ఆమె ఆశ. తన కొకబిడ్డ వున్న విషయాన్నామే రహస్యంగా కాపాడుకుంటోంది.
అనుకోకుండా రమణమ్మకు సత్యం పరిచయమయ్యాడు.
సత్యం వాసుదేవరావింట్లో వంటవాడు. ఆ యింట్లోనే పై పనులకు కుదిరింది రమణమ్మ. ఇద్దరికీ ఒకరంటే ఒకరి కిష్టమైంది. రమణమ్మ సత్యాన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంది. సత్యం ఆమెకు తన యిబ్బంది చెప్పుకున్నాడు.
పద్దెనిమిదేళ్ళప్పుడు ఎవడో డాక్టరు ప్రోత్సహిస్తే అతడు వేసక్టమీ ఆపరేషను చేయించుకుని ఓ ట్రాన్సిస్టరు సంపాదించుకున్నాడు. తనేం పోగొట్టుకున్నాడో అతడి కప్పుడు తెలియదు.
"మనకు పిల్లలు పుట్టరు. పెళ్ళి చేసుకుని ఏం లాభం?" అన్నాడు సత్యం?
రమణమ్మ ముందు తటపటాయించినా తర్వాత తన గురించిన నిజం చెప్పేసింది. సత్యం ఏంతో సంతోషించి "నీ కూతురే మన కూతురు " అన్నాడు.
పెళ్ళయ్యేదాకా తమ ప్రేమ వ్యవహరాన్నెంతో రహస్యంగా వుంచాలనుకున్నారు వాళ్ళు. కానీ ఈలోగా వాసుదేవరావింట్లో దొంగతనం జరిగింది. అయిదు వేల రూపాయలు విలువ చేసే వెండి కంచాలు పోయాయి. అనుమానం సత్యం మీదకు వెళ్ళింది. అతణ్ణి పోలీసుల కప్పగించారు. అక్కడ నాకేం తెలియదు మొర్రో అంటున్నా నాలుగు తన్ని అతడి చేత నేరాన్నోప్పించారు పోలీసులు.
సత్యానికి రెండేళ్ళ జైలు శిక్ష పడింది.
ఇది జరిగి ఏడాది దాటింది.
ఈలోగా రమణమ్మ ఆ యింట్లో వంటమనిషిగా కుదిరింది. సత్యానికీ ఆమెకూ సంబంధించిన కధ రహస్యంగా వుండిపోయింది.
'అప్పుడే ఎలా వచ్చేశావ్ సత్యం?" అంది రమణమ్మ.
"జైల్లోంచి పారిపోయి ...." అన్నాడు సత్యం.
"జైల్లోంచి పారిపోయావా?" భయంగా అంది రమణమ్మ. 'అంటే నువ్వు నిజంగా ఆరితేరిన దొంగవన్న మాట?"
సత్యం విషాదంగా నవ్వాడు -- "చెయ్యని నేరానికి నన్ను దొంగను చేశారు పోలీసులు. కానీ తెలిసి కూడా ఎందరో నేరస్థుల్ని వాళ్ళు పట్టుకోవడం లేదు. వాళ్ళలో కొందరు మనమధ్య పెద్దమనుషులుగా కూడా చెలామణి అవుతున్నారు. అలాంటి పెద్ద మనిషి ఒకాయనకు నా సాయం కావల్సోచ్చింది...."
రమణమ్మ ఆశ్చర్యంగా వింటున్నదల్లా "అరె - పులుసు మరిగిపోతోంది...." అంటూ వంటింట్లోకి పరుగెత్తింది. సత్యం తనూ ఆమె ననుసరించి -- "ఏది నీ వంట రుచి చూస్తాను ...." అంటూ గరిటతో కాస్త పులుసు తీసి ఊది అరచేతిలో పోసుకుని రుచి చూసి "అబ్బే ఇదేం పులుసు?" అన్నాడు.
"నీకులా నాకు వంట రాదు" అంది రమణమ్మ.
"ఎందుకూ రాదు ?" అంటూ అప్పటికప్పుడు పులుసుకు రుచి రావాలంటే ఏం చేయాలో రమణమ్మ కు చెప్పాడు. పులుసు తయారవుతుండగా సత్యం ఆమెకు తన కధ చెప్పాడు.
సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఒకాయన తన అవసరాలకు నేరస్థుల్ని ఉపయోగించుకుంటుంటాడు. అయన కన్ను సత్యం మీద పడింది. ఫలితంగా అయన మనిషొకడు జైల్లో ప్రవేశించి సత్యాన్ని కలుసుకున్నాడు. ఆ పెద్ద మనిషి చెప్పినట్లు చేస్తానంటే జైలు నుంచి తప్పించగలనన్నాడు. సత్యం ఒప్పుకున్నాడు. పోలీసులు చూసీ చూడనట్లురుకున్నారు. సత్యం జైల్నించి తప్పించుకున్నాడు.
సత్యం అన్న ప్రకారం ఆ పెద్ద మనిషిని కలుసుకున్నాడు. అయన చెప్పిన పని సామాన్యమైనది కాదు, అదో పెద్ద బ్యాంకు దోపిడీ. అందుకు మొత్తం అయిదుగురు మనుషులు కావాలి. వాళ్ళలో సత్యం ఒకడు.
బ్యాంకు దోపిడీ కింకా వారం రోజుల గడువుంది. ఈలోగా సత్యం తన పగ తీర్చుకునేందుకు వాసుదేవరావింటికి వచ్చాడు.
'అప్పుడు చెయ్యని నేరానికి నన్ను జైలు పాలు చేశారు వీళ్ళు. అయిదు వేల రూపాయల పాపం నాకు అంటగట్టారు. అందుకు కనీసం అయిదు రెట్లు వసూలు చేయాలి నేను" అన్నాడు సత్యం.
"దొంగతనమెలా చేస్తావు?" అంది రమణమ్మ.
"ఈ పులుసులో మత్తు మందు కలుపుతాను...." అంటూనే అతడు తన జేబులోంచి ఓ డబ్బా తీసి అందులోంచి పోడాన్ని పులుసులో వేశాడు.
"తర్వాత ?" అంది రమణమ్మ.
"రాత్రి వాళ్ళు భోజనాలు చేసి మత్తుగా నిద్రపోతారు. వాళ్ళతో పాటే నువ్వునూ...." అన్నాడు సత్యం.
"ఆ తర్వాత?"
"నేను కొట్టు గదిలో దాగుని వుంటాను. ఓ రాత్రి వేళ వచ్చి యిల్లంతా చక్కబెట్టుకుని పోతాను. తెల్లారేదాకా ఎవరికీ మెలకువ రాదు. ఆ తర్వాత ఎవ్వరికీ నేను దొరకను. ఈ పధకం వల్ల ఎవరికీ నీ మీద కూడా అనుమానం రాదు..."
రమణమ్మ సత్యం పధకాన్ని మెచ్చుకుంది. అయితే ఆమెకో సందేహం ఉండిపోయింది -- "వాసుదేవరావు మీద పగ వుంటే అది బ్యాంకు దొంగతనం తర్వాత తీర్చుకోవచ్చు గదా! ఇప్పుడే దొంగతనం చేయడం వల్ల కర్మం జాలక ఎవరికైనా అనుమానం కలిగితే నువ్వు పట్టుబడి పోవచ్చు...."
సత్యం నవ్వి "అన్నీ ఆలోచించాన్నేను. బ్యాంకు దోపిడీ అంటే సామాన్యమైన విశేషం కాదు. నేను పట్టుబడి పోవచ్చు. ప్రాణాలు కోల్పోవచ్చు. పగ తీరకుండా చావడం నా కిష్టం లేదు. ఈ యింట్లో దొంగతనం చేయటం వల్ల నేను పట్టుబడననే నా నమ్మకం. ఒకవేళ పట్టుబడినప్పటికీ ఆ పెద్ద మనిషి నన్ను రక్షించదానికి ప్రయత్నిస్తాడు..." అన్నాడు.
రమణమ్మ భయంగా "అంత ప్రమాదకరమైనాదైతే బ్యాంకు దోపిడీ జోలికేందుకు వెడతావు? ఈ యింట్లోని డబ్బు నీకు చాలదా?" అంది.
"రమణమ్మ ! నీకూ నాకూ ఆలోచనల్లో మార్పు వచ్చేసింది. ఏడాది జైలు జీవితం నా గుండెను బండరాయిగా మార్చేసింది. మున్ముందు నా జీవితాన్ని నేరాలతోనే తీర్చిదిద్దుకుంటాను. నేరస్థుడిగా యీ సమాజాన్ని శాసిస్తాను." అన్నాడు సత్యం.
రమణమ్మ ఆలోచనలో పడింది. "అంటే మనం కలిసుండడం సాధ్యపడాదా?" అంది కాసేపాగి.
"ఇంక నాకు సులభ జీవితం లేదు. అనుక్షణం సమాజానికి భయపడుతూ, అంతా కంతా సమాజాన్ని భయపెడుతూ అదో రకపు జీవితం గడిపే నాతొ నువ్వు సుఖ పడలేవు. నేను నీకు చేయగల ఉపకారమల్లా నీ కూతురి జీవితం సుఖమయం చెయడ మొక్కటే !" అన్నాడు సత్యం.
రమణమ్మ యింకేమీ మాట్లాడలేదు. సత్యమంటే ఆమెకు ప్రేమ వుంది. అభిమానముంది. సత్యాన్నామే తన జీవన భాగస్వామిగా ఊహించుకుంది. అతడిప్పుడు సమాజానికి విరోధి అవుతున్నాడు. అందుకు తాను సాయపడుతోంది.
