'' లోకం, త్యాగతి మా బావ. మా అక్క ఎంత....''
'' మీ అక్క దేవత. పది హేను రోజుల క్రిందట ఈ పుస్తకం త్యాగతి నాచేతి కిచ్చాడు. అందులో చదివిన విషయాలు ఎవ్వరికీ చెప్పవద్దన్నాడు. నేను చదివి పొందిన బాధ, దుఃఖమూ వర్ణించలేనిది! హేమా, మనం చదువుకొన్నవాళ్ళం. మనకూ, మూర్ఖునికీ కూడా దుఃఖం ఒకటే, అయినా మనం దిగమింగి లోపల కుళ్ళుతాం. వాళ్ళు పైకి ఏడ్చి బాధనుండి విముక్తులవుతారు. అంతే తేడా! నీ దుఃఖం పవిత్రమైంది. నువ్వలా ఏడ్వడం మంచిదే. కాని దుఃఖాన్ని కూడా మనం సాక్షులమై దర్సించాలిగాని, మనం కూడా దుఃఖంలో భాగమైతే ఇంకేముందీ? లే! కాఫీ చేసి తీసుకురానా?''
'' నేనూ వస్తాను వంటింటిలోకి: పద''
హేమ లోకేస్వరుని కౌగిలించుకొనే వారిద్దరూ వంటింటిలోకి వెళ్ళారు. హేమకు కంటెదుట ఆమె అక్క కనిపించింది. ఆమె చిన్న నాడు తనపై చూపిన గంభీర ప్రేమ కల్లగట్టింది. '' అక్కా! నువ్వు ఎందుకు బ్రతకలేదు. నీ కిప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంది వుండును. నీ బిడ్డలు పరమ సౌందర్యమూర్త్లులుగా ఉందురు. నీ ప్రేమలో నేను ఎన్ని జీవిత రహస్యాలు తెలిసికొని ఉండేదాన్ని '' అని హేమ అనుకొంటూ కన్నీటి వెల్లువ తుడుచుకుంటూనే ఉంది. లోకేశ్వరి వెనక్కు తిరిగి చూస్తూనే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ కాఫీ తయారుచేసి హేమకు ఒక కప్పు ఇచ్చింది. ఇద్దరూ చెరో కప్పు కాఫీ తాగి మళ్ళీ పడకటింటిలోనికి వచ్చారు. అక్కడ క్రిందపరచిన తివాసీలపై పరిచారిక పడుకొని నిద్దుర పోయినది.
ఒకరి దుఃఖం ఇంకొకరికేమి అర్ధమవుతుంది! ఆమెకు యజమానురాలి ఆవేదన ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత సానుభూతి నాళాలు స్పందనం కాగా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అది మానవ సహజం. లోకేశ్వరి విద్యుద్దీపం చిన్నది వెలిగించి, పెద్దది అర్పి, పరిచారికను లేపి,వెళ్ళిపడుకోమని చెప్పి , తలుపు వేసి, పందిరిమంచముపై హేమ పక్కన పండుకొని,ఆమెను గట్టిగా హృదయాని కదుముకొంది. హేమకు నిద్రపట్టదు. లోకేశ్వరికి నిద్రపట్టదు. వారేమీ మాటలాడుకొనలేదు. గంటకు లోకేశ్వరికి నిద్ర పట్టింది.
త్యాగతి, శ్రీనాథమూర్తి, తన బావ, తన అక్క ఎక్కడ వుంది? అంతవరకు అక్క బ్రతికి వున్నట్లు, తాను చిన్న బిడ్డ అయినట్లు హేమ భావిస్తూ ఆనందపడింది.ఒకనాడు మాయమైన ఒక అనుభూతి మరలివచ్చి మరల మాయమైంది. నెమ్మదిగా లేచి సోఫామీదకు పోయి త్యాగతి పుస్తకం తెరచి అక్కగారి బొమ్మను కళ్ళకద్డుకొని తిరిగి కథ చదవటం ప్రారంభించింది.
17
నాకు ప్రాణంమీదకు వచ్చిందని మా మేనమామ కస్తూరి రఘురామయ్యగారు కుటుంబంతో వచ్చి వాలారు. మా అమ్మగారికి పోయే ప్రాణం, వచ్చేప్రాణం. కొల్లిపరలో మా అత్తగారు మూడురోజులు ఏమీ స్మారకం లేకుండా పడివున్నారట. మా మామగారు వేదాంతి. సర్వసముద్రాలుగా పొంగివచ్చిన దుఃఖాన్ని అగస్త్యుడిలా మింగివేసినారు. లోకులను దహించివేసే దుఃఖాన్ని శివుడులా కంఠంలో దాచుకొన్నారు. నడపవలసిన తంతు నడిపినారు. కంట నీరులేదు. కీళ్ళు పొదిగించిన కొయ్యబొమ్మ. కాని భోజనం లేదు. మూడు రోజులలో నల్లగా వున్న ఆయన జుట్టు తెల్లబడిపోయింది. బుగ్గలు వాలిపోయాయి.ఒళ్లంతా సడలిపోయింది. కళ్ళు గుంటలు కట్టినాయి.
మా అత్తగారి పుట్టింటివారూ, ఇంకా దేశంనిండా వున్న సర్వబంధువులూ వచ్చి వాలారు. కోటీశ్వరశర్మ, శాస్త్రిగారు వచ్చారు. ఆయన వేదాంతం కురిపించారు. ఎవరు ఏమి చెప్పినా మామగారికి ఏమీ వినిపించలేదట. కుమార్తె ఆఖరు క్షణాలల్లో''నన్నా నేను వెడుతున్నాను. మీ_అ_ల్లు_ణ్ణి_ సర్వ _కాలాలు_కనిపెట్టి_ఉండండి_నేను మళ్ళీ వస్తా_నేను _ పూర్తిగా వెళ్తున్నానా ఇక్కడే_ఉంటాను_ఆ_య_న్ను_మీకు_కొ_డు_కు. అ_మ్మ_దుఃఖం_వ_ద్దు_చెల్లెల్ని_కా_పా_డు_ఆ_య_న_పాదజలం_ఇ_వ్వం_డి_పుణ్యం_నా....కు_''అని, మంచంమీద కొయ్యై స్పృహ ఏమీలేని, నా చేయి తీసుకొని కళ్ళకద్డుకొని '' దేవీ_వస్తు_ న్నా!''అని మాయమైన విషయమే ఒక్క లిప్తవ్యవధైనా లేకుండా ఎదుట కనబడుతూ ఉండేదట ఆయనకు. ఒక్క పరమ సుశీల లోకాన్ని వదిలి మా అందరి ప్రాణం తనవెంట రాబోతే ఆపుచేయించింది కాబోలు.
మా వైద్యులు, నా కాంతిదేవత ప్రాణం కాపాడలేనివారు నా ప్రాణం, మా అమ్మ ప్రాణం, మా అత్తగారి ప్రాణం కాపాడారు. నాకు ప్రాణం మీదకు వచ్చిందంటే, మా అమ్మ బ్రతికింది. హేమ తల్లి దగ్గరకు పోయి, '' అమ్మా, అక్కతోబాటు నువ్వు వెళ్ళకే. నేనెల్లాగా! అమ్మా, అమ్మా '' అని అంటే మా అత్తగారు బ్రతికింది.
నేను మొండివాణ్ణి, తుచ్చుణ్ణి, పాపిని. నాకు ప్రాణం ఎందుకు పోతుంది! నాలో విషబీజలు ఉండడంచేత, పరమ పవిత్ర చరిత్ర నా శకుంతల వెళ్ళిపోయింది. నేనామె సంపర్కంవల్ల పవిత్రుణ్ణి కాలేనంత పాపిని అవడం వల్ల నా శకుంతల వెళ్ళిపోయింది.
నాకు కొంచెం తిరిగి నడిచే ఓపిక వచ్చేటప్పటికి మూడు నెలలు పట్టింది. మళ్ళీ కొల్లిపర మొన్న మొన్నటి వరకూ వెళ్ళలేదు. ఎంత మంది బ్రరిమాలినా వెళ్ళలేదు. నేనూ నా ఉజ్వల సౌందర్యదేవీ విలాసాల జీవించిన ప్రదేశం ఆమె లేకుండా ఎలా వెళ్ళగలను.
మా అమ్మ పేర పదిహేనెకరాల సుక్షేత్రం వ్రాశాను. ఇల్లు వ్రాశాను మా అక్కగార్లిద్దరకు చెరొక పది ఎకరాల భూమీ వ్రాశాను. శకుంతల పేరున ఒక మహిళా విద్యాలయం పెట్టడానికి ఇరవై ఎకరాల భూమి వ్రాశాను. మిగిలిన పదెకరాల భూమి అమ్మి అ ఇరవై వేలు మా అమ్మగారి పేరున బ్యాంకిలో వేశాను. బ్యాంకిలో నా సొమ్ము పద్దెనిమిదివేలు పెట్టబోయే మహిళా విద్యాలయానికి భవన నిర్మాణానికి ఇచ్చాను.
