Read more!

గురుదేవుడు దత్తాత్రేయుడు (Gurudev Dattatreya)

 

గురుదేవుడు దత్తాత్రేయుడు

(Gurudev Dattatreya)

 

శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే, గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘గురువు' అంటే దత్తాత్రేయుడే! ఎందుకంటే ఆయనకున్న ఇరు పార్శ్వాల్లో రెండు రూపాలున్నాయి! అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు, దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు. ఈరోజు గురుపూర్ణిమ కనుక విశిష్ట గురువు దత్తాత్రేయుని స్మరించుకుందాం.

దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలూ, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు, ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని ‘స్మృతిగామి’ అంటారు.

 

CLICK HERE FOR Guru Purnima Photos

దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం.

దత్తాత్రేయుడు గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు. అందుకే దత్తాత్రేయుని

''జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం

నిశ్రేయసప్ర దం వందే స్మర్త్రగామీ నమావతు''

అని ప్రార్ధించుకుంటాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞానానందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.

మనసా స్మరించినంత మాత్రాన సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు మనకు లభించడం మన అదృష్టమే. కనుక ఎల్లవేళలా దత్తాత్రేయుని ధ్యానించుకుందాం.

దత్తాత్రేయుడు విశ్వమంతా పరచుకుని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగివుంటాడు. తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. అంతేనా, మనిషిలోని అసలు మనిషిని వెలికితీయగల మహిమాన్వితుడు.

వివేకంతో, విచక్షణతో, ఆలోచనల్ని అంతర్ మధించి అసలైన జ్ఞానాన్ని అందింపుచ్చుకోవాలి. అది మన కర్తవ్యం. అలాంటి విచక్షణాపరులుగా రూపొందాలి. సాధారణంగా ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ – ఈ మూడింటిని అందించగలిగేవాడు గురువు. అందుకే సృష్టిలో కన్నవారి తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు.

 

CLICK HERE FOR Guru Purnima Photos