`
15
అతను చెమటలు తుడుచుకుని పరీక్షగా చూశాడు దొడ్లోకి. నిలువెత్తు గొయ్యి తయారయ్యింది. అతను సంతృప్తిగా తలాడించి అక్కణ్ణించి ఇంట్లోకి వెళ్ళాడు. శుభ్రంగా స్నానం చేశాడు. బట్టలు మార్చుకున్నాడు.
ఒకసారి వెళ్ళి, పక్కింట్లో ఇంటాయన్ను పలకరించి, "ఇంకో గంటలో మా ఆవిడ్ని తీసుకు వస్తాను. పాలు పొంగించుకుని ఈరాత్రికి నిద్ర చేసి రేపు వెళ్ళిపోతాం. ఎలాగూ మీకు రెండు నెలల అడ్వాన్స్ చ్చేశాను గదా. మళ్ళీ ఈ ఊరు వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ట్రాన్స్ ఫర్ వీలయితే నెల్లాళ్ళ లో వచ్చి నేరుగా మీ ఇంట్లో ప్రవేశిస్తాను. ఏ విషయమూ మీకు నెల రోజుల్లో తెలియ జేస్తాం....' అన్నాడు.
"దాందేముందండీ . నా అద్దె నాకు ముట్టింది. రెండు నెలల దాకా తాళం జోలికి పోము. ఆ తర్వాత కూడా రాకపోతే తాళం బద్దలు కొట్టి మరీ తెరుస్తాను...."
" ఆ అవసరం రానివ్వను లెండి" అని అతను అక్కణ్ణించి కదిలాడు.
ఒక రిక్షా మాట్లాడుకున్నాడు. రానూ పోనూ అని చెప్పి.
"రిక్షా ఒకింటి ముందు ఆగింది. అతను రిక్షా లోంచి దిగి, "ఒక్క నిముషం అగు..." అని లోపలకు వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. చనువుగా నడిచి ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒకామె వణుకుతూ నిలబడి వుంది.
"రాజేశ్వరి పని పూర్తయిందా?"
"అయింది. కానీ నాకేమో భయంగా ఉంది..."
"నిండా మునిగేక చలెందుకు?" అన్నాడతను.
నేలమీద తెరచి ఉన్న ట్రంకు వంక చూశాడతను. దృష్టి మార్చి మంచం మీద నిర్జీవ కళేబరాన్ని చూసి నిట్టూర్చాడు. "నువ్వు కాస్త సాయం చేయాలి మరి" అంటూ రాజేశ్వరి వంక చూశాడు. ఇద్దరూ కలిసి శవాన్ని ట్రంకు లో సర్దారు. ట్రంకు మూత వేసేశారు. మోసుకుంటూ మధ్య హాల్లోకి తీసుకొచ్చారు.
అప్పుడతను తలుపు తీసి రిక్షా అతన్ని పిలిచాడు. అతనూ రిక్షా అతను కలిసి ట్రంకు ని రిక్షా లోకి పెట్టారు. 'చాలా బరువుందండి. ఇంకో రూపాయైనా ఇవ్వాలండి. అన్నాడు రిక్షా వాడు. అతను వాదించకుండా నవ్వి ఊరుకున్నాడు. రాజేశ్వరి ఇంటికి తాళం వేసింది.
ఇద్దరూ రిక్షా ఎక్కారు. రిక్షా గమ్యస్థానం చేరేదాకా ఇద్దరూ ఏమీ మాట్లాడాడు కోలేదు. ఇద్దరి ఒంటికి బాగా చెమటలు పట్టేశాయి.
రిక్షా గమ్యస్థానం చేరుకుంది. ట్రంకు ఇంట్లోకి చేరింది.
రాత్రి పది గంటల ప్రాంతంలో ట్రంకు దొడ్లో కి చేర్చబడింది. ట్రంకు లోని శవం గోతి లోకి వెళ్ళిపోయింది. ఒకటి కాదు నాలుగు గోతులు , ఇద్దరూ కలిసి కప్పెట్టేశారు. ఎక్కాడా అనుమానం రాకుండా పైన సరిచేశారు.
