Read more!

పార్వతీదేవి జీవితమంతా శాపాల మూలంగా గడిచిందా?

 

పార్వతీదేవి జీవితమంతా శాపాల మూలంగా గడిచిందా?

మహిషాసురుడి మృతదేహాన్ని ముందు పెట్టుకుని వర్ణాతీతంగా విలపిస్తోంది శ్యామల!! రేపటి నుంచి సూర్యోదయం స్తంభించిపోవుగాక! ఇదే నా శాపం!" అంటూ కట్టలు తెంచుకున్న ఆగ్రహాంతో శపించింది. మరుసటి రోజు సూర్యుడు ఉదయించలేదు. సృష్టి తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంది. సమస్తమూ అపసవ్యంగా అస్తవ్యస్తంగా నడుస్తోంది. దేవతలు విచారగ్రస్తులయ్యారు. సూర్యోదయ స్తంభనకు కారణం తెలుసుకోడానికి వారంతా దుర్గాదేవి దగ్గరకు వచ్చారు. తక్షణ కర్తవ్యమేమిటి? "అవును శ్యామల శాపం సముచితమే. ఓ మానవతిపై ఇంద్రుడి ఆఘాయిత్యాన్ని, అత్యాచార యత్నాన్ని మీరందరూ మన్నించారు. ఇంద్రుడి దుశ్చర్యకి మొదట అతనిని దయారహితంగా దండిచాలి. తదనంతరం మనమందరం శ్యామల వద్దకు వెళ్ళి సృష్టి గమనాన్ని పునః ప్రారంభించమని వేడుకొందాం" అని దుర్గాదేవి తన అభిమతాన్ని వివరించింది.

"ఇంద్రా! నీ కామం, ఉద్రేకం, వాంఛ, ద్వేషం, ఈర్ష్య ఎంత వినాశనానికి కారణమైందో చూశావా! మునులు నిర్వహించే యజ్ఞయాగాలలో పూజార్హతను నీవు కోల్పోయావు, నీవు శిలవు ఆపుదువు గాక!" అని ఇంద్రుడిని శపించింది ఆగ్రహించిన దుర్గ. 

ఈ శాపవచనాన్ని ఆలకించిన ఇంద్రాణి కనకదుర్గ పాదాల చెంత మోకరిల్లి పరిపరి విధముల ఈ విధంగా ప్రార్థించసాగింది. "ఓ అమృత కరుణామయి! ఓ అనంత దయా శాలినికి ఓ పవిత్ర మానవతి! నీ ఆవేదనను, ఆగ్రహాన్ని మేము అర్థం చేసుకోగలము. మహిషాసురుడు స్వర్గంపై విజృంభించి ఆక్రమించుకున్ననాడే నా పతి శాపగ్రస్తుడయ్యాడు దయచేసి కరుణించి నా పతిని శాపవిముక్తుణ్ణి చేయు తల్లీ!"అని వేడుకుంది.

"ఇంద్రాణి! ఇంద్రుడి దుష్క్రియకు, దుష్ప్రవర్తనకు ఈ దండన సరిపోదు. శ్యామల మన్నించిననాడే ఇంద్రుడు తన పూర్వరూపాన్ని పొందగలడు. నీవు వెళ్ళి శ్యామలను వేడుకొనుము" అని సూచించింది ఆదిశక్తి

శ్యామలను ఆశ్రయించింది ఇంద్రాణి. భోరున విలపిస్తూ... "శ్యామల! జరిగిన దుష్కృత్యాలకు మేము తీవ్రంగా పశ్చాత్తాపం చెందుతున్నాము. శిలగా మారమని, మునులు నిర్వహించే యజ్ఞయాగాదులలో పూజార్హత కోల్పోయేవని కనకదుర్గ ఇంద్రుడిని శపించింది. నా పతి దేవుడిని మన్నించు" అని వేడుకొంది.

"అవును. నీ భర్త సుఖసంతోషాలు, శ్రేయస్సు నీకు ముఖ్యం, నన్ను చూడు. కనకదుర్గ అనే ఒక ఆడదాని చేతిలో నేను నా పుత్రుడిన్ని కోల్పోయాను, నా భర్తను పొగొట్టుకొని సౌభాగ్యానికి దూరమయ్యాను. నా గర్భశోకాన్ని ఎవరితో చెప్పుకోవాలి? నా భర్త వియోగాన్ని ఎలా భరించాలి? వారితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె ఇసుమంత కరుణ చూపలేదే! నిజానికి నా భర్త దక్షప్రజాపతి పుత్రిక, కశ్యప మహాముని అర్థాంగియైన దను పుత్రుడు. నేను బ్రహ్మకు పుత్రికను, అగ్నిదేవుడికి అనుజను బ్రహ్మపాత్రుడైన నా పుత్రుడు మహిషాసురుడికి కనకదుర్గతో ఎటువంటి వైరము, వైషన్యుమూ లేదు. కానీ ఆమె దేవతల నియంతృత్వ వైఖరికే అండగా నిలిచింది. దేవతలందరూ తమ ఉనికిని, ప్రాణులను కాపాడుకొనుటకు విస్సిగ్గుగా ఒక ( స్త్రీ శక్తిని) ఆడదానిని ఆశ్రయించారు. ఇది వారి పిరికితనాన్ని అసమర్థతను సూచిస్తోంది. నా పుత్రుడిని పాతాళానికి వెళ్ళి తలదాచుకొమ్మని ఆదేశించే అధికారం దుర్గాదేవికి ఎక్కడిది? మహాయోధుడైనా నా పుత్రుడు మహాశక్తియైన కనకదుర్గతో పోరాడాడు. బ్రహ్మదేవుడి ఏకైక జామాతమైన నా భర్త రక్తబీజుడు శుంభనిశుంభులతో కలిసి ఆమెను ఎదుర్కొన్నాడు. 

ఒక దశలో వీరిని ఎదురించ దుర్గాదేవి వశం కాలేదు. ఆ సమయాన తన అలాటం నుంచి భయంకర, భీకర కాళికను సృష్టించింది. మహాశక్తివంతులైన రాక్షసులను కాళిక చీల్చి చండాడింది. ఆమె విజృంభణ ధాటికి తట్టుకోలేక చినుక, వక్కల, దుర్ముఖ, రక్తబీజ, చండముండలు, శుంభనిశుంభులు, ధూమ్రలోచనుడు, అసువులు బాసారు, అంచిక, మాంత్రికలతో కలిసి కాళిక తన నాలుకను వెడల్పుగా చాచి నా భర్త రక్తాన్ని చివరి బొట్టుదాకా పానం చేసింది. అంబిక ఆయన దేహాన్ని ముక్కలుగా ఖండించింది. భూతప్రేత పిశాచాల కన్నా. దారుణంగా ఆమె నా భర్త రుధిరాన్ని పానం చేసింది. ఈ చర్య ఎంతవరకు సముచితము?" అని దుఃఖం ప్రకటితమయ్యేలా ఇంద్రాణిని నిలదీసింది శ్యామల.

"దుర్గా దేవి! నా భర్తను, నా పుత్రుడిని నా నుంచి దూరం చేశావు కదూ! పతి ఎడబాటు ఎంత దుఃఖభూయిష్టమో నీకు తెలియాలి. పేగు తెంచుకు పుట్టిన సంతానం కళ్ళ ముందే కడతేరితే ఆ గర్భశోకం ఎంత వర్ణనాతీత బాధాకరంగా ఉంటుందో నీకు తెలియాలి. నీవు పార్వతిగా మానవ రూపందాల్చి పరమశివుడి ప్రేమకోసం పరితపించెదవు గాక! తారకాసురుడి మూలాన భర్తతో వైవాహిక శారీరక సౌఖ్యానికి దూరమై పుత్రవాంఛ అధికమై మనోవేదనను అనుభవించెదవుగాక అనివార్య పరిస్థితుల్లో గర్భబాహ్యాన పుత్రుడికి జన్మనిచ్చెదవు గాక! అతి చిరుప్రాయంలో శిశువుల ముద్దులొలుకు ఆటలకు, పాటలకు, పలుకులకు, నవ్వులకు, నడకలకు, చిలిపి చేష్టల వలన తల్లి పొందే మధుర మధురానుభూతులను కోల్పోయెదవు గాక! ఇంతే కాదు. భర్త సహజ ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు దూరమవుదువు గాక! నీ జ్యేష్ఠపుత్రుడు నీ స్వేదం నుంచి అంధుడిగా జనించి నీతో లైంగికైక్యాన్ని వాంఛిస్తుండగా శివుడు అతడి హృదయాన్ని నీవు యుద్ధరంగంలో వినియోగించిన త్రిశూలంతోనే చీల్చుగాక! నీ నుండి వెలువడిన మలినం నుంచి ద్వితీయ పుత్రుడు జనియించగా అతడిని సైతం పరమశివుడు నీవు యుద్ధంలో వినియోగించిన ఖడ్గంతో వధించు గాక! నీ ఆలోచనలు పుత్రికాజననానికి కారణమై ఆమె మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతానుబంధాలకు దూరమై అరణ్యాలలో జీవించు గాక! నా పుత్రుడిపై నీలో ఉన్న పట్రూప ద్వేషాన్ని నీ కనిష్ట పుత్రుడైన షణ్ముఖుడి అత్యంత మహోన్నతమైన, సురప్రపంచ ప్రసిద్ధి అయిన గణాధిపత్యర్హతను కోల్పోయి చింతాకృతున్ని చేయుగాక!" అని పట్టరాని ఆగ్రహంతో, ఉద్రేకంతో కనకదుర్గను శపించింది శ్యామల.

                                        ◆నిశ్శబ్ద.