'అమ్మా! నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా ? అన్నాడు రాం కుమార్.
"ముందు నేను చెప్పేది పూర్తిగా విను" అందతడి తల్లి.
సీతాపతి వారికి దూరపు బంధువు. ఇటీవలే అయన వ్యాపారం లోకి దిగి ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. అనుకోకుండా రెండు నెలలక్రితం యాక్సిడెంట్ చేసి మంచం పట్టాడు. అందాకా వ్యాపారం చూడ్డాకి ఓ మనిషి ని పెట్టుకున్నాడు. అయితే అయన నమ్మకస్తుడైన మనిషి కోసం చూస్తున్నాడు. అయన కోక్కగానోక్క కూతురు. ఆ కూతుర్నిచ్చి పెళ్ళి చేసి అల్లుడికి వ్యాపారం అప్పజెప్పాలని ఆయన అనుకుంటున్నాడు.
"నా కిల్లరికం ఇష్టం లేదు" అన్నాడు రాం కుమార్.
'అయన చాలా మర్యాదస్తుడురా .....పాపం అలాంటి షరతులేమీ లేవు. నిన్నాయన ఇల్లరికముండమనడం లేదు. మేనేజరుగా విన్నప్పాయింట్ చేసి నెలజీతం తీసుకోమంటున్నాడు. నువ్వు వేరే కాపురం పెట్టవచ్చు ."
"జీతం ఎంతిస్తారుట?"
"ఆరంభంలో పదిహేను వందలు నెలకు...."
'అమ్మా -- నీకు తెలుసు గదా -- ప్రస్తుతం నా నెల జీతం రెండు వేలు ...."
"వెర్రీ నాయనా! నామక జీతం కానీ -- ఆ ప్రెస్సు నీదే కదా...."
"అయితే నేను చెప్పేది కూడా వినమ్మా - నా యజమాని వెంకటేశ్వర్లు -- ఆ ఏడు కొండల వాడికంటే కూడా మహిమలోనూ, డబ్బు లోనూ బలవంతుడు, అయన కూడా తన కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చేస్తానంటున్నాడు...."
రాం కుమార్ తల్లి ఉలిక్కి పడినా -- "వాళ్ళు మన వాళ్ళేనా?" అని కూడా వెంటనే అంది.
"ఈ రోజుల్లో ఇంకా కులాలూ, మతాలూ ఏమిటమ్మా ?"
"ఈ రోజులూ ఆ రోజులూ అని లేదు. మనిషి బ్రతికున్నంత కాలం కులాలు, మతాలూ ఉంటాయి " అంటూ మొదటిసారిగా రాం కుమార్ తండ్రి పెదవి విప్పాడు.
"కానికులం చేసుకుందుకు నీకేం కర్మారా -- చదువుంది రూపముంది, తెలివుంది . ఆ సీతాపతి యాభై వేలు కట్న మిచ్చి వియ్యపురాలు, ఆడపడుచు లాంచనాలతో ఘనంగా పెళ్ళి చేస్తానంటున్నాడు. మన సంప్రదాయం చూసీ, నీ బుద్ది చూసి అయన మోజు పడుతున్నాడు తప్ప అయన కుర్రాళ్ళు దొరక్క కాదు" అంది రాం కుమార్ తల్లి.
"కానీ అమ్మా! మా వెంకటేశ్వర్లు ఇలాంటి ప్రెస్ ఓనర్లు వందమందిని బజార్లో పెట్టి వేలం వేయగలడు. నాకా యింటల్లుడినయ్యే అవకాశం పోగొట్టవద్దు. కాస్త నిదానంగా ఆలోచించండి" అన్నాడు రాం కుమార్.
"ఇందులో ఆలోచించడానికేమీ లేదు. నువ్వు నామాట కాదంటే నామీద ఒట్టే" అని రాం కుమార్ తల్లి అతడికి మరి మాట్లాడే అవకాశ మివ్వకుండా లోపలకు వెళ్ళి పోయింది.
రాం కుమార్ తెల్లబోయి ఆటే చూస్తుండి పోయాడు. తల్లి ఒట్టు నతడింత వరకూ నిర్లక్ష్యం చేయలేదు.
3
రైల్వే స్టేషన్లో కారు సిద్దంగా ఉంది. అందులోంచి సీతాపతి దిగి రాం కుమార్ కుటుంబ సభ్యులందర్నీ గౌరవంగా ఆహ్వానించి నోరెక్కించాడు.
"మీ వంట్లో కులాసాగా ఉంటోందా?" అన్నాడు రాంకుమార్ తండ్రి.
"ఏం కులాసాలెండి -- మిమ్మల్ని చూసి కొండంత బలం వచ్చింది. ఏదో అడపా దడపా యిలా తిరగడానికే తప్ప. అట్టే ఇల్లు కదిలే అవకశం నాకు లేదు" అన్నాడు సీతాపతి.
రాం కుమార్ కాయన్ను చూస్తె చిరాగ్గా అనిపిస్తోంది. అయన మాటలు వింటే అసహనంగా వుంటోంది. అయినా వ్యక్తపరచలేదు.
కారో యింటి ముందాగింది.
అరుగదుల బంగళా. గదులన్నీ విశాలంగా ఉన్నాయి. ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ.
"ఇల్లెంత బాగుందో చూశావా?" అంటూ తల్లి రాం కుమార్ చెవిలో గొణిగాడు.
"ఇది వెంకటేశ్వర్లు ఔట్ హౌస్ లా ఉంది" అంటూ రాం కుమార్ తల్లి చెవిలో గొణిగాడు.
ఇంటిల్లిపాది బాగా మర్యాదలు తెలిసిన వారై వుండాలని తల్లి అనుకుంటే -- అది అతి వినయమని రాం కుమార్ అనుకున్నాడు. వారికీ మర్యాదలు మాత్రం ఎంతో బాగా జరిగాయి.
రాం కుమార్ నిర్లక్ష్యం వైఖరిని సీతాపతి గుర్తించినట్లే కనపడ్డాడు. ఆయనకు రవంత అసంతృప్తిని కలిగింది. కాబోయే అల్లుడి మనసు కుల్లాసం కలిగించాలని అయన పాపం చాలా ప్రయత్నాలు చేశాడు.
అయితే అప్పటికి వెంకటేశ్వర్లుతో సవాలు చేశాక - నాలుగో రోజు. రాం కుమార్ కు బంగారు పిచ్చుక సురేఖ తన చేజారి పోతోందన్న భావం అసహనాన్ని పెంచుతోంది. అతడు ముభావంగా విన్నాడు సీతాపతి మాటలు. సీతాపతి అందుకు చిన్నబుచ్చుకున్నాడు.
సమయం గడుస్తోంది.
మంచి ముహూర్తానికి పెళ్ళి కూతుర్ని తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చోపెట్టాడు.
అనాసక్తంగానే రాంకుమార్ ఆమె వైపు చూశాడు.
పెళ్ళి కూతురు తల వంచుకుని ఉంది. ముఖం కనిపించటం లేదు.
ఆమె కట్టిన గార్డెన్ సిల్కుచీర మృదువుగా ఉంది. లేత తామర తూడుల్లాంటి ఆమె చేతులు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి.
"మెరిసే దంతా బంగారం కాదు" అనుకున్నాడు రాంకుమార్.
సీతాపతి ముఖం అదోకలాగుంటుంది. అతడి భార్య లావుగా బొద్దుగా , అనాకర్శణీయమైన రూపంలో వుంది.
ఆ యిద్దరి దాంపత్య ఫలం- తన ఎదుట కూర్చుని వుంది పెళ్ళి కూతురిగా!
ఆమె ఎలా వుంటుందో చూచాయిగా ఊహించుకున్నాడు రాంకుమార్.
యాభై వేలు కట్నం , ఘనంగా లాంచనాలు, వైభవంగా పెళ్ళి. ఇవన్నీ తనవంటి సామాన్యుడికి....
అంటే ఆ పెళ్ళికూతురేలాగుంటుందో ఊహించుకోవచ్చు. అందులోనూ ఆమె సీతాపతి దంపతుల దాంపత్య ఫలం....రాం కుమార్ పెళ్ళి కూతుర్నే చూస్తున్నాడు.
అదే సురేఖ అయితే....
సురేఖ ఆధునికంగా అలంకరించుకుంటుంది. ఆమెను చూడగానే మోజు పుడుతుంది. ఆమె చూపుల్లో ఏదో మత్తు ....
"ఒకసారి తలెత్తమ్మా!" అంది రాంకుమార్ తల్లి.
పెళ్ళికూతురు సిగ్గుపడుతూ తలెత్తింది.
రాం కుమార్ ఆమె వంకే చూస్తున్నాడు.
ఆమె అతణ్ణి చూసింది ....ఒకే ఒక్కసారి రెప్పలు రెపరెప లాడించి చూసి తల దించుకుంది.
రాంకుమార్ ఉలిక్కిపడ్డాడు.
అతడు చూపులు మరల్చు కోలేకపోయాడు.
ఆమె ఎవరు?
దివ్య లోకాల నుంచి దిగివచ్చిన దివ్యకాంతయా?
సురాసురుల కమృతం పంచి పెట్టిన మోహినియా!
ఆమె ఎవరైనప్పటికి -- సీతాపతి దంపతుల కూతురు కావడానికి మాత్రం వీల్లేదని అతడనుకున్నాడు. అదే నిజమైతే ఈ సృష్టి విచిత్రాల్లో అదోక్కటని కూడా అతడను కున్నాడు. అతడి దృష్టిలో సురేఖ లేదిపుడు.
"మీపేరేమిటమ్మా ?"
"శోభ!" అంది పెళ్ళికూతురు.
వీణ మీటినట్లున్న ఆ స్వరం ఆమె రూపానికి శోభ నిచ్చినట్లు ఫీలయ్యాడు రాం కుమార్.
రాం కుమార్ ముఖ భావాలు సీతాపతికి సంతృప్తిని కలిగించాయి. అయన మళ్ళీ కాబోయే అల్లుడి పక్కన చేరి నెమ్మదిగా కబుర్లు ప్రారంభించాడు. తన కూతురి గురించిన విశేషాలు చెబుతున్నాడాయన.
శోభ తండ్రిగా సీతాపతి అంటే గౌరవం పెరిగింది రాం కుమార్ కి.
పెళ్ళి చూపుల తతంగం పూర్తయ్యాక -- "పిల్ల నచ్చిందా ?" అని తల్లి అడిగినప్పుడతడు వెంటనే తలూపి ఆమెకే ఆశ్చర్యాన్ని కలిగించాడు.
రాం కుమార్ వెంకటేశ్వర్లు తనపై విసిరిన సవాలు గురించీ, తన తెలివిని పరీక్షించుకోవాల్సిన అవసరం గురించీ మరిచిపోయాడు.
"కతికితే అతకదన్న భయం నాకు లేదు. ఈరోజుకు మీరు మా ఇంట్లోనే వుండిపోవాలి" అని సీతాపతి బలవంత పెట్టాడు.
ఆ సాయంత్రం ఆ ఇంటి ఆవరణలో పూల మొక్కల చాటున రాం కుమార్, శోభ ఏకాంతంగా మాట్లాడుకున్నారు.
ఆమె తెలివి, చలాకీతనం , వినయం - అన్నీ రాం కుమార్ కు నచ్చాయి.
