Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 33


    ఎట్టకేలకు , రాత్రి తొమ్మిదిన్నర దాటింది. వీధి వాకిట్లో పిల్లల గొడవ, శాంత మాటలు-- మధ్య మధ్య గోపాలరావు నవ్వుతూ చెప్తున్న కబుర్లు , వాటన్నింటి తో పాటు కళ్యాణి గొంతు అన్నీ కలగాపులగం గా వినిపిస్తున్నాయి.
    కళ్యాణి తమ వాటా వేపుకి వచ్చి తలుపులమీద చెయ్యి వెయ్యగానే అవి తెరుచుకున్నాయి.
    'లోపల గడియ పెట్టుకోటం మరిచి పోయారా ఏమిటి?' అనుకుంటూ తను లోపలికి వచ్చి తలుపులు మూసి గడియ పెట్టి ఆ గదిలో లైటు అర్పి, సంబరంగా 'సినీమా ఎంత బాగుందను కున్నారు-- రేపు మళ్లీ మనం ఇద్దరం వెళ్దాం.' అంటూ లోపలికి వచ్చిన కళ్యాణి గదిలో కుర్చీలో కూర్చున్న భర్తని చూసి గతుక్కుమంది.
    తమ ఇంటి నుంచి బయలుదేరే సరికి అంత సరదాగా సంతోషంగా, చిలిపిగా వున్న భర్త ఇప్పుడేమిటి ఇలా వున్నాడు-- ఈ మధ్యలో ఏదైనా దుర్వార్త వినలేదు కదా -- లేకపోతె హటాత్తుగా ఏ జ్వరమైనా రాలేదు కదా అనుకుంటూ దగ్గరికి వెళ్లి అతని నుదుటి మీద చెయ్యి వేసి చూడబోతూ.
    "ఇలా వున్నారేం ? అంది.
    'ఎలా వున్నాను నిక్షేపంలా వున్నాను' అన్నాడు మురళీ కళ్యాణి చెయ్యి తన నుదిటిని తాకకుండా తప్పించు కోవటా నీకా అన్నట్లు విసురుగా లేచి నిలబడుతూ. అతని ధోరణి కి కళ్యాణి మనస్సు చివుక్కు మంది. అయినా ఇంకేమీ అడగకుండా తిన్నగా వంట గదిలోకి వెళ్ళింది. వడ్డన ప్రయత్నం చేద్దామని-- తీరా మూటలు తీసి చూస్తె    అన్నం కూరే రెండూ కూడా మసి బొగ్గులై పోయి వున్నాయి. 'వారి చిరాకుకు కారణం ఇదన్న మాట.' అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి వరండా లో మురళీ కనిపించాడు.
    'అన్నం పూర్తిగా మాడిపోయింది -- మళ్లీ కాసిని బియ్యం కడిగి పడేస్తాను-- ఎంతసేపు? నేను చీర అవి మార్చుకుని వచ్చే లోపున అయిపోతుంది.' అంటూ బియ్యం డబ్బా మూత తెరవబోతుంటే .
    'నాకేమీ అక్కర్లేదు-- నీక్కావలిస్తే వండుకో-- ఆ మాట చెప్దామనే వచ్చాను' అన్నాడు మురళీ.
    'నేను మరో రెండు నిముషాలు ఆగి వెళ్తే సరిపోయేది-- మీరు చూస్తానన్నారు కదా అని........'
    'అవును -- చూడకేం చేస్తాను? నువ్వు వూరి మీద ఊరేగు తుంటే నేను ఇంట్లో కూర్చుని వంట చేస్తాను.'
    కళ్యాణి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి -- ఈ కాస్త డానికే ఇంత రాద్దాంతం చెయ్యాలా అనిపించింది --
    'అసలు నేను వెళ్ళ నంటే మీరేకదా బలవంతం చేసి' మాట మధ్యలోనే ఖస్సుమన్నాడు మురళీ.
    'అవును అన్నీ నేనే చేశాను. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో గ్రహించు కోలేని చవట ని కనక ఆవిడ అన్నదానికి తల తాటించాను....నీకయినా సిగ్గు వుంటే , ఇంట్లో మొగుడ్ని వాడి ఖర్మానికి వదిలేసి హాయిగా పరాయి మొగ వాడితో సినీమాకి వెళ్తావా? చూసిన పదిమందీ ముక్కు మీద వేలు వేసుకుంటారు అనే జ్ఞానమైనా వుందా నీకు?'
    కళ్యాణి మనస్సు భయంతో సంకోచంతో వులిక్కి పడింది-- అతని కోపానికి కారణం అర్ధం అయింది. మెల్లిగా నచ్చ చెప్తున్నట్లు అంది. 'అక్కయ్య వచ్చి పిలిస్తే ఇది కేవలం ఆడవాళ్ళ ప్రోగ్రామే అనుకున్నాను-- ఏమిటో ఆసంగతి ప్రత్యేకంగా అడగాలని కూడా తోచలేదు-- తీరా బయల్దేరాక బావగార్ని చూశాక తెల్లబోయాను. నా మనస్సులో భావం గ్రహించినట్లే అంది అక్కయ్య 'మా ఇంట్లో అందరికీ సరిపోగా ఇంక ఒక్క టిక్కట్టే మిగిలింది  , నిన్ను సరదాగా తీసుకు వెళ్దామని పిల్చాను అని......
    'ఒక్క టిక్కెట్టే మిగిలిపోతే చించి అవతల పారేయాల్సింది. లేకపోతె ఏ దారిన పోయే దానయ్య కిచ్చినా సంబరంగా భుజాలు ఎగుర వేసుకుంటూ సినీమాకి తయారయ్యేవాడు. అంతేకాని ఇద్దరు వుంటున్న కుటుంబంలో ఒకరిని వదిలేసి ఇంకొకరి పిలిచి తీసుకు వెళ్ళటానికి ఎంత బుద్ది ;లేకపోయింది అంట ' బుద్ది లేకపోవడం కాదులే కావాలనే చేశాడు . ఇదంతా ఆ గోపాలం గాడి పన్నాగం -- ఇంట్లో వున్న పెళ్లాన్నే కాకుండా పరాయి ఆడవాళ్ళ ని కూడ వెంట బెట్టుకుని తిరిగి సరదా తీర్చు కుందా మనుకుంటున్నాడు-- ఛీ-- కుళ్ళు బుద్దులు' రేగిపోయాడు మురళీ.
    బొటబొట కన్నీళ్లు కారుస్తూ గుమ్మం దగ్గర నిలబడిపోయిన కళ్యాణి విలవిల్లాడి పోతున్న గొంతుతో అంది.  'ఎంత ఇదిగా ఆలోచిస్తున్నారు మీరు....అక్కయ్య కాని బావగారు గాని అసలు అంత దూరం అలోచించలేదేమో? ఒక్క పాసు వృధా చెయ్యటం ఇష్టం లేక , మళ్లీ మిమ్మల్ని వేరే డబ్బు పెట్టి టిక్కట్టు కొనుక్కోమనడం ఇష్టం లేక సరదాగా నన్ను తీసుకు వెళ్దామని అనుకుందేమో. అసలు ఎవరెవరు వెళ్తున్నారని నేను మొదటే అడిగి వుంటే తీరిపోయేది -- ఛ, నాకు బొత్తిగా బుద్ది లేదు....అయినా అంతా నా తప్పే అంటారా? అసలు నేను వెళ్ళను మొర్రో అంటుంటే వెళ్ళు వెళ్ళు అని అప్పుడు బలవంతం చేసి పంపించి, ఇప్పుడు అలాంటి అభాండాలు వెయ్యటానికి మీ మనసెలా ఒప్పింది?'
    'నిజమే నేను అభాండాలు వేస్తున్నాను-- నేను వుత్త కుళ్ళు వెధవని-- హాయిగా వాళ్ళందరి తోటి సినిమా చూసి వచ్చిన నువ్వూ, మంచి మర్యాద తెలియకుండా నన్ను రమ్మని మాట మాత్రం అయినా పిలవకుండా నిన్ను వెంట బెట్టుకు పోయిన వాళ్ళూ చాలా మంచివాళ్ళు-- ఇంక నన్ను మాట్లాడించకు' అనేసి విసురుగా గదిలోకి వెళ్ళిపోతూ కసి చల్లారనట్లు మరో మాట కూడా విసిరాడు. 'ఎవరెవరు వెళ్తున్నారు అని అడగాలని నీకు తోచలేదన్నావు-- నిజమే ఎలా తోస్తుంది మరి-- ఆరోజు గుర్తుందా, వేములవాడ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆఖరు నిముషం లో శారదక్కయ్య రావటం మానేయ లేదా-- నీకు అంత ఆలోచన ఎలా వుంటుంది లే...?'
    మొనలు దేరి వాడిగా వున్న కంకర రాయి తీసుకుని సూటిగా గుండెలకి గురి చేసి కొట్టినట్ల యింది కళ్యాణి కి-- చూస్తూండ గానే ఆమె మొహం కళావిహీనం అయి పోయింది.
    'ఆ సంఘటన అంతా కళ్ళక కట్టినట్లుగా అనిపించింది...ఓ రోజు మురళీ వాళ్ళు వాసు వాళ్ళింటి కి వెళ్ళారు. వాసు స్నేహితుడు మార్టీ అతని భార్య మాలతీ కూడా వాళ్ళింట్లో వున్నారు. వాసు అందర్నీ పరిచయం చేశాడు. మాటల సందర్భంలో వేములవాడ ప్రస్తావన వచ్చింది -- మనం దర్శించు కోవలసిన పుణ్య క్షేత్రాలలో వేములవాడ ఒకటనీ అక్కడి ఆలయంలో రాజరాజేశ్వారీ దేవికి పూజార్చనలు చేయించి రావాలని తనకి ఎప్పటి నుంచో కోరికగా వుందనీ శారద అంది. 'అయితే అందరం కలిసి సరదాగా వెళ్దాం. నాకూ రావాలని వుంది.' అంది మాలతీ -- మూర్తి కి కారు వుంది-- 'మీరిద్దరూ కూడా రండి-- మా కారులో సరదాగా వెళ్లి వద్దాం అని మురళి ని కూడా ప్రయాణం చేశాడు మూర్తీ. కాస్సేపు కాదనీ కాస్సేపు ఔననీ తర్జన భర్జనలు అయాక ఆ మూడు కుటుంబాలు మూర్తి కారులో వెళ్లి రావటానికి నిర్ణయం జరిగిపోయింది-- వెళ్ళటానికి తేదీ కూడా నిర్ణయించుకుని అంతా ఆఫీసుల్లో రెండు రోజులు శలవ తీసుకోవాలను కున్నారు.
    తీరా అంతా సిద్దం అయ్యాక, ఇంక రేపు వుదయం ప్రయాణ మనగా ఆ సాయంకాలం వాసుకి ఆఫీసులో అనుకోకుండా అర్జెంటు పని పడింది. మర్నాడు ప్లేను లో బొంబాయి నుంచి వాళ్ళ కంపెనీ సేల్సు   డైరెక్టరు వస్తున్నారు. అతను హైదరాబాదు లో వున్న రెండు రోజులూ అతని వెంట వుండటమే కాకుండా అతనితో పాటు విజయవాడ వైజాగ్ బ్రాంచీల కి కూడా వెళ్లి రావాల్సిన బాధ్యత వాసు మీద పడింది. అతను ఆ సెక్షను ఇన్ చార్జి కావటం వల్ల-- ఆ కారణం తో ఎంత లేదన్నా మరి పది పదిహేను రోజుల దాకా వాసు శలవ తీసుకోటానికి వీలుపడదు-- పోనీ అప్పుడే వెళ్దామంటే సరిగ్గా ఆ టైములో మాలతి తమ్ముడి పెళ్లి వుంది. ఆ తరువాత మూర్తి కి టూర్ ప్రోగ్రాం ఇలా బోలెడు ఇబ్బందులు జాచుకు కూర్చున్నట్లే ఒకదాని వెంట ఒకటి కనిపించటం తో పెట్టుకున్న  ప్రోగ్రాం మానటం ఎందుకనీ మిగిలిన వాళ్ళందర్నీ వెళ్లి రమ్మని సలహా ఇచ్చాడు వాసు-- సరదాగా ప్రయాణం అయిన వాళ్ళలో ఒకడు వుండి పోవటం అంటే అందరికీ ఎలాగో అనిపించినా బట్టలు అవీ సర్దేసుకుని దారిలోకి టిఫిన్లు, దగ్గర నుంచీ తయారు చేసుకుని అంతా రెడీ అయిన ప్రయాణం మానుకోవటం ఎందుకని సరే అంటే సరే అనుకున్నారు.
    'నేను రాను' అంది శారద ఉన్నట్లుండి.
    'అదేం? నాకేమయినా ఇబ్బంది అవుతుందని నాకోసం వుండి పోతున్నావా? రేపూ ఎల్లుండి ఈ వూళ్ళో నే వున్నా నాకు వూపిరి సలపని పని వుంటుంది. ఇంటికి వచ్చి భోజనం చెయ్యటానికి కూడా వ్యవధి వుంటుందో వుండదో -- ఆ తరువాత నేనెలాగూ టూర్ లో వెళ్ళాలి . ఈమాత్రం దానికి నువ్వు ప్రయాణం మానుకోటం ఎందుకు? సరదాగా వెళ్లిరా.' అన్నాడు వాసు.
    'అబ్బే అందుకోసరం కాదు.' నసిగేసింది శారద.
    'మరేమిటి అభ్యంతరం?' అన్నట్లు అయిదు జతల కళ్ళు ప్రశ్నార్ధకంగా చూశాయి.
    'మీ రెండు జంటలూ సరదాగా చిలో బోలో మంటూ వెళ్లి రాక పానకంలో పుడకల్లా నేనూ పిల్లలూ కూడా ఏమిటి?' అంది శారదా నవ్వుతూ.
    ఆ తరువాత ఎవరు ఎంత చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. చివరికి మూర్తీ మాలతీ, మురళీ కళ్యాణి మర్నాడు అనుకున్న వేల్టి కే మూర్తి కారులో బయలు దేరారు.
    'ఆ శారద గారు క్రితం శతాబ్దంలో పుట్టాల్సిన మనిషేమో అనిపిస్తుంది నాకు.' కారు ముందు సీటులో భర్త ప్రక్కని కూర్చున్న ,మాలతి అంది.
    వెనక సీటులో కూర్చుని, చూపు అనేటంత దూరం వరకూ ఎదురుగా కనిపిస్తున్న నల్లటి తారు రోడ్డు నీ దాని కిరు ప్రక్కలా పెద్ద పెద్ద కొమ్మలతో విశాలంగా విస్తరించుకుని చల్లటి నీడని ఇస్తున్న మహా వృక్షాలనీ , వాటి వెనకగా రోడ్డు కి రెండు వేపులా ఏపుగా పెరుగి బరువైన వెన్నులతో కోతకి సిద్దంగా వున్న పంట చేలనీ చూస్తూ పరధ్యానంగా వున్న మురళీ కళ్యాణి కూడా ఆవిడ మాటలు విని ఒక్కసారి మన ధ్యాసలోకి వచ్చారు.
    'మీకలా ఎందుకనిపించింది?' అన్నాడు మురళీ.
    'లేకపోతె ఏమిటండీ -- తమ్ముడూ తమ్ముడూ అంటూ మీ ఇద్దరితో అంత బాగా ఖబుర్లు చెప్తారు కదా-- అలాంటి మీతో ప్రయాణం చెయ్యటానికి ఆవిడ అంత అభ్యంతరం మొదలు పెట్టినట్లు? మేం కూడా వుందనే వున్నాం కదా.....'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS