Previous Page Next Page 
శశిరేఖ పేజి 48

శశి - ఇంకోళ్ళు  ఏమనుకుంటారు, లోకం ఏమనుకుంటుంది అంటారేం ఎప్పడూను? ఇంకోళ్ళని చూస్తే ఎందుకంత  భయం మీకు? నేను చెప్పలేదూ నా కాయన మీద ప్రేమ లేదని?
నవ - మళ్ళి అట్లాగే అంటావు. వివాహం చేసుకుంటే ప్రేమ వస్తుంది.
శశి - నా సంగతి  మీ కర్దాంకాదు. ఈ విషయమై చర్చించి ప్రయోజనం లేనట్లు కనబడుతోంది.ఇక్కడ జరిగే వివాహాలు చూశాను. బాల్య వివాహాలకి వీటికి భేధమేమిటి? పిల్లలు ఎదుగుతారన్నమాటే కాని, సరిగ్గా అందరిని చూసి వాళ్ళ  యిష్టమయిన వాళ్ళను వివాహం చేసుకునే వాళ్ళు అరుదు. అంతా పెద్దల యిష్టం. మొదట ప్రేమ వుండి తరవాత ప్రేమ పోవోచ్చునన్న మాటకూడా మీకు తెలీకుండా వుంది. రావోచ్చునన్న వారు పోవోచ్చునని  వోప్పకోరు.ప్రేమ పోవడం మహా పాపమటారు.ఇక్కడ  ఆడవాళ్ళు గడిపే జీవనాన్ని చూడండి. ప్రేమించి స్వేచ్చగా యేరుకున్నవాడితో అయితే అట్లాంటి రసరహితము లైన  జివనాల్ని గడుపు తారా?ప్రేమ వారిని ప్రతి క్షణమును మహానందములో ఒలలాడేట్లు చేస్తోందా? ఎన్నడో బంధింపబడ్డవాళ్ళ మల్లే, తమ యిష్టం లేకుండా కట్టబడిన వాళ్ళ మల్లే, సౌందర్య నిరహితములైనబ్రతుకులు బ్రతుకుతారు. ఇష్టమున్నా లేకపోయినా, ఒకసారి కట్టుకున్నతరవాత, బ్రాహ్మ సంఘానికి భయపడి ఇట్లా పడివుండవలసిందేగా?ఇవేం పెళ్ళిళ్ళు? ఇట్లాంటి పెళ్ళినన్ను కూడా చేసుకోమంటారా?
నవ- వీరూ నేనూ నీ శ్రేయస్సుకోరే చెపుతున్నాము. మాటలకేఎన్ని  మాటలన్నా చెప్పవచ్చును. కార్యమ్లోకి దిగితేనేగాని  దాంట్లో వుండే చిక్కులు తెలివు. నువ్వింకా చిన్న దానవు. నీకేమి తెలిదు. ధర్మారావు పాపం పొద్దున్నుంచి ఆన్నమన్నా తినకుండా విచారిస్తున్నాడు. అతని పైన జాలన్నాలేదూ?
శశి - ఈ విషయంలో మీకంటే నాకే యెక్కువ తెలుసు.
క్రొత్తమనిషి -ఏమిటమ్మా!
శశి - ఏమిటండీ?
క్రొత్తమనిషి - ఎంత చెడ్డా అయన పెద్దవాడు.
శశి - నేను చెప్పేది చివరవరకూ విన్న తరవాత మాట్లాడండి. మీకింకా లోకభయం సంఘభయంవదల్లేదు. అవి వదలనంతకాలం న్యాయం యేమిటో విచారించే శక్తి రాదు. లేకపోతే ధర్మారావుగారికి కష్టం కలిగిందని నాతో చెపితే యేం లాభం?ఆయనకీ కష్టంగా వుందని నా ఆత్మను నా స్వేచ్చేనూ చంపుకుంటే మీకు నామీద దయవస్తుంది. ఎందుకు వచ్చిన స్వార్ధత్యగామది?ఆయన మాత్రం సుఖపడతాడా? ప్రేమ పోగానే,వదలివేసే స్వేచ్చేవుంటేగాని నేను పెళ్ళి చేసుకోను. నేను ఎవరిని ఎప్పడూ ప్రేమిస్తానని  చెప్పలేదు. నా అంతరాత్మ మీ వాళ్ళ మల్లే అబద్ధము చెప్పడానికి వోప్పకోదు.నాతో యీవిషయమ్తెమాట్లాడి ప్రయోజనం లేదు. ఎవరేమనుకున్నా నా కెంత మాత్రమూ విచారంలేదు.
నవజివనదాసుగారికి  చాలకోపము  వచ్చెను. చివరకు యీ వుత్సవములు కూడా ఆమెను ధర్మజివనమునకు త్రిప్పలేకపోయెనుగదా?
నవ - ఇంక చెప్పేదేముంది?
శశి - నాకు తెలుసును.నామీద మీకు చాలా కోపం వచ్చింది.కాని మిరేకాదూ జీవితములో నియమకాలుండాలన్నది?ఇప్పుడు మళ్ళి మీరు చెప్పినారు గనక ప్రేమలేకపోయినా, నానియమకాలన్నిటినిపాడు చేసుకొని,పెళ్ళి చేసుకోమంటారా?

                                                                         19
ధర్మారావునకు శశిరేఖ  ఒకనాడు అంగీకరించి యుండునను అభిప్రాయము పోలేదు. కాని యిప్పడామె  తననెందుకు నిరాకరించుచుండెను? ఆలోచించెను.తనను శశిరేఖ వివాహమాడునని విన్నప్పుడు రామారావెందుకంత కలవరపడెను? ఏదో  విరిద్ధరికిని  మధ్య జరిగియుండును.అదియే యీ మార్పునకు  కారణము. మొత్తముమీద రామారావున  కివిషయములో జోక్యము కలదు. అతడు శశిరేఖ వద్దకు బోయెను.
ధర్మా-అమ్మా! నేనొకటి అడుగుతాను. క్షమించండి. మీరిట్లా మనసు మార్చుకోడానికి ఆ రామారావు కదూ కారణం?
శశి- నేను నిజం చెప్పెదాన్నని మీకు నమ్మకం లేనట్లుంది.నా మాటల్లో నమ్మకం లేనప్పుడు మళ్ళినాతో  ఎందుకు మాట్లాడతారు? నేను మనసు  మార్చుకోడానికి, ముందు మీకు మాట యిచ్చిందేప్పుడు ?
ధర్మా - అయితే పోనీ, రామారావుగారికి  మీకూ సంబంధంఏమిటి?
శశి - నాతో  మాట్లాడ దలుచుకుంటే, మీ కవసరములేని సంగతులు మాట్లాడకండి.
ధర్మారావు ఇంక  సందేహమే మున్నదనుకొనేను. అతడు వెంటనే పోయి తన సందేహము నవజివనదాసుగారికి  తెల్పెను. ఇద్దరును రామారావు వద్దకు పోయిరి. నవజివనదాసు రామారావునకు ధర్మారావు అను మానమును తెల్పెను. రామారావను పేరు వినుటతోడనే ససిరేఖకును ఆయనకును గల  సంబంధము  నవజివనదాసుగారికి  జ్ఞాపకము వచ్చెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS