Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైరెండవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము

 

ముప్పైరెండవ అధ్యాయము

 

 

 

 

గురుని, దైవమును వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట


ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు రెండు విషయాలను వర్ణించారు.1. బాబా తన గురువును అడవిలో ఎలా కలిశారు. వారి ద్వారా దైవాన్ని ఎలా కనుగొన్నారు. 2. గోఖలేగారి భార్య మూడురోజులు ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుంటే ఆమెచే బాబా ఎలా ఉపవాసదీక్ష మాన్పించారు.
ప్రారంభంలో హేమాడ్ పంతు,సంసారాన్ని అశ్వత్థవృక్షంతో పోల్చుతూ గీతలో చెప్పిన ప్రకారం దాని వ్రేళ్ళు పైన కొమ్మలు క్రింద ఉన్నాయన్నారు.దాని కొమ్మలు క్రిందివైపు మీద వైపు కూడా వ్యాపించి ఉన్నాయి. అవి గుణములతో పోషింపబడుతున్నాయి. దాని అంకురాలు ఇంద్రియ విషయాలు. దాని వ్రేళ్ళు కర్మను చేయిన్చుతూ మానవప్రపంచం వరకు వ్యాపించి ఉన్నాయి. దాని స్వరూపం గాని, దాని ఆధారంగాని, దాని ఆద్యంతాలు గాని ఈ లోకానికి తెలియరావు. వైరాగ్యం అనే పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళుగల అశ్వత్థవృక్షాన్ని నరికి, ఏ అతీతమార్గాన్ని అనుసరించిన తిరిగి జన్మలేదో అలాంటి దాన్ని అనుసరించవలెను.
అలాటి దరియండు నడవటానికి, దారి చూపించే మంచి గురువు సహాయం అత్యంత అవసరం. ఒకడెంత పండితుడు అయినప్పటికీ వేదవేదాంగాలను బాగా చదివినప్పటికీ, తన గమ్యస్థానానికి సురక్షితంగా పోలేడు. మార్గదర్శే వుండి సహాయపడి సరైన దారి చూపిన్నట్లయితే మార్గంలో ఉన్న గోతులనుండి, అడవి మృగాలనుండి తప్పించుకుని సునాయాసంగా పయనిస్తాడు.
ఈ విషయంలో బాబా అనుభవాన్ని బాబాయే స్వయంగా చెప్పారు. ఇది అత్యంత చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే నమ్మకము, భక్తి,మోక్షం ప్రాప్తిస్తాయి.

 


అన్వేషణం :

 

 

 

 


ఒకానొకప్పుడు మేము నలుగురం మతగ్రంథాలు చదువుతూ ఆ జ్ఞానంతో బ్రహ్మము నైజం గురించి తర్కించటం మొదలుపెట్టాము. మాలో ఒకడు ఆత్మను ఆత్మతో ఉద్దరించాలి గాని ఇతరులపై ఆదారపడరాదు అన్నాడు. అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనంలో వుంచుకున్నవాడే ధన్యుదనీ మనం ఆలోచనలనుండి భావాలనుంది ముక్తులమైనట్లయితే మనకంటే వేరైనది ఈ పపంచమలో మరేదీ లేదని చెప్పాడు. మూడవవాడు దృశ్యప్రపంచం సదా పరిణామశీలమైనదనీ, నిరాకారమే శాశ్వతమైనదనీ కాబట్టి సత్యాసత్య విచక్షణ అవసరమనీ చెప్పాడు. నాలుగావారు (అనగా బాబా) "పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదు. మనకు విధింపబడిన కర్మను మనం పూర్తిచేసి, తనువును, మనసును, పంచప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడుకోవాలి. గురువే దైవం; సర్వంలో వ్యాపించినవాడు. ఇలాంటి ప్రత్యయం ఏర్పడటానికి, దృఢమైన అంతులేని నమ్మకం అవసరము'' అన్నారు.

 

 

 

 


ఈ ప్రకారంగా తర్కించుతూ, మేము నలుగురం పండితులము భగవంతుని వెదకడానికి అడవులలో తిరగటం ఆరంభించాము. తక్కిన ముగ్గురూ వారి స్వతంత్రబుద్ధిని ఉపుయోగించి వెదకడానికి నిశ్చయించుకున్నారు. దారిలో ఒక వర్తకుడు (బంజారా) మమ్మల్ని కలిసి "ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది. ఎంతదూరం వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు'' అని అడిగాడు. అడవులు వెదకడానికి అని మేము జవాబు ఇచ్చాము. ఏమి వెదకడానికి అని అతడు తిరిగి అడిగాడు. ఏదో సందిగ్తమైన యుక్తి జవాబిచ్చాము. దఎయరహితంగా మేము తిరగడం చూసి అతడు కనికరించి ఇలా అన్నాడు. "అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ యిష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరించదలిచితే మీ వెంట ఒక మార్గదర్శి ఉండితీరాలి. అనవసరంగా ఈ ఎండవేళ అప్పుడు ప్రయాస పడతారు ఎందుకు? మీ రహస్యాన్వేషణ నాకు చెప్పనక్కరలేదు. అయినా మీరు కోర్చుని, భోజనం చేసి, నీళ్ళు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని తరువాత పోవచ్చును. ఓపికతో ఉండండి'' అన్నాడు. అతడు అంత మృదువుగా మాట్లాడినా, వాణ్ణి నిరాకరించి నడవటం సాగించాము. మాకు అన్ని సంగతులు తెలుసు కాబట్టి ఇతరుల సహాయం అక్కర్లేదు అనుకున్నాము.

 

 

 


అడవులు పెద్దవి, మార్గాలు లేనివి. చెట్లు దగ్గరగానూ, ఎత్తుగాను ఉండటంతో సూర్యరశ్మి లోపలికి ప్రవేశింపలేకపోయింది. కాబట్టి దారి తప్పి అటుఇటు చాలాసేపు తిరిగాము. చిట్టచివరికి ఎక్కడనుండి బయలుదేరామో అక్కడికే అదృష్టవశాత్తు తిరిగివచ్చాము. బంజారా తిరిగి కలుసుకుని ఇలా అన్నాడు "మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పారు. చిన్నదానికిగాని, పెద్దదానికిగాని సరైన మార్గం చూపించడానికి ఒక మార్గదర్శి వుండి తీరాల్సిందే. ఉత్తకడుపుతో ఎలాంటి అన్వేషణ జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరు కలవరు. పెట్టిన భోజనం వద్దనకండి, వడ్డించిన విస్తారిని తోసివేయకండి, భోజనపదార్థం అర్పించటం శుభసూచకం'' ఇలా అంటూ తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బ్రతిమాలాడు. నా మిత్రులు ముగ్గురూ ఆ మాటలను లక్ష్యపెట్టక, భోజనం చేయకుండా ప్రయాణం సాగించారు. వారి హఠం ఆ విధంగా ఉండింది. నేను మాత్రం ఆకలితోనూ, దాహముతోనూ ఉన్నాను. బంజారా చూపించిన అసామాన్య ప్రేమకు లొంగిపోయాను. మేమెంతో తెలివైనవారమని అనుకున్నాము. కాని, దయాదాక్షిణ్యాలకు దూరమయ్యాము. బంజారా చదువుకున్నవాడు కాదు; యోగ్యతలు లేనివాడు; తక్కువజాతి వాడు, కాని అతని హృదయం ప్రేమమయం. భోజనం చేయమని మమ్మల్ని వేడుకున్నాడు. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరయితే ఇతరులను ప్రేమిస్తారో వారు నిజంగా నాగరికులని తలచి వాని ఆతిథ్యం నామోదించటమే జ్ఞానానికి ప్రథమసోపానమని అనుకున్నాము. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం నేను తిని (అనగా బాబా) నీళ్ళు త్రాగాను.

 

 

 

 


ఏమి ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచారు. వారు అడగటంతో జరిగిన వృత్తాతం అంతా విశదపరిచాను. అప్పుడు వారు "నాతో రావడానికి ఇష్టపడతారా? మీకు కావలసినది ఏదో నేను చూపెడతాను. నాయందు విశ్వాసం వున్న వారికే జయము కలుగుతుంది'అన్నారు. మిగిలినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో వెళ్ళారు. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడ్డాను. అప్పుడు వారు నన్నొక బావి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్ళకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసారు. నా చేతులతో గాని నోటితోగాని నీళ్ళను అందుకోలేని పరిస్థితి. నన్ను ఈ విధంగా వ్రేలాడగట్టి వారు ఎక్కడికో వెళ్ళారు. 4, 5 గంటల తరువాత వారు తిరిగి వచ్చి నన్ను బావిలోనుంచి బయటికి తీసి ఎలా వున్నావు అని అడిగారు. "ఆనందంలో మునిగివున్నాను, నేను పొందిన ఆనందాన్ని నావంటి మూర్ఖుడు ఎలా వర్ణించగలడు?'' అని జవాబిచ్చాను. దీన్ని విని గురువుగారు అత్యంత సంతృప్తి చెందారు. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారిదగ్గర ఉంచుకున్నారు. తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూసినట్టు నన్ను వారు కాపాడారు. నన్ను తమ బడిలో చేర్చుకున్నారు. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచిపోయాను. నా అభినానం అంతా తొలగిపోయింది. నాకు సులభంగా విమోచనం కలిగింది. గురువుగారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలని అనిపించింది. వారి ప్రతిబింబము నా కనుపాపలలో నిలవనప్పుడు నాకు కనులు లేకుండా ఉండటమే మేలని అనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరూ రిక్తహస్తాలతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తంగా తోస్తూ ఉండేది. నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతా వేరే. నా ఇంద్రియాలు అన్నీ తమతమ స్థానాలు విడిచి, నా కళ్ళముందు కేంద్రీకృతమయ్యాయి; నా దృష్టి గురువులోనే కేంద్రీకృతమయ్యింది. నా ధ్యానమంతా నా గురువుపైనే నిలిపాను. నాకింకొక దానిలో స్పృహ లేకపోయింది. వారిని ధ్యానం చేయనప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్ధమవుతూ ఉండింది. నిశ్శబ్దంగా వారికి నమస్కరిస్తూ ఉన్నాను.

 

 

 

 


ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యాలు కనిపిస్తాయి. భక్తులు జ్ఞానం సంపాదించడానికి వెళ్ళి ద్రవ్యాన్ని, కాలాన్ని, కష్టాన్ని వ్యయం చేస్తారు. చిట్టచివరకు పశ్చాత్తాప పడతారు. అక్కడున్న గురువు తనకు తల రహస్యశక్తిని గురించి తన ఋజువర్తనం గురించి పొగుడుకుంటూ తన పావిత్ర్యం ప్రదర్శిస్తారే తప్ప, హృదయం మృదువుగా వుండదు. అతడు అనేక విషయాల గురించి మాట్లాడతారు. తన మహిమను తానె పొగుడుకుంటారు. కాని అతని మాటలు భక్తుల హృదయంలో నాటవు. వారిని ఒప్పించలేవు. ఆత్మసాక్ష్యాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బదులు శిష్యులకు ఏమి మేలు చేస్తాయి? వారికీ ఏమి లాభం? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షంతో ఎలాంటి శ్రమ లేకుండా ఆత్మజ్ఞానం దానిమటుకు అది నాలో ప్రకాశిస్తుంది; నేను కోరుడానికి ఏమీ లేకపోయింది. సర్వం దాని మట్టుకు అదే పగటి ప్రకాశంలా బోధపడింది. తలక్రిందుగా కాళ్ళు మీదుగా ఉంచటం వలన కలిగే ఆనందం గురువుకే తెలుసు.

 

 

 

 


నలుగురిలో ఒకడు కర్మఠుడు (అంటే కర్మలలో నమ్మకం ఉన్నవాడు). అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధాలు మాత్రమే తెలియును. రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానానికి గర్వించేవాడు. మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్యశరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వాన్ని చేసేవాడని అతని నమ్మకం. వారు ఇలా తర్కించుచూ వివాదపడుతుండగా దేవుని సమస్య వచ్చింది. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదకడానికి వెళ్ళారు. వివేకానికి వైరాగ్యానికి అవతారమైన శ్రీసాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మస్వరూపులై కూడా వారు ఎందుచేతనో ఇతరులతో కలిసి తెలివితక్కువగా ప్రవర్తించారని ఎవరైనా అడగవచ్చు. ప్రజాభిప్రాయాన్ని, వారి మంచిని సంపాదించడానికి, వారికొక ఉదాయరణ చూపడానికి, వారు ఇలా చేశారు. వారు అవతారపురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి అతని ఆహారాన్ని ఆమోదించారు. అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆయారాన్ని నిరాకరించినవారు కష్టాల పాలయ్యారు. గురువు లేనిదే జ్ఞానం సంపాదించటం వీలుకాదని వారు బోధించారు. తైత్తిరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మతగ్రంధాలను అభ్యసించాలని చెప్పుతున్నది. ఇవే కాక మన మనస్సును పావనం చేయడానికి మార్గాలు. మనస్సును పావనం చేయనిదే ఆత్మసాక్ష్యాత్కారం పొందలేము. ఇంద్రియాలుగాని, మనస్సుగాని, బుద్ధిగాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షం, అనుమానం మొదలైన ప్రమాణాలు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మం, అర్థం, కామం మన కృషివల్ల లభిస్తాయి. కాని నాలుగవది అయిన మోక్షం గురువు సహాయం వల్లనే పొందగలము.

 

 

 

 


సాయి దర్బారులోనికి అనేకమంది వచ్చి, వారికి తెలిసిన విద్యలను ప్రదర్శించి వెళ్ళేవారు. జ్యోతిష్కులు రాబోయే విషయాలు చెపుతూ ఉండేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటపాడేవారు మొదలైనవారు బాబా దర్శనానికి వచ్చేవారు. ఒక మహారు (మాలవాడు)  వచ్చి జోహారు చేసి యీ సాయి "మాబాప్' (తల్లీ తండ్రీ) అనీ, వారు మన చావుపుట్టుకలను తుడిచివేస్తారని చెప్పాడు. గారడీవాళ్ళు, గుడ్డివాళ్ళు, చొట్టవారు, నర్తకులు, నాథసంప్రదాయంవారు, పగటి వేషాలవారు కూడా అక్కడ సమానంగా ఆదరింపబడుతూ ఉండేవారు. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించాడు. తన పాత్రను ముగించాడు. మనం ఇప్పుడు ఇంకొక కథను విందాము.


గోఖలేగారి భార్య - ఉపవాసము :

 

 

 


బాబా ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసేవారి మనస్సు స్థిమితంగా వుండదు. అలాంటివాడు పరమార్థం ఎలా సాధిస్తాడు? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయాలి. కడుపులో తడి కలగజేసే ఆహారం గాని, పౌష్టికశక్తి గాని లేనప్పుడు భగవంతుణ్ణి ఏ కళ్ళతో చూడగలం? ఏ నాలుకతో పొగడగలము. ఏ చెవులతో వాటిని వినగలము? ఏవేళ మన అవయవాలన్నీ వాటి శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, మనం భక్తి మొద్ఫలైన సాధనాలను ఆచరించి దేవుని చేరగలం, కాబట్టి ఉపవాసం గాని మితిమించిన భోజనంగాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరానికి, మనస్సుకి కూడా మంచిది.
గోఖలే భార్య, కానిట్ కర్ భార్య శ్రీమతి కాశీబాయి దగ్గరనుండి దాదా కేల్కరు జాబు తీసుకుని షిరిడీకి వచ్చారు. ఆమె బాబా పాదాల దగ్గర మూడురోజులు ఉపవాసంతో కూర్చోవాలనే నిశ్చయంతో వచ్చింది. బాబా అంతకు ముందురోజు కేల్కరుతో తన భక్తులను హోలీపండుగ రోజు ఉపవాసం చేయనీయమని చెప్పి ఉన్నారు. వారు ఉపవాసం ఉన్నట్లయితే బాబా (తన) యొక్క ఉపయోగమే అన్నారు. ఆ మరుసటి రోజు ఆమె దాదాకేల్కరుతో వెళ్ళి బాబా దగ్గర కూర్చుని వుండగా బాబా వెంటనే ఆమెతో "ఉపవాసం చేయవలసిన అవసరం ఏమిటి? దాదాభట్టు ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తిను'' అన్నారు. హోళీ పండుగ వచ్చింది. దాదాకేల్కరు భార్య బయట చేరింది. కేల్కర్ ఇంట్లో వండటానికి ఎవరూ లేకపోయారు. కాబట్టి బాబా సలహా సమయోచితంగా ఉండింది. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసింది. ఆ రోజు అక్కడే ఉంది. ఇతరులకు పెట్టింది. తాను తినింది. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి!


బాబా సర్కారు :

 

 

 

 


బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పారు "నా చిన్నతనంలో భుక్తి కోసం వెదుకుతూ బీడ్ గాం వెళ్ళాను. అక్కడ నాకు బట్టలపై చేసే అల్లికపని దొరికింది. శ్రమ అనకుండా కస్టపడి పనిచేశాను. యజమాని నా పనికిసంత్రుప్తి చెందాడు. నాకంటే పూర్వం ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో ఉన్నారు. మొదటివాడికి 50 రూపాయలు, రెండవవాడికి 100 రూపాయలు, మూడవవాడికి 150 రూపాయలు, నాకు ఈ మూడు మొత్తాలకు రెండింతలు అంటే 600 రోపాయలు జీతం ఇచ్చాడు. నా తెలివితేటలూ చూసి, యజమాని నన్ను ప్రేమించి, మెచ్చుకుని, నిండు దుస్తులు ఇచ్చి నన్ను గౌరవించాడు. (తలపాగా, శెల్లా) వీటిని వాడకుండా జాగ్రత్తగా దాచుకున్నాను. మానవుడు ఇచ్చినది త్వరలో సమసి పోతుందిగాని, దైవం ఇచ్చేది శాశ్వతంగా నిలుస్తుంది. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు "తీసుకో, తీసుకో'' అంటాడు కాని, ప్రతివాడు నా దగ్గరికి వచ్చి 'తే, తే' అంటున్నాడు. నేనేమి చెపుతున్నానో గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు. నా సర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనం) నిండుగా ఉన్నది. అది అంచువరకు నిండి పొంగిపోవుచున్నది. నేను "త్రవ్వి ఈ ధనాన్ని బండ్లతో తేసుకుని వెళ్ళండి. సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యాన్ని అంతా దాచుకోవాలి'' అంటున్నాను. "నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి అత్యంత అమోఘమైనవి. నా సంగతి ఏమిటి? శరీరము మట్టిలో కలుస్తుంది. ఊపిరి గాలిలో కలుస్తుంది. ఇలాంటి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడికో వెళ్తాను; ఎక్కడో కూర్చుంటాను; మాయ నన్ను అమితంగా బాధిస్తూ ఉంది. అయినప్పటికీ నావారి కోసం నేను ఆత్రపడతాను. ఎవరయినా ఏమైనా సాధన చేసినట్లయితే తగిన ఫలితం పొందుతారు. ఎవరయితే నా పలుకులను జ్ఞాపకం ఉంచుకుంటారో, వారు అమూల్యమైన ఆనందాన్ని పొందుతారు.

ముప్పైరెండవ అధ్యాయం సమాప్తం