Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 31


    నన్ను కన్నతల్లిగా కాకపోయినా, నిన్ను పెంచి పెద్దచేసిన పనిమనిషిగా అయినా నీకు చూడాలనిపిస్తే రా! అనూరాధకు ఆశీస్సులు.
                                                                                     ఎదురు చూస్తూన్న
                                                                                            అమ్మ."
    ఆ ఉత్తరం చదివి భారంగా, బాధగా కూర్చుండిపోయాడు ఒడిలో కాగితాలతో. పైన తిరుగుతున్న ఫాన్ గాలికి ఎగురుతున్న కాగితాలవంక చూస్తూంటే చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చింది. వెంటనే లేచి సొరుగు తెరిచి చూచాడు. ఊరు వెళ్లేముందు కృష్ణమూర్తిగారు పంపిన ఉత్తరం అది. ఆరోజు ఆ విసుగులో ఆ కాగితాల్ని ఇంట్లో పడేసి వెళ్ళాడు. అప్పుడున్న కోపం ఇప్పుడు లేదు. ఆరోజున్న ఆవేదన ఈరోజు లేదు. మనస్సుకు కలిగే బాధను కాలమే మాన్చాలి. అనూరాధ సాంగత్యంలో, సున్నితమయిన ఆమె సమక్షంలో చాలా మనస్తాపాల్ని మరిచిపోగలిగాడు. అనూరాధ తనలోని మార్పుకు కారణమడుగుతుందేమో అనుకున్న శ్రీనివాస్ కు ఆశ్చర్యమే ఎదురయింది.
    సొరుగులోనించి కాగితాలు తీసి చదవసాగాడు. పూర్తి చేసి సాలోచనగా ఉండి పోయాడు. ఈనాటి తనకు కారకులయిన ఇద్దరూ వారి మనస్స్థితుల్ని విడమర్చి చెప్పారు. ఆ ఇద్దరు ఆశించింది ఉన్నతినే! చివరికి కలిగించినది మనోవేదనే! ఏమిటీ విచిత్రం! క్షేమం కాంక్షించేవారిని క్షమించగలిగే శక్తి తనలో లేదా? అన్నివిధాలా ఆశక్తుడినయ్యానేమిటి? 'అమ్మా.... నీమీద నాకు కోపం లేదు. అభిమానం అంతకన్నా లేదు. నా ఈ భావాలను అదుపు చేసుకునే శక్తి నాకులేదు. ఇంతకన్నా నీకు నా దగ్గిర సమాధానం లేదు' అనుకున్నాడు.

                                    38

    లలితా కృష్ణమోహన్ ల వివాహం వైభవంగా జరిగింది. మొదట్లో శ్రీలక్ష్మికి అంత ఇష్టంలేకపోయినా వద్దనడానికి తగిన కారణం లేకపోయింది. తగదని తోసిపుచ్చి ముక్కు మొహం ఎరగని పరాయిపిల్లను తెచ్చుకున్నంత మాత్రాన లలితకు ఉన్న అభిమానం ఆ పిల్లకు ఏముంటుందనుకుంది.
    సావిత్రికి వివాహానికి ప్రత్యేక ఆహ్వానం వెళ్ళినా, ఆరోగ్యం బాగులేని కారణంగా వివాహానికి రాలేదు. ఆ కుటుంబానికి అత్యంతాప్తులయిన కృష్ణమూర్తి గారు ఆహ్వానం అందుకున్నా, రావడానికి ఆయన మనస్సంగీకరించలేదు.
    అనూరాధ కానుపయ్యేవరకు ఇక్కడే ఉండాలన్న అభ్యర్ధనకు అడ్డు తగిలాడు శ్రీనివాస్. ఉండేది ఊళ్లోనే కదా? ఎప్పుడవసరమయితే అప్పుడే వస్తుందని ఒప్పుకోలేదు.
    "మిమ్మల్ని ఒక్క విషయం అడగాలని ఉంది. బాధపడరు కదూ!" అంది అభిమానంగా అనూరాధ శ్రీనివాస్ తో.
    తన విషయం అడుగుతుందేమోననుకున్నాడు. "ఏమిటీ?" అన్నాడు.
    "మీకు, మీ అమ్మగారికి మధ్య బొత్తిగా రాకపోకలు తగ్గిపోయాయి. ఉత్తరాలుకూడా నడుస్తున్నట్లు లేదు. నేను ఎప్పుడో రాసిన ఉత్తరానికి అక్కడ నుండి సమాధానం రాలేదు. ఈ మౌనానికి వెనక ఏదో కారణం ఉందేమో ననుకుంటున్నాను."
    "ఇక నాకు, మా అమ్మకు మధ్య ఏమీ సంబంధంలేదు, రాధా!"
    ఆశ్చర్యంగా చూచింది. విశాలమయిన కళ్ళలో అనుమానం పొడచూపింది. "అదేమిటీ?" అంది ఇంకేమనాలో తెలియక.
    "అదంతే!"
    "కారణం ఉండాలిగా ఏపనికయినా?"
    "లేదని నేననలేదుగా."
    "మీరంత కుప్తంగా మాట్లాడితే నే నేమనను? అది వినేందుకు నాకు అర్హత ఉందనిపిస్తే చెప్పండి. మీరు అత్తగారికి తెలియపరిచారో లేదో, పాప పుట్టబోతున్నట్లు. మా అమ్మ రాయించిందిట."
    సూటిగా చూచాడు.
    "ఈ విషయం నాకూ తెలియదు. ఉత్తరం రాశాక నాకు చెప్పింది. కబురు తెలపడం మన ఆచారంట! ఇవాళే మీ అమ్మగారి దగ్గిర నుండి జవాబు వచ్చింది, ఎవరిద్వారానో సారె పంపుతున్నట్లు. అయినా మీకీ మౌనం తగదు. మీరుకాక ఆవిడికి ఎవరున్నారు? పాప విషయం వింటే మనకంటే ఆవిడ ఎక్కువ సంతోషిస్తారు." ఇంకా ఏదో అనబోయి శ్రీనివాస్ మొహం చూచిఊరుకుంది.
    కొంతసేపు ఆలోచనానిమగ్నుడయి, లేచి బీరువాలోనించి రెండు ఉత్తరాలు తెచ్చి అనూరాధ ఒడిలోకి విసిరివేశాడు.
    "ఈ ఉత్తరం చదువు. నువ్వు అడగకపోయినా, హఠాత్తుగా మార్చుకున్న నా నిర్ణయానికి కారణం నీ మనసు వెతుకుతూందని నాకు తెలుసు. ఇంకముందెప్పుడూ అమ్మ విషయం నాముందు ప్రస్తావించకు" అని మేడమీది వెళ్ళిపోయాడు.
    అతను వెళ్ళినవైపు చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చి, ఉత్తరాలు చదవడంలో నిమగ్నఅయింది. కృష్ణమూర్తిగారు రాసిన ఉత్తరం అది.
    "చి. శ్రీనివాస్ కు,
    ఈ ఉత్తరం రాసిందెవరో తెలుసుకుంటే చదవాలన్న కోరికకూడా నశించేఅంత ద్వేషం నీలో బయలుదేరుతుందాని తెలుసు. ఈపాటికి నేను ఊరు వదిలిపెట్టిన విషయం, నా రాజీనామా మొదలయినవి నీకు తెలిసే ఉంటాయి.
    నీకు ఏనాడూ తెలియపరచదలుచుకోని విషయాలు తెలిసిపోయాయి. నిజానికి నీకే ఈ విషయాలు తెలియకుండా ఉండి ఉంటే, జరిగిన విషయాలు జరగకుండా ఆపగలగటం అన్నదే చేతనయితే సృష్టికే అడ్డంపడగలిగే వాళ్ళమేమో! గతించిన విషయాలు తలుచుకోవడం.... ఇలా జరిగి ఉంటే, అలా జరిగిఉంటే ఎలా ఉండేదో అని ఆలోచించకుండా ఉండలేకపోవడం మానవసహజం.
    నీకు ఆరోజు ఎన్నోఏళ్లక్రితం జరిగిపోయిన సంగతులు వివరిస్తున్నప్పుడు నీలో మారుతున్న రంగులు, పాలిపోతున్న నీ ముఖం ఎందుకు దారితీస్తుందో ఊహించగలిగాను. ఈపాటికి మీ అమ్మమీది ద్వేషం నిన్ను దహించివేస్తూ ఉండాలి. దాన్ని ఆపగలిగే శక్తి నాలో లేకపోయినా, నిర్మూలించడానికి ప్రయత్నం చెయ్యమని అర్దిస్తున్నాను.
    ఈ విషయాలు అనూరాధకు తెలిసే ఉంటాయి. ఆమె చిన్నప్పటినుండి నా కళ్ళముందు నా స్వంతకూతురల్లే పెరిగింది. 'మామయ్యా, నీకు ఇండిషన్ చేస్తా'నంటూ రెండు చీపురుపుల్లలు తీసుకువచ్చేది. పొట్టి పొట్టి గౌన్లతో, చిన్నచిన్న బొమ్మలతో నా దగ్గిరికి వచ్చేది, నా బొమ్మకు జ్వరం వచ్చింది మందివ్వమని. 'ఇంజక్షన్ చేస్తాను, అనూ' అంటే 'అమ్మో, నా బొమ్మ నెప్పెట్టి ఏడుస్తుంది. ఉట్టి మందే ఇవ్వు' అంటూ బుంగమూతి పెట్టేది. అంత సుకుమారంగా పెరిగిన అనూకు ఇవాళ హృదయంలో అంతులేని వేదన. ఈనాటి నీ మనోవేదనకు ఆమె కారణం అన్న కోపంతో ఆమెనుండి దూరంగా వెళ్ళి పోయావు! కాని ఇందులో ఆమె భాగం చాలా తక్కువ అని గ్రహించి ఉంటావు. అయినవాళ్ళ ఉన్నతి కోరడం ఆప్తుల లక్షణం. కాని ఉన్నత శిఖరాగ్రాలు ఎక్కించాలని ఆశిస్తూ, తెలియకుండా అధఃపాతాళానికి దారులు తవ్వుకునే మీ అమ్మలాంటి, నాలాంటి నిర్భాగ్యులు ఉంటూనే ఉంటారు.
    ఇంత జరిగాక కూడా నాలో ఆశ అణిగిపోవడంలేదు. ఒకరోజు నీఅంతట నువ్వు నన్ను పిలుస్తావనే భావన ఎక్కడో మెల్లిగా మెదులుతూనే ఉంది. నీమీద నాకు ఎందుకింత వాత్సల్యం? ఏనాడూ, ఎవరితోనూ మానసికంగా బంధాలు పెంచుకోదలుచుకోని నాకు ఇది ఈనాడు ఎలా బంధిస్తున్నాదని అనుకుంటే సమాధానం ఒక్క పుత్రప్రేమేనేమో!
    అగ్నిప్రమాదంలో ట్రికియాటమీ చేశాక అనూరాధకు తెలిసింది, నువ్వు డాక్టరువని. నీతో ఎన్నిసార్లు ఆ విషయం మాట్లాడాలని అడగబోయినా, నువ్వు మాట మార్చడానికి ప్రయత్నించావుట! ఓ రోజు నా దగ్గిరికి వచ్చి సలహా అడిగింది, నిన్ను ప్రాక్టీస్ పెట్టడం విషయంలో ప్రోత్సహించేందుకు. ఆరోజే చెప్పాను, ఎవరైనా ఒక పని చేయదలుచుకుంటే వారంతట వారు నిర్ణయించుకుని నిలబడాలిగాని, మనం ముందుకు తోసి ప్రోత్సహించడం మంచిది'కాదని; పునాది దిట్టంగా ఉన్న గోడ నిలబడుతుంది గాని పునాదిలేని గోడకు ఎన్ని కర్రలతో బోటులు పెట్టినా ఫలితం ఉండదని.
    ఇది జరిగిన నెల తరవాత మీ అమ్మ నా దగ్గిరికి వచ్చి నీ విషయం చెప్పింది. మొదట నమ్మలేకపోయాను. తరవాత నమ్మకుండా ఉండలేకపోయాను. అంత వరకు - అంటే దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళ వరకు - నాకీ విషయం చూచాయగా కూడా తెలియదు. నాకీ విషయం మొదటే తెలిసిఉంటే, ఇంట్లోవాళ్ళ అభ్యంతరాలన్ని తోసిపుచ్చి పెళ్ళి చేసుకుని ఉండేవాణ్ణి. నీ విషయమంతా చెప్పి అనవసరమయిన సహాయం చెయ్యమంది. తప్పక చెయ్యాలని నిశ్చయించుకున్నాను. ఆరాత్రి పొద్దుట విన్న సంగతిని గూర్చి ఆలోచిస్తూ ఉంటే మనస్సంతా దివ్యాను భూతితో నిండిపోయింది. నాకూ ఓ కొడుకున్నాడు. అదీ నా పోలికతో, నా ప్రొఫెషన్ లో. నిన్ను తీర్చిదిద్ది నా అడుగుజాడలలో నడిపించాలన్న కోరిక నాలో బలమైపోయింది. అనూరాధకు చేసిన నీతిబోధ అంతా పుత్రవాత్సల్యంతో క్షణంలో తుడిచిపెట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS