"అయితే ఇంకో ఇరవై ఇచ్చేయండి. డబ్బు చేతికి వచ్చేకనే-జోష్యం....."
వీరభద్రం మారాలోచన లేకుండా ఇంకో ఇరవై రూపాయలు అందించాడు జ్యోతిష్కుడికి.
జ్యోతిష్కుడు డబ్బందుకుని తీవ్రంగా వీరభద్రం ముఖంలోకి చూశాడు. ఆ తర్వాత ఓ నిముషంపాటు కళ్ళు మూసుకున్నాడు. ఆపైన నెమ్మదిగా-"మీ చేత నున్న వాచీ మీది కాదుకదూ....." అన్నాడు.
వీరభద్రం ఉలిక్కిపడి-"నాదే-" అన్నాడు.
"అబద్దమాడకూడదు...." అన్నాడు జ్యోతిష్కుడు తీవ్రంగా-"అది ఒకరికి శుభప్రదమైనది. మీకు అరిష్టం. మీ కొడుక్కు సంభవించిన ఆపదకిదే మూలకారణం. నామాట మీరు నమ్మకపోతే ఏనాటికైనా మీ వంశం దీనికారణంగా సర్వనాశనమవుతుంది. ఈ వాచీలో ఒక కుటుంబానికి సంబంధించిన రక్షాబంధనమున్నది. అది మీ వంశాన్ని హరించనున్నది. దీన్ని స్వంతదారుడికి చేర్చడం ద్వారా ఈ అరిష్టాన్ని తొలగించుకోగలుగుతారు. ప్రస్తుతం మీ అబ్బాయికేమీ ప్రమాదంలేదనీ అతను నిక్షేపంలా ఉన్నాడనీ నాకు తోస్తోంది. మీ అబ్బాయి గురించి మీరేమీ దిగులుపడ నవసరంలేదు. ఎటొచ్చీ నా మాటలు గుర్తుంచుకోండి-"
ఆ వాచీ గురించి వీరభద్రం ఆలోచిస్తూనే ఉన్నాడు. తన కొడుక్కు జరిగిన ప్రమాదానికీ ఈ వాచీకి సంబంధముండి ఉండవచ్చునని అతననుకుంటూనే ఉన్నాడు. అందుకు కారణం అతని అంతరాత్మ. అయితే జ్యోతిష్కుడినోట ఆ మాటలు వినేసరికి అతని నమ్మకం దృఢతరమయింది. కొడుక్కే ప్రమాదమూ జరిగివుండదని జ్యోతిష్కుడనడం అతని ధైర్యాన్ని పెంచి హృదయాన్ని తేలికపరిచింది.
ఆ జ్యోతిష్కుడు వారితోపాటే టాక్సీలో ప్రయాణం చేసి హైదరాబాదు చేరుకున్నాడు. ఆయన చిరునామా అడిగి తీసుకున్నాడు వీరభద్రం-"మీరు చెప్పింది అక్షరాలా జరిగితే నేను మీచేత ఇంకా చాలా వివరాలు చెప్పించుకుంటాను...." అన్నాడు జ్యోతిష్కుడు నవ్వి వెళ్ళిపోయాడు.
వీరభద్రం దంపతులు బందువుల ఇల్లు చేరుకునేసరికి అక్కడి వాతావరణం ప్రశాంతంగా వుంది. లక్ష్మణరావు ఇంట్లోలేడు. సినిమాకో, క్లబ్ కో వెళ్ళి ఉంటాడని చెప్పారు. ఏ విధమైన టెలిగ్రామూ తానివ్వలేదని గోవర్ధనం గారు చెప్పాడు.
రాత్రి పదకొండుగంటలు దాటేక ఇంటికి వచ్చేడు లక్షణరావు. కొడుకు నాప్యాయంగా దగ్గరకు తీసుకుంది తల్లి. హఠాత్తుగా తల్లి చూపించే ఈ అభిమానానికి ఆశ్చర్యపడ్డ లక్షణరావుకి ఒక్కక్షణం ఆలశ్యంగా మిగతా వివరాలు తెలిశాయి.
మర్నాడు వీరభద్రం తనవద్దవున్న చిరునామా ప్రకారం ఆ జ్యోతిష్కున్ని కలుసుకుని తన భవిష్యత్తుకి సంబంధించిన మరికొన్ని వివరాలడిగి తెలుసుకుని ఆయనకు అర్ధ నూరుపదహార్లు సమర్పించుకున్నాడు. ఆ వెంటనే తిరుగు ప్రయాణంకూడా అయ్యాడు.
7
"ఆరువందలకి తక్కువచేయదు నా వాచీ-దాన్ని నూటయాభైకి కొట్టేశాడు. పోయినవాచీ ఎలాగూ పోయింది. కనీసం అతఃగాడికా ఖర్చేనా కావాలి. ఇద్దరూ బెజవాడదాకా ఫస్ట్ క్లాసులో వెళ్ళరా-అక్కణ్ణించి టాక్సీయా? ఆ తర్వాత తిరుగు ప్రయాణమా? ఇవికాక ఇతర ఖర్చులు. మనసునిండా దిగులు-ఇంతకుమించి నేను తీర్చుకోగల ప్రతీకారం మాత్రం ఏముంది?" అన్నాడు రామారావు.
"అయితే వాచీ పోయినందుకు మీ ఇంట్లో ఏ అరిష్టమూ జరుగలేదా?" అన్నాడు మోహనరావు.
"అది మన పిచ్చిగానీ-జరుగవలసింది వాచీలకూ, రిక్షా బంధనాలకీ ఆగుతుందా? అంతా నిక్షేపంలా ఉన్నాం. ఇంటిపనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ వాచీ పోవడం కూడా ఒకవిధంగా మంచిదేననుకుంటాను. ఒక మూఢనమ్మకం మా ఇంట్లోంచి తొలగిపోయింది....." అన్నాడు రామారావు.
"అది నిజమేకానీ-సెంటిమెంటు ప్రాణులం మనం. ఎప్పుడో అప్పుడీ బాధ మనని బాధించకపోదు...." అన్నాడింకో కొలీగ్.
"ఎందుకు బాధించదూ? సెంటిమెంటు నా మనసు లోంచి మాత్రం పూర్తిగా పోయింది కనుకనా? ఏదో ఎలాగూ పోయింది కాబట్టి సరిపెట్టుకోవడం-అంతే!" అన్నాడు రామారావు నిస్పృహగా.
"ఏమయితేనేం-మనం వీరభద్రం మీద పగతీర్చుకో గలిగాం కానీ-అతనికి బుద్దిచెప్పలేకపోయాం-అది నాకు బాధగానే వుంది...." అన్నాడింకో కొలీగ్.
"ఏంచేస్తాం? అందుకూ సెంటిమెంట్లడ్డొస్తాయి!" అన్నాడు రామారావు.
అయితే ఆ మర్నాడు తన వాచీ తనకు తిరిగిరావడంతో రామారావు నిజంగానే ఆశ్చర్యపోయాడు. దానికితొడు వీరభద్రం చెప్పిన కథ అతన్నింకా ఆశ్చర్యపరచింది. వీరభద్రం తన ఆలోచనల్లో మార్పువచ్చిన సంగతి అందరికీ స్పష్టం చేశాడు.
ఆ తర్వాత చాలామంది రామారావును కలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. జ్యోతిష్కుడు వ్యవహారానికీ అతనికీ ఏదో సంబంధముందని అందరూ అనుమానపడ్డారు.
"ఆయన ప్రముఖ జ్యోతిష్కుడు. ఆయనకూ నాకూ ఏ సంబంధమూలేదు-" అని రామారావు స్పష్టంచేశాక అందరూ వీరభద్రం పరోక్షంలో ఈ విషయాన్ని చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చారు-
వీరభద్రం మనసులో ఏమూలో తను రామారావు కన్యాయం చేశానన్న బాధ, భయమూ ఉన్నాయి, ఆ తప్పు తనకు ప్రమాదకారి కాగలదన్న బెంగవుంది. వాచీలో రక్షాబంధనమున్న విషయం కూడా అతనికి తెలుసు.
చాలామంది జ్యోతిష్కులకు ధాట్రీడింగ్ అనగా ఎదుటివారి ఆలోచనలు చదవగల శక్తి ఉంటుంది. ఆ శక్తితో ఆయన వీరభద్రం మనసులోని ఆలోచనలు చదివి జోస్యం చెప్పగలిగాడు. కాకతాళీయంగా జరిగిన ఈ సంఘటన వీరభద్రంలో పెద్ద మార్పు తీసుకువచ్చింది.
టెలిగ్రాం ఇప్పించడంవరకూ రామారావు చేస్తే, ఆపై వ్యవహారం భగవంతుడు చేశాడు, అని.
