ఆవిష్కరణ
అది కొత్తగా కట్టిన కాలనీ.
ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇళ్ళు కట్టుకోవడానికి అప్పులు ఇయ్యసాగింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అనేకమంది ప్రభుత్యోగులు అక్కడ స్థలాలు కొనుక్కుని ఇళ్ళుకట్టుకోసాగారు. చూస్తుండగానే కొత్త కాలనీ రూపురేఖలు దిద్దుకొని విస్తరించసాగింది.
ఇంతలో... సిమెంటుకీ, ఇనుముకీ కొరత ఏర్పడింది. దానిమూలంగా ఇళ్ళ నిర్మాణం బాగా మందగించింది. పునాదులతో ఆగిపోయిన ఇళ్లు, మొండిగోడలు మించి పైకి లేవని ఇళ్లతో ఆ కాలనీ పురాతత్వ శాఖవారు త్రవ్వి తీసిన ఏదో ప్రాచీన నగరపు అవశేషాలను పోలి వుంది. అయినప్పటికీ అప్పటివరకు ఆ కాలనీలో 60,70 ఇళ్లకు పైగా లేచాయి. ఆ కాలనీకి అటూఇటూ కూడా నగరం విస్తరించి వుండడంచేత ఈ కొత్త కాలనీ కూడా అచిరకాలంలోనే అభివృద్ది చెందే సూచనలు గోచరిస్తూనే వున్నాయి.
ఆరోజు ఆ కాలనీ సంక్షేమ సంఘం సర్వ సభ్య సమావేశం జరుగుతోంది.
సభ్యులంతా కాలనీకి కావలసిన అవసరాలను గురించి, వాటిని త్వరితంగా నెరవేర్చుకోగల పద్దతుల గురించీ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
సంఘ వార్షికోత్సవం కేవలం ఒక నెలరోజులలోనే వుంది కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏ మంత్రిగారినో పిలిచి వారిని' 'ఖుషామత్' చేసి వారిముందు కాలనీకి కావలసిన అవసరాల గురించి వినతి పత్రం సమర్పిస్తే ఫలితం చిక్కుతుందని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు.
సభ్యుల సూచన మేరకు చివరికి మంత్రిగారిని పిలవాలని నిర్ణయించడం జరిగింది.
ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ మంత్రిగారిని పిలవాలనే సమస్య వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైనది త్రాగేనీరు కనుక తర్వగా పంపులు పడాలంటే పురపాలక శాఖామాత్యులను పిలవాలని సభ్యులలో ఒక వర్గం అభిప్రాయపడింది. కాలనీకి రోడ్డూ, డ్రయినేజి కూడా చాలా అవసరమని, అందువల్ల వారినే పిలిస్తే ఈ మూడింటి విషయం ఆయన చూడగలరని వారు బల్లగుద్ది వాదించారు.
అయితే... ఈ కాలనీ వున్న ప్రాంతం పంచాయితీలో వుంది కనుక పురపాలక శాఖామాత్యులను పిలిస్తే ఫలితం ఏమి వుంటుందని సభ్యులలో ప్రత్యర్దివర్గం వారు ఒక కుశంకను లేవదీశారు. ఈ కారణంచేత పంచాయితీ శాఖామంత్రిగారిని పిలవడం ఎంతైనా సబబని వారు గట్టిగా వాదించారు.
ఈ కాలనీ వున్న ప్రాంతానికి రెండు వైపులా మున్సిపల్ కార్పొరేషన్ వారికి చెందిన ప్రాంతాలు వున్నాయని, నగర బృహత్ విస్తరణ కార్యక్రమం క్రింద ఈ కాలనీ ప్రాంతాన్ని కార్పోరేషన్ వారు స్వాధీన పరచుకోవాలని ఏనాడో నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఆ నిర్ణయం ఏనాడైనా అమలు జరుపబడగలదనీ, అందువల్ల పంచాయతీ శాఖామంత్రిని పిలవడం దండగ అవుతుందని మొదటివర్గం వారు గట్టిగా వాదించారు.
ప్రభుత్వంతో వ్యవహారం - 'ఇదుగో ..' అంటే ఆరేళ్ళనీ... వారి నిర్ణయం ఇప్పట్లో అమలు జరిగేది కాదనీ, అందువల్ల మున్సిపాలిటీవారి మీద అనవసరపు ఆశలు పెట్టుకోవడం అర్దంలేనిదనీ, ప్రత్యర్దివర్గం వారు అంతకంటే గట్టిగా వాదించారు.
తర్జన భర్జనలతో ప్రారంభమైన వాద - ప్రతివాదాలు అంతకంతకు తీవ్రమైన సిగపట్ల వరకు రాబోయాయి. ఆ పరిస్థితి వచ్చేసరికి సభ్యులలో మూడో వర్గం ఒకటి బయలుదేరింది.
"అయ్యా....! త్రాగడానికి నీరు చాలా ముఖ్యమే. పంపులు వుండడం ఎంతైనా అవసరమే. అయినా ప్రస్తుతానికి ప్రతి ఇంట్లోనూ నూతులు వుండడంవల్ల కొంచెం కష్టమైనా నీటికి ఇబ్బంది లేదు. అలాగే ఇంచుమించు ప్రతివారూ సెప్టిక్ ట్యాంకులు కట్టుకోవడంతో డ్రెయినేజీ వెంటనే లేకపోయినా కలిగే ప్రమాదమూ లేదు. అలాగే రోడ్డు అంటారా.... ఇప్పటికైతే కచ్చారోడ్లు వుండనే వున్నాయి. సైకిళ్ల వరకు రావడానికి ఇబ్బంది లేదు. ఏ గతుకులు వున్నా - వానలు వస్తే బాధ కాని, ఇప్పటికైతే ఎలాగో గడిపేయవచ్చు. మనకి ముఖ్యంగా లేనిది.... వీధి దీపాలు. ఇవి లేకపోవడంతో రాత్రుళ్ళు కొంపకి చేరడమంటే ప్రాణాంతకంగా వుంటోంది. ఎదురుగుండా ఎవరు వచ్చేదీ, ఏమున్నదీ కూడా తెలియడం లేదు. సైకిల్ కి లైటు లేకపోతే ఇంక ఆ అవస్థ చెప్పనక్కరలేదు. కాబట్టి మనం విద్యుచ్చక్తి శాఖామాత్యులను పిలిచి వీధిదీపాల కోసం వినతి పత్రం సమర్పించడం మంచిది" అని వారు ఉద్ఘాటించారు.
ఈ వాదన అందరికీ నచ్చింది. పైగా... సిగపట్లని తప్పించింది. అందువల్ల సభ్యులందరూ విద్యుచ్చక్తి శాఖామాత్యులను పిలవాలని ఏకగ్రీవంగా నిశ్చయించారు.
ఈ విషయంలో కూడా సభ్యులలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సభ్యులు సూచించిన పేర్లలో వారివారి శక్తి సామర్ద్యాల మీదా, పలుకుబడుల మీదా విభిన్న అభిప్రాయాలు వెల్లడి కావడంతో, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ విషయాన్ని మరొక వారంలో తిరిగి సమావేశం జరిపి ఆ లోటు నిర్ణయించాలనే సూచనను ఆమోదించారు.
తర్వాత మంత్రిగారిని పిలవడానికి అందుకుగాను పలుకుబడిగల వ్యక్తిని పట్టుకోవడానికి ఎవరిని నియమించాలి?.... అనే విషయమై చర్చ వచ్చింది. సభ్యులలో కొందరు అధ్యక్షులు, కార్యదర్శి వుండగా ఎవరిని నియమించాలనే ప్రసక్తి ఏమిటని ఆక్షేపించారు.
అధ్యక్ష, కార్యదర్శి పదవులకు వ్యక్తులున్నంతమాత్రాన అలాంటి ముఖ్యమైన కార్యాల్లో వారినే నియమించాల్సిన అవసరం లేదనీ, అలాంటి వారికి కార్యాలు సాధించుకు రాగల చాకచక్యం వుండాలని అంటూ పరోక్షంగా అధ్యక్ష, కార్యదర్శులు శక్తి సామర్ద్యాలపై సంశయాన్ని వెలిబుచ్చారు ఒక వర్గంవారు.
ఈ విషయంలో కూడా వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరబోయేసరికి సభ్యులలో ఒకరు 'ఎవరి ద్వారా మంత్రిగారిని పట్టుకోవాలా?....అనే విషయమే తేలనప్పుడు - అందుకోసం ఎవరిని పంపాలా?...అనే విషయం పై చర్చ అసంబద్దం' అంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవదీశారు. అంతటితో ఆ విషయంపై నిర్ణయం కూడా వచ్చే సమావేశానికి వాయిదా వేశారు.
అంతటితో ముఖ్యమైన నిర్ణయాలు ఏవీ తీసుకోకుండానే ఆనాటి సమావేశం మరుసటి ర వారానికి వాయిదా పడింది.
* * * * *
మరుసటి వారం మళ్ళీ సభ్యులు సమావేశం అయ్యారు.
అయితే ఈసారి క్రిందటి సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడిన సభ్యులలో చాలామంది రానేలేదు. అసలు మీటింగ్ ని నడపడానికి కోరం కూడా లేకపోయింది. అయితే వాయిదా పడ్డ మీటింగ్ లో కోరం అవసరం లేనందువల్ల మీటింగ్ ని నడిపారు. సభ్యులు చాలా కొద్దిమందే రావడంతో ఆ వచ్చిన కొద్దిమందీ ఏ విషయంలోనూ ప్రత్యేకించి ఆసక్తి చూపించకపోవడంతోనూ మీటింగ్ సాఫీగా, నిర్విఘ్నంగా సాగిపోయింది. మంత్రిగారిని ఏ విధంగా, ఎవరి ద్వారా కలవాలనే విషయంలో అధ్యక్ష, కార్యదర్శులకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు సభ్యులు. అలాగే మంత్రిగారిని కలవడానికి అధ్యక్ష, కార్యదర్శులనే నియమించారు. క్రిందటి మీటింగ్ లో మబ్బులాగా ముంచుకొచ్చిన ఆటంకాలు ఈసారి సమావేశంలో మంచువలె విడిపోయాయి.
* * * * *
