Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 26


                                       ప్రేమ స్వాతంత్ర్యము

    రాజేశ్వరరావు చిన్నతనము నుండియు తిరుపతిరావు గారి శిష్యకోటిలోని వాడు. తిరుపతిరావుగారే విషయమును గూర్చి సంఘముతో దాము పోరాడుచున్నారో, స్త్రీ, పురుషులేవిధమున సంచరించవలెనని వాదించుచున్నారో అట్లే తాము సంచరించి అకల్మష హృదయులనియు, దృఢవ్రతులనియు, ధీర చరిత్రులనియు బేరుపొందినారు. వారి యభిప్రాయములతో నేకీభవింపనివారు గూడ వారి త్రికరణశుద్ధిని మెచ్చుకొనువారే. ఆ తిరుపతిరాయునికి రాజేశ్వరుడు నమ్మిన శిష్యుడు.
    తల్లిదండ్రులు వివాహము చేసికొమ్మని యెంత పోరినను, అతడు యెన్నో సాకులు చెప్పుచు తప్పుకొనుచుండెడి వాడు. తిరుపతిరావు గారు ఎవ్వరితోడ నబద్ధము లాడవలదనియు, ఉత్కృష్ట ధర్మమగు స్వతంత్ర మసత్యముచే గలుషిత మగుననియు రాజేశ్వరున కనేక విధముల బోధించినాడు.
    రాజేశ్వరుడు రాజమహేంద్రవరము చదువుటకు వచ్చినప్పుడు నారాయణునితో ప్రాణస్నేహమేర్పడినది. నారాయణరావు రాజేశ్వరున కెన్నిసార్లో తిరుపతిరావు గారి శుశ్రూష వలదని బోధించినాడు. పరమేశ్వరరావు మాత్రం తిరుపతిరావు గారి విధానము స్త్రీ, పురుష సంబంధపు జిక్కు చక్కగా విడదీయ రాజపథము కావచ్చుననియు, కొందరి జీవితములా విధానమునకు సమర్పితములు గావలెననియు రాజేశ్వరుడట్లేల చేయరాదనియు నారాయణరావుతో వాదించువాడు. అది ఆత్మహననమార్గమని మనకు తెలిసివచ్చినప్పుడు, ఆ జ్ఞానమును రెండుచేతుల ద్రోసివైచి, కళ్ళకు గంతలు కట్టుకొని, మహావిషోరగ భయంకర జీవములు గడపి, విష వాయు పూర్ణమును, నగాథము నగు నరక కూపాన నేలబడవలయునని నారాయణరావు వాదించువాడు.
    తిరుపతిరావుగారి స్నేహము చేయుచుండినచో రాజేశ్వరుని మోము చూడనని నారాయణుడు అదలించినను 'నీకు ఉడుకుబోతుతనమెందుకు? నువ్వు కూడా మా జట్టు చేరు. నువ్వూ ఘోటక బ్రహ్మచారివేగా' అని రాజేశ్వరుడు వికటముగా జవాబిచ్చెను. తిరుపతిరావు గారి చుట్టును పాశ్చాత్య విద్యాదక్షులగు (విద్యాదగ్ధులా?) పెక్కండ్రు చేరినారు. ఒకరి భార్యల నొకరు పొందవచ్చును, స్త్రీ స్వాతంత్ర్య సంపాదనము, శిక్షాస్మృతిలో పరభార్యా సంభోగమునకు, గర్భవిచ్చిత్తికి నేర్పడిన శిక్షలు తొలగించుట, విడాకుల చట్టము, అన్నదమ్ములతోపాటు స్త్రీలకు బితృస్వమున భాగమొసగు చట్టము నిర్మింపజేయుట మొదలగునవి వారికి ముఖ్యాశయములు.   
    పరస్త్రీ సంగమము దోషమని తలంచుట యజ్ఞానవిలసితమని వారి యభిప్రాయము.
    ఆ బృందముతో తిరుగు రాజేశ్వరుడు పవిత్రుడు గాడని యెవరు చెప్పగలరు? ఆత డందగాండ్రలో లెక్కగావున ఆ సమాజములోని బాలికలకతనిపై మరలు జనించుట వింతకాదు.
    కాని యా సంఘములోగూడ పెక్కు వత్సరముల నుండి పరస్పరము ప్రేమించుకొనిన స్త్రీ పురుష యుగ్మము లెన్నియో కలవు. ఆ సంఘములో పూర్వ సంప్రదాయానుసరణి వివాహమైనవారిలో తిరుపతిరాయుడు గారొకరు. ఆయన భార్య విద్వాంసురాలు, పతిప్రాణ. భర్తగారి యాశయములు, బోధలు, చర్యలు తనకేమియు నచ్చకపోయినను సత్యవర్తనమే పరమ ధర్మమని తలచి, పతియానతి కెదురు చెప్పక, స్వేచ్చాచార సంఘములో గాఢ దీక్షాపరురాలివలె చరించుచు, ఆయన కామసంబంధము చేసికొమ్మనిన వారితో నిష్టము లేకున్నను అటులనే చేయుచుండెను.
    తిరుపతిరావు గారికి వనితామానాపహరణమే పరమవ్రతము. 'స్త్రీ' భోగము కొరకే జనించినదని యతని వాదము. నతివిచిత్రమైన ప్రాణియట వనిత. ఆమె కన్నులలో నీలి మబ్బులు తేలియాడునట. ఆమె పెదవులలో తేనెవాకలున్నవట. ఆమె దేహము కౌగిలింతల గోరునట. ఆమె చెక్కిళ్ళు నీరసనిదాఘతపున కుపశమనోషధీ కుసుమములట. ఆమె మెడ, బాహువులు, కటిప్రదేశ మూరువులు, జంఘలు, పాదములు చుంబన సౌభాగ్యమునకై పరితపించు పరమకళా ప్రదేశములట.
    రాజేశ్వరునికా బృందములో నొక స్నేహితుని భార్య సౌందర్యము అయస్కాంతమైనది. ఆమె రాజమహేంద్రవరములో నొక వకీలు భార్య. సుబ్బయ్యశాస్త్రిగారు నలుబదియేండ్ల ఈడువాడు. ఆయనకు ముప్పది రెండవయేట రెండవ వివాహమైనది. వివాహమైన రెండు నెలలకు భార్య కాపురమునకు వచ్చినది. ఇప్పుడామె కిరువది రెండవయేడు. ఆమె పేరు వివాహము కాక పూర్వము పుల్లమ్మయైనను, సుబ్బయ్యశాస్త్రిగారు పుష్పశీలయని నామకరణము జేసినారు. ఆ సుగాత్రి పుట్టిల్లు రాజమహేంద్రవరమే. ఆ విద్యావతి వీరేశలింగము పాఠశాలలో అయిదవ ఫారము చదువుచుండగా వివాహమైనది. అప్పటివరకామె తల్లిదండ్రులామె కింకను ఈడు రాలేదనియే చెప్పుచుండిరి. వివాహమైన పిమ్మట పుష్పవతి యైనదని యుత్సవము జేసినారు. తక్కిన వేడుకలన్నియు జరిగి భర్త యింటికా శోభనాంగి రెండు నెలలలో వెలుగువలె, సువాసనల హరివలె ప్రత్యక్షమైనది.
    పుష్పశీల పుష్పమే. ఆమెయందము నాగుబాము, చిరుతపులి, వజ్రముల యందమువంటిది. శిరోజములుంగరములై, దీర్ఘములై, నీలముకన్న నీలములై కటిభాగమున పచారుసేయును. వెడదలై, సాగాలి పెద్దకనీనికలతో గాఢభావము లొలుకు నాపై కన్నులు సమ్మోహనమంత్రములే. ఆమె సమనాసికాగ్రమించుక పైకి తిరిగినట్లుండి వలపుదలపులు పట్టియిచ్చు చుండును. పూర్ణోష్ట సుందరమగు నామెముఖమించుక వెడదయై కాముకులకు నోరూరజేయుచుండును.
    వనితాలోలుడగు సుబ్బయ్యశాస్త్రికి తిరుపతిరాయని స్వేచ్చాచారి సంఘమున బద్దుగైకొనుట తప్పనిసరియైనది. ఆ వనితా పుష్పవనములో బంభరుడు కాగోరినాడు. ఆత డందగాడు గాకపోయినను న్యాయస్థానమున పేర్వడిన యతని వాదనాపటిమ కొందఱు యువతుల మనసుల నాకర్షించినది.
    స్వేచ్చాచారులపుడప్పుడు సుబ్బయ్యశాస్త్రి యింట నాతిధేయులగుట కలదు. కాని సుబ్బయ్యశాస్త్రి భార్యను మాత్రమా మూకకంట నెన్నడు బడనిచ్చినాడుకాడు. కావున నా సంఘ సభ్యురాండ్రగు వనితామణులు సుబ్బయ్యశాస్త్రిని 'మీ పుష్పశీలకు గాలి వెలుతురు పడవు కాబోలు'నని యెత్తిపొడిచెడివారు.
    రాజేశ్వరుని మాటలును, మంచితనమును, మృదు స్వభావమును అతనిని సుబ్బయ్యశాస్త్రికి ప్రాణస్నేహితు నొనర్చెను. ఇంటిలో నించుక చనవు దొరకుటచే ఒకటి రెండుసార్లు సుబ్బయ్యశాస్త్రి భార్య రాజేశ్వరరావు కంట బడినది. 'పుర్దనాషీన్' అగు పుష్పషీలా ఏ మూర్త ఘటనా చమత్కృతినో యతని కన్నులబడినది. పుల్లమ్మగారు అద్బుత సౌందర్యవతియన్న ప్రతీతి మున్నాతడు విన్నాడు. కాని నేడు కన్నులలో తళుక్కుమని మాయమైన యా త్రిజగన్మోహినీమధురమూర్తియే ఆ పుల్లమ్మయని నమ్మజాలడయ్యెను. పుల్లమ్మ శరశ్చంద్రచంద్రికా ఖండము. తక్కు సుందరులెల్ల మిణుగురులు అతని గుండె బ్యాండు స్వరము వాయించినది. తన భాగ్యదేవతా సాక్షాత్కార వృత్తాంతము నతడు సుబ్బయ్యశాస్త్రి కెరుక పడనీక హృదయమున నిక్షేపించుకొన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS