"నాగపూర్ లో స్కూటర్ మీద జంటలు ఇంచక్కా వెళ్తారమ్మాయ్! ఇక్కడ మన ఊళ్ళల్లో ఇంకా అంత 'సివిలిజేషన్' రాలేదు గాని....." అన్నాడు.
"అదా? నాగరికత?" అని కూడా అడగలేదు పద్మావతి.
పద్మావతికి రాజు "పన్నాగం" పూర్తిగా అర్ధమయిపోయింది. ఆ రాత్రి ఆ పిల్లకి అన్నం సయించలేదు. నిద్రపట్టలేదు. కనీసం ఆ సాయంకాలం చూసిన సినీమా ఐనా నెమరువేసుకుందామంటే, సినిమా చూస్తున్నంతసేపూ తెరమీద బొమ్మలు అతుక్కుపోయినట్లు అగుపించేయేమో, ఇంత పిసరు జ్ఞాపకం రావడంలేదు.
ఎంత కాదనుకున్నా భాస్కరం - సురేఖ - వసంత పెళ్ళి, ధనమ్మగారు, జానికమ్మగారు, గతం పిక్ నిక్, ప్రేమా ఇవే జ్ఞాపకం వస్తున్నాయి!
రాజు అకస్మాత్తుగా వచ్చి తనకు పెళ్ళి సంబంధాలు తెస్తాననడం కన్నా, జయమ్మగారు రాజు మాటలకు ఇస్తున్న గౌరవం, పద్మావతి మనసులో బాధ కలిగింది.
"ఇన్నాళ్ళూ లేని ప్రేమ ఇవాళ ఒలకబోస్తున్న యితగాడిమీద అమ్మకు ఇంత అభిమానం సదభిప్రాయం కలగడం కూడా నాకర్మే" అనుకుంది.
"అంతగా బాసచేసుకున్న భాస్కరం ప్రేమకే విలువా, నిలకడా లేనప్పుడూ, ఈ బంధు ప్రేమలు ఎక్కడి మాటలు?" అనుకుంది.
భాస్కరం గారిని పెళ్ళాడకపోతే సముద్రంలో పడిపోతా ననుకుంది ఒకసారి గుంటూరులో ఉన్నప్పుడు కాని ఇప్పుడు 'భాస్కరంగారు తనవాడు కాదు'- జయమ్మగారూ, ధనమ్మగారూ, స్పష్టంగా తన చెవులబడి గుండెల్లో దూరి పేల్చేటట్లు ఆ మాటలనుకున్నాడు. తాను విన్నది.
"హూ!.... మా అమ్మాయి పెళ్ళికి వస్తావు కదూ? అన్నదా లావుపాటి ధనమ్మగారు !!! వస్తా..... వస్తా..... నెందుకురానూ?..." బాధగా కసిగా ధనమ్మ రూపాన్ని వూహించి మరీ అసహ్యించు కుంది బాధ పడింది.
'కాని తను భాస్కరాన్ని ప్రేమిస్తున్నదా?' అన్న మాట లెవరో అడిగినట్లు వినిపించింది.
"ఆహా!..... ప్రేమిస్తున్నాను." అన్నది తనలో తనే సమాధాన పరుచుకున్నట్లు.
"అయితే సముద్రంలో పడి ఇంకా చావలేదేం.?!" పద్మావతి లేచి కూచుంది.
గోడనున్న "బెడ్ లైట్" సన్నగా వెలుగుతున్నది. రాజు అవతలి గదిలో గుర్రు పెడుతున్నాడు. సుమారు రెండు మూడు గంటలసేపు, జయమ్మగారు రాజూ, అత్యవసరంగా అనేక విషయాలు మాట్లాడుకున్నారు. అలసిపోయినట్లున్నాడు బాగా హాయిగా నిద్రపోతున్నాడు రాజు.
ఐతే జయమ్మగారికి అలసటకన్నా నిద్రకన్నా కూతురి ధ్యాసయే ఎక్కువైనది. "ఏమే! మంచి నీళ్ళు కావాలా?" ఆమె లేవబోతూ అడిగింది.
"అక్కర్లేదమ్మా" వెంటనే పడుకుంది పద్మావతి.
