Read more!

సాయీ శరణం .. బాబా శరణం

 

మానవాళికి భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం శ్రీ సాయి. శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు . శ్రీ సాయి అలా జీవించి చూపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నోసమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం సాయితత్త్వం. చిక్కులో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయుతనిచ్చి సేద తీర్చే సాధనం సాయితత్త్వమే. మానవాళికి ఉద్దరణ కోసం, మనిషిగా మానవత్వంలో ఎలా బతకాలో చెప్పటం కోసం శ్రీ సాయి తన కాలాన్ని మొత్తం వెచ్చించారు. పూజా విధులు, పురస్కార తంతులు, విధి విధానాలు ... బాబాకు వీటితో పనిలేదు. శ్రద్ధ , సహనం ...ఇవి రెండే భక్తుల నుంచి కోరిన బాబా, వాటిని ఆచరించిన వారికి తన ప్రేమను పంచారు.

బాబా బోధించిన ఆధ్యాత్మిక సూత్రాలను ఆచరించాలంటే మన మనసులు సాయి మందిరాల నెలవులు కావాలి. శ్రీ సాయి ఆచరించిన సాధ్యం కాని విధానాలను ఆచరించమని చెప్పలేదు .అర్ధంకాని తత్త్వాన్ని బోధించలేదు .జీవన వికాసానికి, జ్ఞాన సముపార్జనకు సులభోపాయాన్ని చెప్పారు. సులభ మార్గాన్ని చూప్పారు. కోరికలు విడిచిపెట్టాల్సిన పని లేదన్నారు. సంసార బంధాలను తెంచుకోమని అసలే చెప్పలేదు . ఆడంబరాలకు, భేషజాలకు పోవద్దన్నారు .నలుగురి హితాన్ని కోరేదే అందరి అభిమతం కావాలని చాటారు.

సాయి ఆదర్శ జీవన విధానం మనవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి . ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం. సాయితత్వాన్ని నిత్యజీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతు౦ది జీవితం ధన్యమవుతుంది .సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది. శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు . స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్ధ సద్గురు అయ్యారు .మనిషి జీవిత పరమార్ధం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి ?ఇదంతా బాబా ఆచరించి చూపారు .ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమకర్తవ్యం కదా!

బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాలను చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయమనే క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్దులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి. షిరిడి సాయిబాబా ఈ యుగావతరం. నేడు ప్రపంచ౦ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ‘శ్రీ సాయి సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది . ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది.సాయి బోధనలు, చదివి, విని ఊరుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు .వాటిని ఆచరిస్తే ఫలం, ఫలితం. బాబా అడుగుజాడలో నడవడానికి మనం ఏదైనా ప్రయతం చేసి ఒకడుగు వేస్తె బాబా మనవైపు పదడుగులు వేస్తారు . సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్దులు మనో, జ్ఞాన, వ్యక్తిత్వ వికాస సంపన్నమవుతాయి.