Read more!

దీప ప్రజ్వలనం - విశేషాలు

 

దీప ప్రజ్వలనం - విశేషాలు

 

 

అంధకారం..... అఙ్ఙానానికి.,నిరాశకు గుర్తు.
కాంతి.....ఙ్ఞానానికి.,ఆనందానికి గుర్తు.


అఙ్ఞానమనే చీకటి నుంచి...ఙ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించడమే ‘దీపావళి’ పండుగలోని అంతరార్ధం. ‘దీప’ అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. దీప + ఆవళి అంటే..దీపాల వరుస అని అర్ధం. దీపం ఐశ్వర్యం అయితే.., అంధకారం దారిద్ర్యం. దరిద్రాన్ని పారద్రోలి,ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే ‘దీపావళి’ పండుగ ముఖ్యోద్దేశ్యం. ‘దీపం’ త్రిమూర్తిస్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి.., ‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి.., ‘తెల్లని’ కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు.


సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్ - దివ్య జ్యోతిర్నమోస్తుతే 


ఏ దీపమైనా మూడువత్తులు వేసి వెలిగించాలిగానీ.. ఒంటి దీపం.,రెండు వత్తుల దీపాలు వెలిగించరాదు. ‘మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాలలోని అంథకారాన్ని పారద్రోలి లక్ష్మీనిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది. దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని ఆవు నేతితోగానీ, నువ్వుల నూనెతోగానీ భక్తిగా వెలిగించాలి. మరెంతో భక్తిగా నమస్కరించాలి’ అని పై శ్లోకం అర్థం. దీపం ... లక్ష్మీ స్వరూపం. దీపం ఉన్నచోట సర్వసంపదలు తాండవిస్తాయి. ఆనందాలు వెల్లివిరుస్తాయి. సుఖ, సంతోషాలు చోటు చేసు కుంటాయి. అందుకే నిరంతరం మన పూజామందిరంలో దీపం వెలుగుతూండలనే నియమమం పెట్టారు.   దీపం..  విజయానికి చిహ్నం. అందుకే పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే సైనికులకు, రాజులకూ విజయతిలకం దిద్ది విజయహారతులిచ్చి పంపేవారు. నిజానికి ‘దీపాన్ని’ మట్టి ప్రమిదలోనే వెలిగించాలి. మట్టి.., ఉష్ణాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అందుకే ఎంతసేపు వెలిగినా మట్టి ప్రమిద వేడెక్కదు. మనం ఆర్భాటం కొద్దీ ఉపయోగించే  తక్కిన వెండి, ఇత్తడి, రాగి, కంచు ఇత్యాది లోహపు ప్రమిదలు.., దీపం వెలిగించిన కొద్దిసేపటికే వేడెక్కి పోతాయి. ఆ వేడిని భూమాత భరించలేదు. కనుకనే వట్టినేలపైన దీపం వెలిగించరాదు. ప్రమిదలో ప్రమిద వేసి మూడువత్తుల దీపం వెలిగించాలి. ఇది సాంప్రదాయం.


మానవదేహం మట్టి నిర్మితం.అందుకే మనం ఎంత నలుగు పెట్టుకుని రుద్దినా., ఎన్ని సబ్బులు అరగదీసినా., ఎన్ని షాంపూలతో స్నానం చేసి వచ్చినా.., మన దేహంపై ఎక్కడ రుద్దినా కాస్తో కూస్తో మట్టి రాలుతుంది. గమనించండి. ఈ మానవదేహం ఓ మట్టి ప్రమిద. ఈ ప్రమిదలో జ్యోతి రూపంతో భాసిల్లేవాడే ‘పరమాత్మ’. ఆ జ్యోతి ఈ మానవ ప్రమిదలో వెలుగుతున్నంతసేపు ఈ దేహం చైతన్యవంతంగా, ప్రాణంతో ఉంటుంది. దీపం లేని ప్రమిదకు విలువ ఉండదు. అందుకే మనిషి మరణించిన తర్వాత ఆ పార్థివదేహం తల దగ్గర దీపం వెలిగిస్తారు. ఈ దేహంలోని జ్యోతి బయటకు వెళ్లిపోయింది అని తెలియ చెప్పడానికి ఆ దీపం నిదర్శనం. ఇక్కడ మాత్రం ఒంటి దీపాన్నే వెలిగించాలి. కారణం.. ‘ఏకో పరాత్మా బహుదేహ వర్తిః’ దేహాంతర్గతుడైన పరమాత్మ ఒక్కడే.  ఇది వేదాంతార్థం. ఇక..అగ్నిదేవుని రూపమే ఈ దీపం. మన హైందవధర్మానికి మూలస్తంభాలు నాలుగు
వేదాలు. అందులో తొలివేదం..‘ఋగ్వేదం’.


‘అగ్నిమీళే పురోహితం యఙ్ఞస్య దేవమృత్విజమ్
హోతారం రత్నధాతమమ్’


ఇది ఋగ్వేదంలోని తొలి ఋక్కు. ఈ ఋక్కుతోనే వేదం ప్రారంభమవుతుంది. అంటే...తొలిసారిగా కీర్తించబడిన తొలి దేవుడు ‘అగ్ని’. అంటే ‘జ్యోతిస్వరూపం’. ఈ జ్యోతిస్వరూపమే పురహితాన్ని కోరే తొలి పురోహితుడు..ఋత్విక్కుడూను. మన జీవితంలోని మంచి, చెడులలో మనకు తోడుగా ఉంటూ, మార్గదర్శకత్వం వహించేది ఈ జ్యోతి ఒక్కటే. కనుక ఆ ‘జ్యోతిని’ ఉపాసించడం., ఆరాధించచడం మన ధర్మం. నరకాసుర సంహారంతో సకల లోకాలు కష్టాల అంథకారంలోంచి సంతోషమనే వెలుగులోకి వచ్చాయి. అందుకే నరకచతుర్దశి నుంచే.. మన సుఖ, సంతోషాలను వ్యక్తంచేయడానికి నిదర్శనంగా దీపాలు వెలిగించాలి. ఆ వెలుగులో పయనించాలి.

- యం.వి.యస్. సుబ్రహ్మణ్యం