"తను సముద్రంలో పడిపోతే......జయమ్మగారేం చేస్తుందో?....."
"అమ్మో! అమ్మ బ్రతికుండగా నేనేమీ ఇలాంటిపని చెయ్యలేను......."- పద్మావతి దుప్పటీ కప్పేసుకుంది-
"నిద్రలో కూడా కూతురికి దాహమే వేస్తున్నదో, భయమే కలుగుతున్నదోనని ఆందోళన పడిపోయే ఇలాంటి అమ్మ ఉండగా.... నేనునిస్సహాయంగా దుఃఖ పడడమేం కర్మ" అనుకుంది.
"భాస్కరం గారిని కూడా ఇలా ప్రేమించగల వాళ్ళుంటేగాని అతనికి ప్రేమ విలువ తెలిసి వచ్చేది కాధనిపించింది. కాని భాస్కరానికి జానికమ్మ సవతితల్లికదా?......అందుకనే అతగాడికి ప్రేమ ఒక బంధనంగా అనుభవంలోకి రాలేదనుకుంది పద్మావతి-పద్మవతికీ జానకమ్మ గురించి అస్సలు తెలియదు- భాస్కరం చెప్పిన మాటలు అన్నీ ఇవాళ అబద్ధాలే ఆ పిల్ల దృష్టిలో......
పద్మావతికి తన జీవితం తన కళ్ళముందు పెరిగి మొగ్గ తొడిగి పూలు పూయకుండా, వాడి మాడి రాలిపోతున్న మొక్కలా అనిపించింది బోర్లా పడుకుంది. దుఃఖ మాగలేదు.
* * *
జయమ్మగారికి కూడా మనసు ఆందోళన నతో నిండిపోయింది - రాజు మీద ఆమెకు ప్రత్యేకించి ఆప్యాయత ఏమీ లేదు. కాని రాజు రావడం- రాజు తను మాట్లాడడం ఇత్యాదులన్నీ ఆమెకు సామాజిక ప్రపత్తికి, తన వ్యక్తి గతమైన ప్రతిష్ఠ కూ చెందినవి - "తను రెండో పెళ్ళి వాణ్ణి చేసుకున్నందుకు ఇవాళ ఏకాకినై పోయాను" అనిపించడం కన్నా, సవతి బిడ్డలే అయినా, రాజువంటి హోదా, స్థాయీగల వాళ్ళు రావడం 'పిన్నీ' అని పిలవడం ఆమెకు దేవుణ్ణి "కోరగా ఇచ్చిన వరాలకుమల్లే" అనిపిస్తాయి.
"ఆయన కన్ను మూయగానే అన్ని రకాల ఉనికి ప్రతిపత్తులు మాయమయ్యాయనుకున్న నాకు, ఈ పద్మావతిని వదలిపోయారు- లేకపోతేన? నేను కూడా మీ నాన్నగారితోనే...."అని ఆమె రాజుతో భోజనాల దగ్గర మాటల సందర్భంలో అన్నది.
"ఎంతమాట! అన్నావు పిన్నీ? నాన్నగారు నీకు ఒక్క పద్మావతినేనా వదలి పోయారు? అని రాజు నొచ్చుకున్నాడు "ఛి ఛీ! ఇంత ఎరుసు చేస్తాననుకోలేదు మమ్మల్ని" అన్నాడు చెయ్యి కంచంలో విదిలించి- ఆమె బ్రతిమాలింది గనుక కాని, లేకపోతే "చెయ్యి కడిగేసుకొనేవాడు కూడా!"
జయమ్మగారికి కావల్సినదదే! రాజు మాట లలో భేషజమే ఎక్కువపాళ్ళుండుగాక, ఆమెకు అక్కర్లేదది! పద్మావతికి శిష్ట సమాజంలో చోటు "తండ్రి తరపునించి"అతని కడుపున పుట్టిన బిడ్డలనుంచీ, రావాల్సిందే! అందుకు మొదటి యత్నం తుది ప్రయత్నం కూడా ఆమె దృష్టిలో- సవతి బిడ్డలలో తాను పూర్తి సంబంధ బాంధవ్యం నెరపడమే!
"ఇవాళ ఇంక పద్మావతికి దిక్కులేదన్న బెంగ లేదు. దానికి అన్నలున్నారు. చెల్లెలుంది. హోదా ఉన్నది, సామాజిక స్థాయి ఉంటుంది" అనుకున్న దామె.
రాజు ఆమెతో ప్రస్తావించిన సంబంధం "పూర్తిగా మంచిదేనా?" అన్న సంకోచం ఒక వేపు పీడిస్తూ ఉన్నా ఆమెలో సంకోచం రెండోవైపు "ఎందుక్కాక్కూడదూ?" అనే ఆశ కూడా పొడసూపుతున్నది.
"ఐనా నపైనెల ఇక్కడికి కుర్రవాణ్ణి తీసుకొస్తాడుగా చూశాక నాలుగూ అవే తెలుస్తాయి" అనుకుందామె.
రాజు "జనార్దనం" గురించి చెప్పిన అన్నీ ఆవిడకు బాగున్నాయి గని ఆఖరి మాటగా రాజు చెప్పిన ఒక్క విషయం మాత్రం ఆమెకు ఎదలో ములుకై పొడుస్తున్నది.
రాజు చెప్పాడు "జనార్దనం నాకన్నా కాస్త చిన్న వాడే ననుకుంటాను..... అతనికి పాతికెకరాల మాగాణితో ఇరవయ్యోఏట పెళ్లైంది. కాని కర్మవశాత్తు ఆ అమాయి, ఇల్లు కాలిన ప్రమాదంలో వల్ల వూళ్ళోనే మరణించింది....."
"ఇంత అల్లారు ముద్దుగా పెంచి, చుద్వు చెప్పించి, ద్వితీయం ఇవ్వమంటావా? రాజూ!" అన్నదామె శూలంతో పొడిచినట్లు బాధపడుతూ.
"అదేమిటమ్మా? అలా అంటావ్? .... ఆ అమ్మాయికి ఇరవై ఏళ్లు కూడా ఉండేవికావట? చిన్నతనంలోనే దైవికంగా జరిగిన దానికి, అతని వయస్సుకీ ఎలా ముడిపెడ్తావు? చెబుతున్నా నుగా.... నాకంటే చిన్నవాడనీ....." అన్నాడు రాజు.
"వయస్సు గురించి కాదు బాబూ నా బాధ...." అన్నదామె.
"మరి గారాబం విషయంలోనా? సుఖంలోనా? ఇలాంటి విషయాలలో మన పిల్లకి తక్కువ చేస్తాడనా?" రాజు రెట్టించి మరీ వాదించాడు. "ఆ బెంగ నీకు వద్దు? జనార్దనం నా ప్రాణ స్నేహితుడు .....చదరంగంకన్నా వ్యసనం గానీ, నల్లుల్ని చంపడంగన్నా హింసాయుత కాండగాని అతనికి అంట గట్టడం ద్రోహం అనుకో" అన్నాడు.
పైగా రాజు నేరుగా జయమ్మగారినే ఉదాహరణ పాలుజేశాడు.
"నాన్నగారికన్నా నువ్వు ఎంతో చిన్నదానివి-మేం పుట్టాకా, మా అమ్మ ఉండగా ఆయన నిన్ను పెళ్ళి చేసుకుని పువ్వుల్లో పెట్టి చూసుకోలేదా?" అని అడిగాడు.
జయమ్మగారు మాటాడలేదు.
"చాలా రాత్రైంది. పడుక్కోబాబూ? నీవు అన్నీ తెలిసిన వాడవు నీమాటే కానిద్ధామూ" అన్నది బలవంతంగా ఎవరో అనిపిస్తున్నట్లు! "దేనికైనా దైవేచ్చ కావాలి కదా?" అని కూడా చెప్పింది.
రాజుమాత్రం ఆమెను జనార్దనం గురించి ఒప్పించడానికి దైవేచ్చగన్నా తన ప్రయత్నమే అవసరమని గ్రహించాడు.
"మనం పద్మావతికి అతగాడు ఇదివరకు ఒకసారి పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పనే వద్దు" అన్నాడు.
జయమ్మగారికి "టాను కూతురికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నానా?" అన్న మాట కూడా తోచక పోలేదుగాని ఆమె నిస్సహాయత అలాంటిది.
రాజు మాటలకు "అలాగే" నన్నది ఆమె.
ఆ రాత్రి తెల్లార్లూ రాజు గుర్రును జయమ్మ గారు విన్నది. పద్మావతీ విన్నది. గని ఒకరి కొకరు నిద్రపోలేదన్న విషయం మాత్రం పద్మావతీ జయమ్మగారూ ఇద్దరూ తెలియనివ్వలేదు.
మర్నాడు ఉదయం రాజు తన పథకానికి ప్రాతిపదిక పూర్తి అయిందన్న ధీమాతో వెళ్ళిపోయాడు. పద్మావతిని "స్టేషనుకు వస్తావా? ఎమ్మే చదువుకుంటున్న చెల్లాయ్ వికదా? నా కాదో గొప్ప-" అన్నాడు.
పద్మావతి మాట్లాడలేదు. తలదించుకుంది.
జయమ్మగారు "పార్వతినైతే ఇలా అడుగుతావా?" అని లోలోపలే అనుకుంది బయటకు మాత్రం నవ్వుతెచ్చుకొని
"ఊరికే అలా అన్నావుగాని, ఈడొచ్చిన చెల్లెల్ని నువ్వు స్టేషన్ కు దిగబెట్టమంటావా?" అని సర్దిపుచ్చింది.
మొత్తానికి రాజు జనార్ధనం గురించి జయమ్మగారి మనస్సును పూర్తిగా నింపేసి వెళ్ళిపోయాడు. వరద వెళ్ళిపోయినా అది వదిలిన వెలితి పోలేదన్నట్లు పద్మావతి "డీలా"గా క్లాసుకి వెళ్తానని-లైబ్రరీకి వెళ్ళింది! "ఎక్కడికి వెళ్తే మాత్రం ఏం ప్రయోజనం!"
45
భాస్కరం చెల్లెలికేసి చూసినప్పుడల్లా ఆ పిల్లలో ఒక కొత్తదనం కనిపిస్తున్నది. జానికమ్మగారికి 'నోములూ-వ్రతాలు', పంచాంగం, మంచీ చెడ్డా సంప్రదాయం, 'సారె-చీరె' ఇలా అంతా వసంత ఆలోచనగా అయిపోయింది. సురేఖ దగ్గరకు వెళ్ళిన భాస్కరాన్ని ధనమ్మగారు చాలా ఆదరం చేసింది.
"సురేఖను నీ సాయన పంపడంగన్నా నేకోర గలిగేది ఏమున్నది బాబూ!" అన్నదామె.
అంతలో సురేఖ వచ్చింది. 'గుడ్ మార్నింగ్' అన్నాడు భాస్కరం ఆమెను సూటిగా చూడకుండానే.
"నాకు ఇంకా చాలా నీరసంగా ఉంది దొడ్డమ్మా!" అంది సురేఖ భాస్కరానికి ప్రత్యభివందనం చెయ్యకుండానే.
"మరోవారం రోజులు రెస్టు తీసుకొంటాను. భాస్కరంగారికి పాఠాలు పోతాయి. ఆయనకి ఈ ఏడాది పరీక్షలున్నాయి!" అంటూ సురేఖ భాస్కరాన్ని చూసింది. ఆ చూపులో 'నేను నీతో రాను' అన్న సూచన స్పష్టంగా ఉంది.
ధనమ్మగారికి ఈ మాటలు నచ్చలేదుగాని చిక్కి నీరసంగా ఉన్న సురేఖ కేసి చూసి-"సరే! మీరాలోచించుకోండి! మీ ఇష్టమే నా ఇష్టం. వెళ్ళి కాఫీ తెమ్మంటాను అయ్యర్ ను" అంటూ ఆమె లోపలికి వెళ్ళింది.
"మీరు చాలా చిక్కిపోయారు" - భాస్కరం అన్నాడు.
"మరేం ఫర్వాలేదు లెండి!" సురేఖ తనను అసహ్యించుకుంటున్నదా? అన్న బాధకలిగింది భాస్కరానికి.
