జనవరి 29.. చొల్లంగి అమావాస్య.. దీన్ని అస్సలు మిస్ కాకండి ఎందుకంటే..!
జనవరి 29.. చొల్లంగి అమావాస్య.. దీన్ని అస్సలు మిస్ కాకండి ఎందుకంటే..!
జనవరి 29 పుష్య మాసపు అమావాస్య కానుంది. అమావాస్య అయిపోగానే మాఘమాసం ప్రారంభం అవుతుంది. అయితే మాఘమాసం ప్రారంభం కావడానికి ముందు వచ్చే ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యను ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్లీ ఏడాది వచ్చేవరకు ఇలాంటి అవకాశం దొరకదు. ఎందుకంటే ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. చొల్లంగి అమావాస్య రోజు వీర రాఘవ స్వామి పూజ చేసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు అయినా తగ్గుతాయని ఒక నమ్మకం ఉంది. దీని గురించి తెలుసుకుంటే..
చెన్నై నగరం శివార్లలో తిరువళ్లూర్ అని ఉంది. ఇక్కడ వీర రాఘవ స్వామి చాలా శక్తివంతమైన వాడు. ఈ గుడిలో చొల్లంగి అమావాస్య రోజు ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. ఎందుకు అంతమంది వస్తారు అక్కడికి అంటే.. అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. దృష్టి లోపం సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు.. ఇలా చాలా రకాల సమస్యలు ఉన్నవారు ఇక్కడి స్వామి దర్మనానికి వస్తారు. ఇక్కడి స్వామి వారికి, ఈ క్షేత్రానికి రోగాలను నివారించే శక్తి ఉందట. ఇక్కడ స్వామిని దర్మించుకుని, ఇక్కడి పుణ్యక్షేత్రంలో ఉప్పు కానీ, బెల్లం కానీ వేస్తే వేధిస్తున్న జబ్బులు కూడా నయం అవుతాయని అంటారు. వీర రాఘవ స్వామి గుడికి వెళ్లి దర్మనం చేసుకోలేని వారు ఏం చేయవచ్చు అంటే.. ఇంట్లోనే వీర రాఘవ స్వామి పూజ చేసుకోవచ్చు.
వీర రాఘవ స్వామి పూజకు సంబంధించి చాలా వీడియోలు యూట్యూబ్ లో ఉంటాయి. వాటిని చూసి పూజను సులువుగా చేసుకోవచ్చు. ఇకపోతే.. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే కాకుండా.. ఆరోగ్య సమస్యలు లేనివారు కూడా ఈ పూజను లక్షణంగా చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అయితే ఒక వెండి కడియాన్ని చేయించి వీర రాఘవ స్వామికి ఒక ప్రత్యేక దీపం వెలిగించి ఆ దీపం ముందు కడియాన్ని ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న మరుసటిరోజు ఈ కడియాన్ని చేతికి వేసుకోవాలి. ఆ కడియాన్ని మూడు రోజులు వేసుకున్న తరువాత దాన్ని తీసి తిరిగి దేవుడి గదిలో ఉంచాలి. తరువాత వీర రాఘవ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆ కడియాన్ని వీర రాఘవ స్వామి హుండీలో వేయాలి. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు చక్కబడతాయి. ఇక ఆరోగ్యం బాగున్నవారు కడియం లేకుండా సాధారణంగా పూజ చేసుకోవచ్చు.
చొల్లంగి అమావాస్య రోజు వీర రాఘవ స్వామి ముందు వెలిగించే దీపం సాధారణ దీపం పెట్టకూడదు. పిండి దీపం పెట్టాలి. అది కూడా బియ్యం పిండి దీపం పెట్టాలి. బియ్యం పిండి లో కలకండ ను పొడిగా చేసి కలపాలి. ఇందులో కొంచెం ఆవు నెయ్యి వేసి ఆ తరువాత కొద్దిగా నీరు కలిపి ముద్దగా చేసుకుని దీపం తయారు చేసుకోవాలి. ఈ దీపాన్ని స్వామి వారి ముందు పెట్టాలి. దీపం దగ్గరే వెండి కడియం కూడా పెట్టాలి. దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఆ తరువాత ఆ దీపం శాంతం అయ్యాక ఆ దీపంలో ఉన్న కాలిపోయిన ఒత్తులు తీసేసి ఆ కాలిన బియ్యం పిండి ప్రమిద పిండిని ప్రసాదంగా తీసుకోవాలి. వీర రాఘవ స్వామికి షోడశోపచార పూజ, అష్టోత్తరం, నైవేద్యం.. ఇవన్నీ చేయాలి. చొల్లంగి అమావాస్య రోజు ఇలా పూజ చేసుకుంటే అనారోగ్యం సమస్యలు ఉన్నవారికి ఎంతో గొప్ప మార్పు కనిపిస్తుంది.
*రూపశ్రీ.