ఆ క్షణంలో రామారావు కింకోదారి లేదనిపించింది. అతను సరేనంటూ తన వాచీని వీరభద్రాని కిచ్చేశాడు. అతనికి నూటయాభై రూపాయలూ అందాయి. ఆ డబ్బుతో జేబులతోపాటు హృదయం కూడా బరువెక్కింది రామారావుకి.
తర్వాత వీరభద్రం రహస్యంగా మోహనరావుని పిలిచి-"ఏ పరిస్థితుల్లోనూ ఈ వారం రోజులూ రామారావుకి ఆర్దికంగా సహాయపడకూడదు. మీరు నాకు చేయగలిగిన ఉపకారమిదొక్కటే-" అన్నాడు.
మోహనరావు మొహమాటంగా తలాడించాడు అతను రికామీ మనిషి. ఏదోవిధంగా సాయపడాలనుకుంటే అతనొక్కడే రామారావుకి సాయపడగలడు. కానీ ప్రస్తుతం అతనికీ శక్తిలేదు. శక్తి కూడగట్టు కుందామనుకున్నా వీరభద్రం మాటలు అతన్నందుకు సన్నద్దున్ని చేయడం లేదు.
డబ్బు తీసుకుని రామారావు తనపని పూర్తిచేసుకుని వచ్చాడు. ఇంటికి వెళ్ళేక తండ్రికి డబ్బుకోసం వాచీ తాకట్టు పెట్టవలసివచ్చిందని చెప్పాడు.
"అలా ఎందుకు చేశావ్?" అంటూ దెబ్బలాడాడు రంగనాధం.
"మరోదారిలేదు. అయినా వాచీని వెంటనే విడిపించేస్తానురా. అదీకాక ఇంట్లో ఎవరైనా జబ్బుతో ఉన్నప్పుడది తాకట్టుపెడితే అది అరిష్టంకానీ-అంతా బాగున్నప్పుడలా చేసిన ఫరవాలేదనుకుంటాను...." అన్నాడు రామారావు.
"అదికాదురా-" అంటూ ఏదో అనబోయి ఆగి పోయాడు రంగనాధం. పనికట్టుకుని అపశకునం మాట లాడడం ఆయన కిష్టంలేకపోయింది.
"ఏమీ ఫరవాలేదు నాన్నా-మీరు కంగారు పడకండి. అది మనకు అచ్చొచ్చిన వాచీ గృహనిర్మాణానికి దాని మీదుగా డబ్బురావడం శుభసూచకమనే అనుకోవాలి. త్వరలో ఎలాగూ అది విడిపించేస్తాను. ఇకమీదట అది తాకట్టుకుపోవలసిన అవసరం రానిస్థితికి మనం ఎదుగుతామని ఆశిస్తున్నాను-" అన్నాడు రామారావు. వీరభద్రం పెట్టిన వారంరోజుల షరతుగురించి చెప్పలేదు రామారావు తండ్రికి నిజం చెప్పాలంటే ఆ షరతు నతను సీరియస్ గా తీసుకోలేదు.
5
సరిగ్గా ముఫ్ఫై మూడు రోజులకు రామారావు చేతికి చెక్కు వచ్చింది. మొత్తం ముఫ్ఫైవేల రూపాయలకు ఆ చెక్కు. అతనికి ఇన్సురెన్సు పాలసీ వుంది. దానిమీద కూడా అప్పుకు అప్లైచేశాడు. అదీ త్వరలో రావచ్చు.
చెక్కు మార్చగానే రామారావు నానుతాడు విడిపించి ఆఫీసుకువెళ్ళి వీరభద్రానికి నూటయాభై రూపాయలు ఇవ్వబోయాడు. అతనికి వడ్డీ ఇవ్వాలని కూడా అతననుకోలేదు.
వీరభద్రం ఆశ్చర్యంగా రామారావువంక చూసి-"నాకు డబ్బెందుకిస్తున్నారు?" అన్నాడు అతను డబ్బు తీసుకోలేదు.
"అదేమిటండీ నా వాచీ మీ దగ్గరుంది గదా- సరదాకని మీరు వడ్డీ కూడా అడిగారు. పుచ్చుకుంటానంటే వడ్డీ ఇవ్వడానికి నా కభ్యంతరం లేదు...." అన్నాడు రామారావు నవ్వుతూ.
"భలేవారే- నేను ఏదిచెప్పినా సీరియస్ గా చెబుతాను. సరదాగా ఎప్పుడూ మాట్లాడను. వడ్డీకితప్ప అసలివ్వడం నా కలవాటులేదు-" అన్నాడు వీరభద్రం కొద్దిగా మాత్రమే నవ్వుతూ.
"పోనీ అలాగే-వడ్డీ ఎంతో చెప్పండి-" అన్నాడు రామారావు చిన్నబుచ్చుకుని.
"మీ దగ్గర వడ్డీ పుచ్చుకునే ప్రసక్తేలేదు. వారం రోజుల్లో బాకీ తీర్చకపోతే తాకట్టు వాకట్టయిపోతుందని నేను చెప్పనే చెప్పాను. ఇంక మీకూ నాకూ బాకీ ప్రసక్తి లేనేలేదు....." అన్నాడు వీరభద్రం తాపీగా.
రామారావు దెబ్బతిన్నాడు-"మీరన్నమాట నిజమే గానీ - అది నిజమని నేననుకోలేదు. లేకుంటే ఎలాగో అలా వారం రోజుల్లోనే మీ బాకీ తీర్చేసి ఉండేవాణ్ణి-"
"నేను చెప్పిన మాటలు నిజంకాదని మీరనుకుంటే అందుకు బాధ్యత నాదికాదు-" అని ఊరుకున్నాడు వీరభద్రం.
మరి కాస్సేపు మాట్లాడినాక వీరభద్రం వేళాకోళమాడడంలేదనీ-నిజంగానే అతను నూటయాభై రూపాయలకు తన వాచీని స్వంతం చేసుకున్నాడనీ రామారావు కర్ధమయింది. సాటి ఉద్యోగస్తు డింత అన్యాయానికి సిద్దపడతాడని అతనూహించలేదు.
"అది తరతరాలుగా వస్తున్న వాచీ-అది మా ఇంట్లో ఉండితీరాలి. లేకుంటే మేము సర్వనాశనమైపోతాం. అది మీరు నాకిచ్చేయాలి...." అని ప్రాధేయపడ్డాడు రామారావు.
"నేను సర్వనాశనం అవకుండావుంటే చాలు. ఎవరేమైనా నాకు ఫరవాలేదు." అన్నాడు వీరభద్రం.
వాచీ చేయి దాటిపోయిందని రామారావు కర్ధమై పోయింది. క్రమంగా వీళ్ళ సంభాషణలో మరికొంత మంది రామారావు తరఫున మాట్లాడి వీరభాద్రాన్ని రిక్వెస్టు చేశారు కానీ ప్రయోజనం లేకపోయింది. మనసులో చాలా మంది వీరభద్రాన్ని అసహ్యించుకున్నారు. పైకిమాత్రం అతన్నెవ్వరూ ఏమీ అనలేకపోయారు.
రామారావు దిగులుగా ఇంటికి వెళ్ళాడు కానీ జరిగినది తండ్రికి చెప్పలేదు. ఆ వాచీ శాశ్వతంగా తమకు దూరమయిందని తెలిస్తే సైకలాజికల్ గా తండ్రి దెబ్బ తినవచ్చునని అతనికి భయంవేసింది. కానీ అతనింటికిఆగానే తండ్రి అడగనే అడిగాడు-వాచీ గురించి.
"చిన్న రిపేరు వచ్చింది-ఓ వారం రోజులు పడుతుంది-ఇంటికి రావడానికి-" అన్నాడు ముక్తసరిగా.
వారం రోజుల్లో వీరభద్రం మనసుమారి తన వాచీ తనకు తిరిగి వస్తుందని అతని ఆశ. తండ్రి దృష్టి మళ్ళించడానికి అతను త్వరత్వరగా ఇంటి వ్యవహారాలు చూసి ఆయన్నందులో బిజీగా ఉండేలా చేశాడు.
వారం రోజుల్లో వాచీ గురించిన అతని ప్రయత్నాలు ఫలించలేదు. ప్రయత్నాలు విఫలమౌతున్నకొద్దీ అతనిలో నిరాశతగ్గి క్రోధం పెరగసాగింది. ఆఖరికి అతను-"ఆ వాచీలో మా ఇంటికి సంబంధించిన రక్షాబంధనం ఉంది. అది చేయి దాటినపుడల్లా మాకు అరిష్టం దాపురించింది. అందుకే దానికోసం అంతలా ప్రాధేయపడుతున్నాను-" అన్న నిజం చెప్పినా పనిజరగలేదు.