"నేను కూడా ఈ వారం రోజులూ ఉండిపోనా?"-
"దయచేసి ఆ పని చేయకండి. నేను నూతులో పడిపోవాల్సి వస్తుంది" సురేఖ నొచ్చుకుంది.
భాస్కరం నోరు పెగల్లేదు.
"వెళ్ళండి పాఠాలు చదువుకోండి- చాతనైతే ఈ వారం రోజుల్లోను మీ పద్మావతిని మీరు దక్కించుకోండి-నన్ను నీచపర్చకండి!"-సురేఖలేచి అక్కన్నించి వెళ్ళిపోయింది.
మూర్తి దగ్గర్నించి ఆ ముందురోజు సాయంకాలం ఒక ఉత్తరం వచ్చింది. "నీ మౌనం ఎంతమందిని క్షోభ పెడుతుందో తెలుసా?" అని రాశాడు వాడు-
భాస్కరం మగవాడు గనక కన్నీళ్ళు కనుకొలకులలోనే ఆగిపోయాయి!
ధనమ్మగారితో "శలవు" అన్నాడు లేచి.
"కాఫీ తాగందే వెళ్ళకు బాబూ!" ఆవిడకు తన హోదా ముఖ్యం.
కాఫీ నిలబడే తాగుతున్నాడు భాస్కరం.
"చేదుగా ఉందా?" ధనమ్మగా రడిగింది.
"లేదండీ! సురేఖతో చెప్పేశాడు. మళ్ళీ రేపు వస్తాను"-ధనమ్మగారి జవాబు వినకుండా వెళ్ళిపోయాడు భాస్కరం.
సురేఖ, పద్మావతి, ఇద్దరి దృష్టిలోనూ నీచుణ్ణి' అయ్యాను-ఒక 'పిన్ని' దగ్గర నాలుగు సంగతులు చెప్పి 'ద్రోహి' ననిపించుకుంటాను-ఆ తర్వాత?........
భాస్కరం తమ పద్మావతిని ప్రేమించడం తప్పు అని పదేపదే అనుకున్నాడు. అసలు ప్రేమించగలవాడు ప్రేమను నిభాయించలేకపోడం బలహీనతా, పిరికితనమా?.......
సురేఖ తనతో రానంది.
నిజమే. తనతో వచ్చి అపవాదు మోయడం కన్నా, పద్మావతిచేత అనరాని మాటలు అనిపించుకోడంకన్నా, సురేఖకు 'జ్వరం' ఎక్కువైనా మంచిదే!
"సురేఖ కెలా ఉంది ఒంట్లో?" జానికమ్మ గారు "భాసడి" దగ్గరగా వచ్చింది.
"మరోవారం రోజులు రానంది. ఇంకా నీరసం పోలేదు."- ముక్తసరిగా అన్నాడు.
"నీ పెళ్ళి అవ్వాలి. అప్పుడూ నాకు చింతలేని మాట-" ఆమె నిట్టూర్చింది: "పోనీ నువ్వు సురేఖ శలవు చీటీ పట్టుకెళ్ళు" అన్నది. కొడుకును పాఠాలు, బడీ మానిపించడం ఇష్టంలేక.
"ఊ" భాస్కరం పెట్టె తాళం వేశాడు.
"నిజంగా ముకుందమూ, వసంతా కూడా ఈడూ జోడూగా ఉన్నారు- అలాగే నువ్వూ సురేఖా....."
"పిన్నీ!....." పిచ్చివాడిలా కేక వేశాడు భాస్కరం. ఆమె చకితయై అంతలో తేరుకుని "భాసా! భాసా!" అన్నది గాభరా పడుతూ. కూల బడ్డాడు అక్కడే భాస్కరం.
"నేను సురేఖను పెళ్ళాడలేను పిన్నీ!" అన్నాడు.
"మాట ఇచ్చాను భాసా!" ఆమె భాస్కరం మొహంలోకి బెంగగా చూస్తూనే కన్నీళ్ళు నింపుకుంది. "ఇప్పుడు వాళ్ళు మనల్ని నీచంగా చూడరూ?" అన్నది ప్రాధేయపూర్వకంగా.