ట్రంకు మళ్ళీ ఇంట్లోకి చేరింది.
రాజేశ్వరి అతనితో అంది. "ఈ ట్రంకు చాలా బరువుగా ఉంటోంది. దీన్నావల పారేసినా ఎప్పటి కైనా అనుమాన పరిస్థితులు కలుగవచ్చు. ఉత్తమమైన మార్గం దీనికి రంగు మర్పించడం. అప్పుడు దీని మీద ఏ విధమైన ఆనవాలూ మిగలదు."
అతను అంగీకార సూచనగా తలూపాసాడు.
16
బాగా ఆలోచించేక కుసుమ ఒక నిర్ణయానికి వచ్చింది" ప్రమాదకరమైన స్మగ్లింగ్ జీవితానికి స్వస్తి చెప్పు, ఒక ఇంటి ఇల్లాలుగా సుఖ జీవనం చేయాలని ఆమెకు తోచింది.
రంగు మార్చడానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు, నకిలీ ప్రేమికులు, ఆడవాళ్ళు - తమ జీవితాలను మార్చుకోవడం అంత సులభం కాదని ఆమెకు తెలుసు.
కానీ ఆనంద్ ప్రేమలో నిష్కల్మత్వం కనబడుతోంది. అతని కాళ్ళలో దృడ నిశ్చయం కనబడుతోంది. అని ఆమెకు అతని మీద నమకాన్ని, భవిష్యత్తుపై ఆశనూ కలిగిస్తున్నాయి.
ఏ విషయమూ నిర్ణయించుకుని ఈరోజు ఉదయం పదిగంటలకు తనను వాళ్ళింటికి రమ్మన్నాడు ఆనంద్. కుసుమ లేచింది. రోడ్డు మీదకు వచ్చింది. కనపడిన రిక్షా ను పిలిచింది.
రిక్షా ఆనంద్ ఇల్లు చేరింది. కానీ ఆ యింటి తలుపులు తాళం వేసి వున్నాయి.
ఆమె నిరుత్సాహంగా కదిలి వెళ్లబోయే లోగా ఇంటి ముందు యింకో రిక్షా ఆగింది. అందులోంచి రాజేశ్వరి, దిగింది. తన ఇంటి ముందు నిలబడ్డ కుసుమ ను చూసి ఆశ్చర్యంగా "మీరా?' అంది.
'అవును. ఆనంద్ తో చిన్న పనుంది వచ్చాను అంది కుసుమ.
"లోపలకు రండి ...." అంది రాజేశ్వరి.
ఇద్దరూ లోపలకు వెళ్ళారు. "మీ కధ చాలా వరకు నాకు ఆనంద్ చెప్పాడు. మీకోసం నన్ను వదులు కోవాలని కూడా అనుకున్నాడు. నేను అభ్యంతర పెట్టలేదు. ఆనంద్ ను నేను తాత్కాలిక రక్షణకు చేరదీశాను. తప్పితే అతన్ని నా భర్తగా పొందాలనుకోలేదు నేను. కానీ ఏమయిందో తెలియదు. ఒకరాత్రి అతను యింట్లో ఈ చీటీ వదిలి వెళ్ళిపోయాడు. మిమ్మల్నీ నన్నూ కూడా మోసం చేసి...."
రాజేశ్వరి కాగితాన్ని కుసుమ కిచ్చింది.
"రాజూ-----
నిన్ను వదులుకోలేను. కుసుమ ఆశలు త్రుంచి వేయలేను. ఈ సమస్య నన్ను కలచి వేస్తుంటే గతంలో నేను చేసిన కొన్ని పాపాలు నన్ను దారుణంగా వెంట తరుముతుంటే, ఏం చేయాలో పాలుపోక ఇల్లువదిలి పోతున్నాను. బ్రతికుంటే మనసుమారితే మళ్ళీ తిరిగి వస్తాను. నాకోసం వెతకడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం నా శవమే మీకు దొరుకుతుంది."
క్రింద ఆనంద్ సంతకముంది. కుసుమ ఉత్తరం చదివి నిట్టూర్చింది.
"ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. ఆఖరకు మీరూ నేను కూడా కలిసి అతనితోజీవితం పంచుకోవడానికి నా కభ్యంతరం లేదని అతనికి స్పష్టం చేశాను" అంది రాజేశ్వరి.
'అక్కయ్యా!" అంది కుసుమ అప్రయత్నంగా. "మీ హృదయం చాలా మంచిది. ఆనంద్ మనసులో ఏదో దురుద్దేశ్యముంది. మనిదర్నీ కూడా అతను పొందగలిగాడు మోజు తీరిపోయిందని నా అనుమానం. ఏదో వంక పెట్టి పారిపోయాడు."
"నాకీ ఆలోచన రానే లేదుస్మీ...." అంది రాజేశ్వరి ఆశ్చర్యంగా.
"మంచి వాళ్ళేప్పుడూ ఒక కోణం నుంచే ఆలోచిస్తారు. విషయాన్నాన్ని కోణాల నుంచీ ఆలోచించడం నాబోటి పతితలకు తెలుసు. వస్తాను" అంటూ లేచింది కుసుమ. డిజప్పాయింటైన వాటం ఆమె ముఖంలో కనబడుతోంది.
ఆమె వెళ్ళిపోయాక తలుపు వేసుకుని ఆలోచనలో పడింది రాజేశ్వరి.
తను చేసిన పని ఎంతవరకూ సమంజసం?
ఈ ఉత్తరం విషయంలో కుసుమకు తను అబద్దం చెప్పింది. నిజానికి ఉత్తరాన్ని తనే ఆనంద్ చేత వ్రాయించింది. రంగారావు బారి నుండి రక్షించు కోవడం కోసం ఈ వుత్తరం వ్రాసి వెళ్ళమని తను ఆనంద్ ను కోరింది. అతడు రాసిన ఉత్తరాన్ని కుసుమకు మరోలా చెప్పింది!
అసలు రంగారావు విషయంలో తను ఆనంద్ కు అబద్దం చెప్పింది. అందులో తనకు దురుద్దీశ్యం లేదు. రంగారావు విషయంలో ఆనంద్ కూడా తనకు చాలా అబద్దాలు చెప్పాడు.
ఆనంద్ చాలా తెలివిగా రంగారావు ని హత్య చేసి నప్పటికీ, తనేవరి దగ్గరయితే గది తాళాలు తీసుకున్నాడో ఆ వ్యక్తీ కుతూహలం కొద్ది తనకు రహస్యంగా గమనించే అవకాశమున్నదని గ్రహించలేదు.
గది తాళాలిచ్చిన సూర్యం ఆఫీసు కి శెలవు పెట్టి -- అతని చర్యలన్నీటినీ రహస్యంగా గమనించాడు. దిగ్బ్రాంతుడై పోయిన అతను చాలా భయపడ్డాడు కూడా. విషయాన్ని తనదాకా తేవడానికి కొంతకాలం పట్టింది. కాలం గడచినా కొద్ది అతనికి తనకు తెలిసిన రహస్యాన్ని రాజేశ్వరికి చెప్పాలని పించింది. బహుశా రాజేశ్వరి అందం అందుకు కొంత కారణమై వుండవచ్చు.
సూర్యం మాటలు రాజేశ్వరి వెంటనే నమ్మలేదు. కానీ అతను చెప్పినది నిజమేనని కాలం చెప్పినది. ఆనంద్ స్వయంగా ఒప్పుకున్నాడు.
అన్యాయంగా తన భర్తను హత్య చేసిన ఆనంద్ మీద ఆమెకు చాలా కోపం వచ్చింది.
ఆనంద్ ఒక భయంకర హంతకుడని తెలిసేక అతనితో కాపురం చేయడానికి భయంగా వుంది. అదే సమయంలో అంత భయంకర హంతకుడ్ని ఒక అట ఆడించగలనన్న ధైర్యమో ఆమె కుంది.
ఇంకో భయమేమిటంటే సూర్యం కూడా తన్ను కోరుతున్నాడు. అతని కాంక్ష బలమైనది గా తోస్తోంది. అతని వద్ద ఆనంద్ కు సంబంధించిన భయంకర రహస్యం దాగి వుంది. ఆవిధంగా అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తీ.
