Read more!

వటసావిత్రీ వ్రతం

 

వటసావిత్రీ వ్రతం

 

 

శ్రావణమాసం తరువాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్న విశిష్టమైన మాసం 'జ్యేష్టమాసం'. చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్టమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది.ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు. వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అలాగే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వాలి. అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.

 

 

జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానము చేసి గంగానదిని పూజించాలి. అలా వీలు కానివారు ఇంటి దగ్గరే గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి.
రంభా వ్రతము : దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పిలుస్తారు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించాలి. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.
వట సావిత్రీ వ్రతం : జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించాలి వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి.
జ్యేష్ట శుద్ధ దశమి : దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు. దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది.

 

 

జ్యేష్ట శుద్ధ పూర్ణిమ : దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ రోజు భూదేవిని పూజించడం మంచిది.

వట సావిత్రీ వ్రతము :

 

 

హైందవ సంస్కృతి లో, ఆధ్యాత్మిక జీవన విధానములో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము, కట్టుకున్న భర్త, బిడ్డలకోసం ... పురుషులకంటే స్త్ర్త్రీలే ఎక్కువగా ధైవారాధన లో నిమగ్నులైవుంటారు. ధర్మార్ధ, కామ, మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి. విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో "వట సావిత్రీ వ్రతము" ఒకటి ముఖ్యమైనది.

 

 

తన పాతివ్రత మహిమతో యమధరమరాజు నుంచి తన భర్త ప్రాణాలను మెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రిచెట్టును భక్తిప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామ, దాన భేద, దండోపాయాలను అవలంబించాలని యమధరమరాజు ప్రయత్నించినా ప్రతివ్రతామతల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు.

 

 

సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రీ వ్రతం నాడు కొత్త దుస్తులు ధరంచి, చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రిచెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సిందూరంతో వటవృక్షాన్ని అలంకరించి, నూలుదారం పోగుల్ని చెట్టుమొదలు చుట్టూకట్టి, చెట్టుచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రిచెట్టు ... ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భవిస్తారు. మర్రిచెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాసదీక్షలంటే ప్రాణం లేచివచ్చినట్లుండేది. మర్రివృక్షం లా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రీ వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు.

 

 

పసువు కుంకుమలతో పూజిస్తారు, ధూపదీప నైవేధ్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన, విస్తారమైన ఈ వృక్షం కొమ్మకింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్ధిస్తారు. కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్దాలను నైవేద్యముగా పెడతారు. బందు మిత్రులందరినీ ఈ వ్రతానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. భాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి, నూతన వస్త్రాలను ధరించి, శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రిచెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రున్ని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు . . . కొందరు ఒక పూట భోజనం చేస్తారు ... మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రీ వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు.  నేపాల్ లోను, మనదేశంలొని బీహార్లో ఈ వటసావిత్రీ వ్రతాన్ని 500 ఏళ్ళుగా ఆచరిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన "మిథిల"లో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు అధారాలు ఉన్నాయట.

 

 

వ్రత విధానం...
వట సావిత్రీ వత్రం చేసేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్ల వారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపు తో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మను వైధవ్యాధి సకల దోష పరిహారార్ధం.
‘‘బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరిష్యే’’
అనే శ్లోకాన్ని పఠించాలి.