Read more!

సాయి చింతనలో - చింతలు దూరం

 

సాయిబాబాలో సూర్యుని తేజస్సు కనిపిస్తుంది. చంద్రుని చల్లదనం అనుభూతికొస్తుంది. "సాయీ నువ్వే శరణం" అన్నవారిని వ్యామోహాల నుండి బయట పడేస్తాడు. సాయి చింతనతో ప్రశాంతత చేకూరుతుంది. చింతలు దూరమౌతాయి.వ్యాకులత తగ్గిస్తాడు. అజ్ఞానపు చీకటిని తొలగించి, జ్ఞాన జ్యోతులు వెలిగిస్తాడు. కష్టాల నుండి విముక్తి పొందే మార్గాన్ని సూచిస్తాడు.

సద్గురు సాయినాథునికి నమస్సుమాంజలులు. నువ్వే శరణని వేడినవారిని బాబా తప్పక ఆదుకుంటాడు. కంటికి రెప్పలా కాపాడుతాడు. అణువు నుండి పరమాత్మ వరకూ, సమస్త జీవరాశుల్లో సాయిబాబా వ్యాపించి ఉన్నాడని మనం విస్మరించకూడదు. మనోచక్షువుతో చూస్తే సాయి దర్శనం అవుతుంది. చింతలు దూరం చేసుకోడానికి, మనోభీష్టాలు నెరవేర్చుకోడానికి సాయి చింతనలో గడపాలి. కష్టం కలిగినప్పుడు, మనసుకు క్లేశం కలిగినప్పుడు బాబాను తలచుకుంటే, ఆయన్ను స్మరిస్తే మనసుకు నిశ్చింతగా ఉంటుంది.

సాయీ నువ్వే శరణం అని బాబామీద భారం మోపితే దుఃఖాల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఆపదలు దూదిపింజల్లా తేలిపోతాయి. సాయిబాబా చింతనతో కష్టాలు తగ్గిపోవడం, దుఃఖాలు నశించడమే కాదు ప్రశాంతత చిక్కుతుంది. అహంకారం తొలగిపోతుంది. కామం, క్రోధం, ద్వేషం, అసూయ లాంటి అవలక్షణాలు నశిస్తాయి. మనోవికారాలు మాయమౌతాయి. సాయీ నువ్వే శరణం అనుకుంటే మనసులో అలజడులు, అల్లకల్లోలాలు తలెత్తవు. బాబా మనసును నిబ్బరంగా ఉంచుతాడు. సాయి చింతనలో చింతలు దూరమౌతాయి. జీవనగమనంలో హాయిగా ముందుకు సాగేలా చేస్తాడు.