"నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటే. నా బ్రతుకు నన్ను బ్రతకనీండి. మీ చర్యలతో, మీ సాన్నిహిత్యంతో , మీ రాకపోకలతో నా బ్రతుకు బయటి కీడ్చకండి. పరువుగా నన్నొక చోట పడి ఉండనీండి. ఇంతే నే మీనుండి కోరేది, ఆశించేది" అన్నాడు సూర్యారావు రెండు చేతులు జోడించి.
అన్నయ్య ఏదో అంటాడని, తను వాదించి, హటం వేసి అతన్ని దారిలోకి తేవాలని అనుకొన్నాడు ప్రకాశం. ఈ మాటలు విన్నాక ఇంకేమనాలో అతనికి అర్ధం కాలేదు. సాభిప్రాయంగా అక్క వైపు చూసేడు.
శాంతను, అన్నయ్య ఏ పరిస్థితుల్లోనూ, పెళ్ళి చెయ్యకుండా ఇంట్లో ఉంచుకొందికి ఇష్టపడడని తెలుసుకొంది జానకి. వంశమర్యాదకు, పరువు ప్రతిష్టలకు ఒక చిన్న పిల్ల జీవితం ఆహుతి కావడం ఆమెకు అన్యాయం అనిపించింది. కాలం కలసి వచ్చేదాకా శాంతను చదివించడమే మంచి పని-- అనుకొంది. కాని అన్న, ఆ మంచిని గ్రహించేందుకు కొంతకాలం పట్టవచ్చు. అంతవరకు శాంతను అతనికి ఎడంగా ఉంచక తప్పదు -- అని నిశ్చయించుకొంది.
"లే, శాంతా!' అని చెల్లెలి చెయ్యి పట్టుకు లేపింది.
"ఎక్కడికి?" అన్నది శాంత దిగులుగా అక్క ముఖంలోకి చూస్తూ.
"నా దగ్గిరుండి చదువుకొందువు గాని"
అక్క అభిప్రాయం అర్ధం చేసుకొన్న ప్రకాశం దారంటబోయే ఒక రిక్షాను అపేడు. జానకి, తనవి, శాంతవి బట్టలు ఒక చిన్న ట్రంకు లో వేసుకొని బయటికి వచ్చింది.
"ఎక్కడికి ఈ ప్రయాణం? ఏమిటే ఈ ఆగడం?' సుందరమ్మ ముందుకు వచ్చింది.
"అన్నీ విన్నావు అమ్మా! నేనేం చెప్పేది? అన్నయ్యకి మేము సుఖంగా ఉండడం కావాలిట. మాకూ అంతే కావాలమ్మా!మా నుండి అన్నయ్య అవమానాలు, పాలుకాకుండా , గౌరవంగా బ్రతకాలని నా కోరిక. అందుకే శాంతని నాతొ తీసుకుపోతున్నాను. మొగుణ్ణి వదిలి ఉద్యోగం చేస్తున్న నాకు, శాంత నా దగ్గిర ఉన్నా కొత్తగా పోయే పరువేమీ లేదు. అది ఈ మాత్రపు పనికే పోయుంటే నా దగ్గిరనుండి ఏనాడో దాటి పోయి ఉంటుంది."
"వాడేమన్నాడనే , వాణ్ణలా రచ్చ కెక్కించి మీరు వెళ్ళి పోడానికి! అప్పచెల్లెళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టేడనే అపఖ్యాతి వాడి ముఖానికి పులిమి పోవడానికి! నీకు మనసెలా ఒప్పిందే? అది చేసిన పనిని కడుపులో పెట్టుకొని, పెళ్ళి చేసి దాని బతుకు సరిదిద్దుదామని వాడు బాధపడుతుంటే , నువ్వేదో దాన్ని ఉద్దరించేదానిలా తీసుకు పోతున్నావా? నీలాగే దాని బతుకు చట్టబందలు చేద్దామనుకొంటున్నావా? నీక్కావాలంటే నువ్వు పో. శాంతని తీసుకు వెళ్ళిందికి వీలులేదు" అన్నది సుందరమ్మ కోపంగా.
"అమ్మా! తల్లివి. నువ్వనవలసిన మాటలు కావమ్మా ఇవి. శాంత బతుకు బాగుచేద్దామనే నా తాపత్రయం. శాంత జీవితానికి అన్నయ్య చూసిన దారి కన్న మంచిది చూపగలనెమో అని నా ఆశ."
"నేను అక్కతో వెళ్తాను" అప్పటికి శాంత నోరు విడింది.
"పోవే....ఫో...ఫో.... ఇక్కడుండి ఎవర్ని ఉద్దరించాలి? ఇద్దరూ కట్టకట్టుకొని చావండి. నా కాడ పిల్లలు పుట్టలేదనుకొంటాను. పుట్టిన వాళ్ళు చచ్చేరనుకొంటాను!" గోల్లుగోల్లున ఏడ్చింది సుందరమ్మ.
జానకి తల్లి ముందు మౌనంగా ఒకసారి చేతులు జోడించింది. అదివరలో ఆమె ఆలోచించినప్పుడు ఈ ఘట్టం ఇంత బాధాకరంగా ఉంటుందనుకోలేదు. తోడపుట్టిన వాళ్ళు కలిసి పెరిగి, పెద్దవడం ఎంత సహజమో, అభిప్రాయాలు ఏకీభవించనప్పుడు విడిపోవడం కూడా అంత సహజమే అనుకొంది.
కాని....
వదినగారి దగ్గిరగా వెళ్ళి నిలిచింది. కనకం కళ్ళలో నీళ్ళు తిరిగేయి.
"జానకీ!" అని కౌగలించుకోన్నది.
జానకి గొంతుకలో ఏదో అడ్డపడినట్లు అయింది.
'అప్పుడప్పుడు వస్తుంటాను లే వదినా" అన్నది కంఠం సవరించుకుంటూ.
సూర్యారావు గదిలోకి పోయి తలుపు వేసుకొన్నాడు.
"అన్నయ్యతో చెప్పు, వదినా."
జానకి, శాంత అత్తవారిళ్ళకు వెళ్ళే సమయంలో ఇటువంటి అప్పగింత మాటలు వింటాననుకోంది కనకం. ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో వినవలసి వచ్చింది! అని బాధ పడ్డది.
నలుగురూ నవ్వుతుంటే మనసు విప్పి మాట్లాడగలదు కనకం. హృదయవిదారకమైన ఇటువంటి సమయాల్లో ఆమె నోరు మూగపోతుంది. మనసు లోని బాధ కన్నీరుగా ప్రవహిస్తుంది. ఏడిస్తే కొంత బాధ తగ్గుతుందంటారు. ఏడుస్తున్న కొద్ది కనకం గుండె భారమై, ఆమెను మరీ కుంగదీస్తుంది. అయినా ఆబాధ అనుభవించడంలోనే ఆమెకు ఊరట కలుగుతుందేమో? ఆరోజుల్లా ఆమె ఏడుస్తూనే ఉంది.
* * * *
జానకితో పాటు శాంత రాకకు ప్రశ్నించలేదు అనసూయమ్మ. "తొందరగానే వచ్చేసేవే" అని మాత్రం అంది.
"అనుకొన్న తరవాత ఏ పనైనా వెంటనే చేయడం నా అలవాటు. అంతేకాక ఈరోజు మంచిరోజు" అన్నది.
తిది, వారాల రీత్యా ఆరోజు మంచిదో, కాదో జానకికి తెలియదు. కాని ఒక మంచి పనికి భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇచ్చిన రోజు, అందుకే అది మంచి రోజనే భావన ఆమెకు కలిగింది.
అనసూయమ్మ తను చెయ్యగల సహాయం జానకికి చేసింది. ఆమె ఇల్లు సర్ధించుకొనే వరకూ వారిద్దరికీ హాస్టల్లో భోజనం ఏర్పాటు చేసింది. ఇంటికి కావలసిన చిన్నా, పెద్దా వస్తువులు ఆమె సమకూర్చుకొనే వరకు తన ఇంట్లోని వాడుకోమంది. ఇంటి నుండి వస్తూ జానకీ మరీ ఇంత శూన్యంగా వచ్చిందేమిటి? ఇంట్లో పోట్లాడి కాని వచ్చిందా-- అన్న అనుమానం మాత్రం అనసూయమ్మను వదలలేదు.
జానకి బాలవిహార్ లో ఉంటె పిల్లలకు మంచిదన్న ఆమె స్వార్ధం జానకీ వ్యక్తిగతమైన విషయాలు కనుక్కొని సలహా ఇచ్చే అవకాశాన్ని అంటతొక్కింది.
అటువంటి ప్రశ్నలతో తన్ను బాధించనందుకు అనసూయమ్మకు జానకి మనసులోనే కృతజ్ఞత తెలుపుకొంది. ఇరవై రోజుల పాటు కాలేజీ కి వెళ్ళక పోవడం వల్ల, శాంతకు పెద్దగా ఇబ్బంది కలుగలేదు. తోటి పిల్లల పుస్తకాల్లోంచి నోట్సు లు కాఫీ చేసుకొంది.
ఒకరోజు శాంత పుస్తకాలు పట్టుకు వచ్చేడు ప్రకాశం.
"తీసుకొచ్చి ఇద్దామంటే తీరిక లేకపోయింది. వారం రోజులుగా నా దగ్గిరే పడున్నాయి" అన్నాడు.
"అన్నయ్యేమంటున్నాడు?" ప్రశ్నించింది జానకి.
"నేనిప్పుడక్కడ ఉండటం లేదు."
"ఏం....ఏమయింది?"

"అన్నయ్య కొంతకాలం విడిగా ఉండడం మంచిదని తోచింది."
"మేం వెళ్ళిపోయేక మళ్ళా మాటా, మాటా అనుకొన్నారా?"
ప్రకాశం జవాబు చెప్పలేదు. పనుంది, మళ్ళా వస్తానని చెప్పి వెళ్లిపోయేడు.
ప్రకాశం మాటలు శాంత విన్నది. తనకోసం వీళ్ళంతా ఇలా తలకోకదారి అయిపోయేరా? లేక ఈ విచ్చిన్నానికి తను కారణం మాత్రమేనా? అనుకొంది.
అక్క దగ్గర శాంతకు మునుపటి చనువు పోయింది. ఏమైనా చెప్పవలసి వచ్చినా మనసులో పదిసార్లు వల్లేవేసుకొని ఎలాగోలాగ అప్పచేప్పేది.
జానకి ఆమెను ఎప్పుడూ కోప్పడింది లేదు. అలాగని ఆప్యాయత చూపింది కూడా ఎక్కువగా లేదు. తరచూ మాట్లడుకోనక్కర లేకుండానే పనులు జరిగిపోయేలా ఏర్పాటు చేసింది. ఎప్పుడైనా మాట్లాడినా విధి నిర్వహణ లో తప్పొప్పులు బేరీజు వేసుకొంటున్నట్లు మాట్లాడేది. ఆ పరిస్థితిలో తను కాక ఇంకో పిల్ల ఉన్నా అక్క ఇలాగే ప్రవర్తించేదనిపించింది శాంతకు. అక్క మనసు మారిపోయింది. మనిషి కూడా మారిపోయింది -- అనుకొంది శాంత.
అక్క తనతో పూర్వంలా మాట్లాడాలనీ, తామిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకోవాలని ఆశపడేది శాంత. ఇలా ముభావంగా ఉండే కన్న అక్క తనను నాలుగుతిట్టినా, కోప్పడినా బాగుండును. కాస్తసేపు ఏడ్చి బాధపడి ఊరుకుందును. అక్క ఈ మౌనం తనను రంపపు కోత కోస్తున్నదనుకొనేది శాంత.
కాని జానకి మానసిక స్థితి శాంత కోరుకొంటున్న దానికి భిన్నంగా ఉంది. అమ్కు శాంత పట్ల ఉదాసీనత, లేదు. కాని సంతోషంగా కబుర్లు చెప్పే నిర్మలతా లేదు. తనపై వేసుకొన్న ఈ భారాన్ని తను సక్రమంగా నిర్వహించగలదా? తను సరియైనదనుకొన్న ఈ మార్గం శాంతకు ఆమోదయోగ్యమో, కాదో తెలుసుకోకుండా ఆమెను నిర్భంధంగా తనతో లాక్కు పోతున్నదా-- అని మధన పడుతుండేది.
అమ్మ, అన్న, వదిన -- అందరికి దూరమైపోయేనన్న బాధ ఆ క్షణంలో అంతగా అనుభవం లోకి రాకపోయినా, అయిన వాళ్ళతో ఈ ఎడబాటు ఆమెకు కష్టంగానే అనిపించసాగింది. అప్పుడచ్చట ప్రకాశం వచ్చేవాడు. అక్కడి కబుర్లు చెప్పేవాడు.
"అన్నయ్య కి ఒంట్లో సరిగా లేదుట. రెండు నెలలు ఆఫీసుకి సెలవు పెట్టేడు" అన్నాడు ఒకసారి.
"అన్నయ్య ని నువ్వు చూసేవా? ఎలాగున్నాడు? ఏమిటి జబ్బు?" అత్రతగా ప్రశ్నించింది జానకి.
"మునుపటి కన్న నీరసంగా ఉన్నాడు. దిగులుగా ఉన్నట్లు కనిపిస్తున్నది. అంతకన్నా నాకేం తెలియలేదు" అన్నాడు.
అన్నయ్యది శరీర రుగ్మత కాకపోవచ్చు. నలుగురిలోకి పోవడానికి ఇష్టం లేక ఇంట్లో ఉండిపోయి ఉంటాడు-- అనుకోంది జానకి.
ఇంకొకసారి మంచి కబురు తెచ్చేడు ప్రకాశం.
"వదినకి కూతురు పుట్టింది " అన్నాడు.
"ఎన్ని రోజులైంది?' సంతోషంగా ప్రశ్నించింది. జానకి.
"నిన్న దీపాలు పెట్టేసరికి వెళ్ళెను. నేను ఎప్పుడు వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా, "వచ్చేవా ప్రకాశం?" అని పలకరించేది వదిన. నిన్న బయటికి రాలేదు. ఏమో, ఎందుకు రాలేదో అనుకొన్నాను. తిరిగి వచ్చేద్దామనుకొన్నాను. కాని మనసొప్పలేదు.
"అన్నయ్యా, వదిన ఎక్కడికైనా వెళ్ళిందా?' అని అడిగెను.
"ఆ గదిలో ఉంది" అన్నాడు అన్నయ్య కొట్టు గది వైపు చూపుతూ.
వెళ్ళనా, మాననా అని నేను తటపటాయిస్తుండగా , "వెళ్ళి చూడు. మీ వదినకి కూతురు పుట్టింది' అన్నది అమ్మ.
ఒక్క ఉదుటున గదిలోకి వెళ్ళెను. వదిన నీరసంగా పక్క మీద పడుకొన్నది. పక్కలో ఎర్రగా పాప ఉన్నది. నా మట్టుకి పాప చాలా అర్భకంగా ఉన్నట్లు అనిపించింది. లేక చంటి పాపలంతా అలాగే ఉంటారో? నాకు తెలియదు మరి. నన్నుచూసి, 'వచ్చేవా ప్రకాశం! వారం రోజులై కనిపించక పొతే ఇంక రావేమో అనుకొన్నాను" అంది.
"ఎందుకు రాను, వదినా! అసలు ఈ విషయం నాకు తెలియదు. లేకపోతె, ఎన్ని పనులున్నా అలా విడిచి, రాకపోయేనా ?" అన్నాను.
వదిన ఇటు అటు చూసి, 'జానకి వెళ్ళేక ఒక్కసారి కూడా రాలేదు" అన్నాది.
"నే చెప్తాలే వదినా! పాప పుట్టిందని తెలిస్తే తప్పకుండా వస్తుంది' అన్నాను.
"పాప పుట్టి వారం రోజులైందిట. వదిన మరి మరీ చెప్పింది. ఓసారి చూసిరా" అన్నాడు ప్రకాశం.
"ఎప్పటికప్పుడు వెళ్దామనుకొంటున్నాను, ప్రకాశం. కాని అన్నయ్య మనసు కెలికి నట్లవుతుందేమోని సంశయిస్తున్నాను. తీరా వెళ్ళేక వాడేమైనా అంటే జవాబు చెప్పకుండా ఉండలేను. వాడికి మానుతున్న గాయం రేపినట్లవుతుంది."
"ఏమైనా ఓసారి వెళ్లిరా; లేకపోతె వదిన బాధపడుతుంది."
"అలాగే; ఈసయంకాలమే వెళ్తాను" అన్నది జానకి.
"అక్కా, నేనూ రానా? పాపని చూస్తాను" అన్నది శాంత.
"అక్కడ పరిస్థితి ఎలా ఉందొ, ముందు నన్ను చూసి రానీ , శాంతా! అటు తరువాత నువ్వు వేళుదువు గాని" అన్నది జానకి.