ఒకే ఒరలో రెండు కత్తులిమడవు. సూర్యం సాయం తీసుకుని ఆనంద్ నైనా , ఆనంద్ సాయం తీసుకుని సూర్యాన్నయినా హతమార్చాలి. , ప్రస్తుతానికి అదే కావాలి.
అయితే ఇద్దరిలో ఎవరిని నిర్ణయించుకోవాలి? ఎవరి వైపు తను మొగ్గాలి.
బాగా ఆలోచించాకనే తను ఒక నిర్ణయాని కొచ్చింది. సూర్యం సహాయంతో ఆనంద్ ను హత మార్చటమే అన్ని విధాలా ఉత్తమంగా తోచింది.
17
దూరంగా రాజేశ్వరి , ఆమె ప్రక్కన ఒక మగవాడు కనపడ్డారు కుసుమకు. మగవాడు ఒక షాపులోకి అడుగు పెడుతున్నాడు. ఎందుకో వెనక్కు తిరిగిన రాజేశ్వరి కుసుమ గుర్తుపట్టింది.
"రాజేశ్వరీ --" అంది కుసుమ. మగవాడు షాపులోకి వెళ్ళిపోయాడు. రాజేశ్వరి మెట్లెక్కబోయినదల్లా ఆగి "ఎవరూ?' అంది. ఆమె మాటలు పూర్తయ్యే సరికి కుసుమ ఆమెను సమీపించింది.
"ఆనంద్ వచ్చాడా?" అంది కుసుమ ఉత్సాహంగా.
"లేదు------' అంది రాజేశ్వరి అయిష్టంగా.
"మరి షాపులో కెళ్ళిన దెవరు?"
"ఆనంద్ కాదు...."
"నాకు ఆనంద్ లాగే కనిపించాడు."
"కాదని నేను చెబుతున్నానుగా..."
"ఎవరయితే నేం - ఒకసారి పరిచయం చేయండి..." అంటూ తను షాపులోకి అడుగులు వేసింది. రాజేశ్వరి ఆమెను వారించడానికి ప్రయత్నించి విఫలురాలయింది.
ఇద్దరూ షాప్ లో అడుగు పెట్టారు.
"రాజూ ట్రంకు తీసుకుపోవచ్చు నంటున్నాడు రంగు బాగుంది కదూ" అంటూ అతను వెనక్కు తిరిగాడు.
అతన్ని చూసిన కుసుమ దెబ్బతింది. అతను ఆనంద్ కాదు.
"మీట్ మిస్టర్ సూర్యం ...." అంటూ రాజేశ్వరి పరిచయం చేస్తోంది.
కుసుమ ఆమె మాటలు వినడం లేదు. మెరుస్తున్న ట్రంకు పెట్టేనీ- సూర్యాన్నీ ఆమె మార్చి మార్చి చూస్తోంది. తను ఆనంద్ కు చెప్పిన కల్పిత కధ ఆమె మదిలో మెదుల్తోంది.
రాజేశ్వరి కూడా మెరుస్తున్న ట్రంకు వంక అదోలా చూసింది. ఆమె కళ్ళలో లీలగా భయం తొంగి చూస్తోంది.
ఆనంద్ కంటే సూర్యం అమాయకుడని తను భావించింది. అందుకని చెప్పిన ఉపాయంతో కుసుమ గురించి అతనుద్దేశించిన పధకంతో అతన్నే హతమార్చింది.
అయితే ఈ హత్యా కాండ యింతటితో ఆగుతుందా! సూర్యం, తనూ కలకాలం కలసి జీవించ గలుగుతారా?
కుసుమ కళ్ళలో ఏదో అనుమానం తొంగి చూస్తోంది. ట్రంకు పెట్టె కొత్త రంగు మెరుస్తోంది.
రాజేశ్వరి ప్రశ్నకు జవాబు దొరకలేదు, కాలమే మరి సమాధాన మివ్వాలి.
----: అయిపొయింది :----
