Read more!

బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ ( Buddha Purnima Celebrations)

 

బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ ( Buddha Purnima Celebrations)

వైశాఖమాస పూర్ణిమ బుద్ధ పూర్ణిమ. బౌద్ధ మతాన్ని నెలకొల్పిన బుద్ధ భగవానుడి పుట్టినరోజు. బోధగయలో జరిగే బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో యాత్రికులు వస్తారు. బోధగయ తర్వాత, బౌద్ధమతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సారనాథ్ లో బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ వైభవోపేతంగా జరుగుతాయి.

వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు పెద్ద పండుగ. బౌద్ధమత సిద్ధాంతం ప్రకారం దేన్నీ ఇష్టంగా లేదా అయిష్టంగా తీసుకోకూడదు కనుక బౌద్ధులు ఈ బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ చాలా శాంతంగా వేడుక చేసుకుంటారు.
వైశాఖ పూర్ణిమ రోజున బౌద్ధులు, వారి అనుచరులు సూర్యోదయానికి ముందే మందిరాల్లో సమావేశమౌతారు. బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ 2011 హైదరాబాదులో ఘనంగా జరుగుతాయి.

బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ లో బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగరేస్తారు. బౌద్ధస్తూపాన్ని ప్రార్థిస్తారు. బుద్ధుని బోధనలను స్మరించుకుంటారు. ''ధర్మో రక్షతి రక్షితః'' అన్నారు కదా! ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది. బౌద్ధం ఈ ధర్మసూత్రాన్ని నొక్కి వక్కాణిస్తుంది. సత్యం, ధర్మం గురించిన కధలు గుర్తుచేసుకుంటారు. బౌద్ధమతస్తులు పూవులు, దీపాలు, అగరొత్తులు గురువుగారికి సమర్పించుకుంటారు. అందమైన పూవులు కొంతసేపటికి వాడిపోతాయి. కాంతులొలికే దీపం, మధురమైన అగరొత్తులు కాసేపటికి ఆవిరైపోతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికి ప్రతీకలుగా గురువుగారికి వీటిని ఇస్తారు.

గౌతముడు అనారోగ్యం, వృద్ధాప్యం, మృత్యువు లాంటి దుఃఖాలను చూసి చలించిపోయాడు. కష్టాలకు కారణం ఏమిటో అన్వేషిస్తూ కుటుంబాన్ని వదిలి వెళ్లాడు. దేశాటన చేస్తూ, ఎంతో శోధించిన మీదట, చివరికి గయలో, బోధివృక్షం కింద ''కోరికలే దుఃఖానికి మూల కారణం'' అని బోధపడింది. తాను కనుగొన్న నగ్నసత్యాన్ని ప్రచారం చేశాడు బుద్ధుడు.

'మనకు కష్టం కలుగుతోంది, దుఃఖిస్తున్నాము అంటే అందుకు ఏదో ఒక కోరికే కారణం. కనుక కోరికలను జయించమని ప్రబోధించాడు. లోకంలో ఏదీ శాస్వతం కాదు, ప్రతిదీ మార్పు చెందుతుంది, చివరికి నశించిపోతుంది. మార్పు సహజం కనుక దాన్ని ఆమోదించాలి. మంచి, చెడు దేనికీ ప్రతిస్పందించవద్దు ' - బుద్ధుని ఈ బోధనలు ఉన్నతమైనవి, ఉత్కృష్టమైనవి.

బుద్ధుని అనుచరులు మనదేశంలోనే కాదు, శ్రీలంక, బర్మా, థాయిలాండ్, టిబెట్, చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా, భూటాన్, కాంబోడియా, నేపాల్, జపాన్ - ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నారు. బుద్ధ పూర్ణిమ రోజున రాగల్గినవారు బోధగయకు రాగా, తక్కినవారు ఉన్నచోటే ఉత్సవం చేసుకుంటారు.

వైశాఖ పూర్ణిమనాడు మాంసాహారం బొత్తిగా తినరు. ఈరోజున ఏ జీవికీ హాని తలపెట్టరు. పశువులు, పక్షులు మొదలు పురుగులతో సహా దేన్నీ చంపరు. పైగా వాటికి స్వేచ్ఛ ప్రసాదిస్తారు. పంజరాల్లో ఉన్న వందలాది పక్షులను వదిలేస్తారు. శ్రీలంకలో బౌద్ధ పూర్ణిమ రోజున మద్యం ఎక్కడా విక్రయించరు. లిక్కర్ షాపులు పూర్తిగా మూసేస్తారు.

కొన్ని దేవాలయాల్లో బాల బుద్ధుని బొమ్మను ప్రదర్శిస్తారు. ఒక పాత్రలో నీళ్ళు పోసి, దాన్నిండా పూలు వేసి, వచ్చిన భక్తులను అందులో నీళ్ళు పోసేందుకు అనుమతిస్తారు. అలా నీరు పోయడంవల్ల చేసిన పాపాలు నశిస్తాయని, దేవుని కరుణాకటాక్షాలు లభిస్తాయని నమ్ముతారు.

వైశాఖ పూర్ణిమ రోజున సభలు, సమావేశాలు, ప్రార్థనలు, గౌతమ బుద్ధుని జీవనసరళిని, బౌద్ధమతాన్ని చాటే ఉపన్యాసాలు, గ్రూప్ మెడిటేషన్లు, ఊరేగింపులు, బుద్ధ విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. ఇలా బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతాయి. బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ సందర్భంగా మహాబోధి ఆలయం పూవులు, జండాలు, విద్యుద్దీపాలతో మహా కళాత్మకంగా, శోభాయమానంగా ఉంటుంది.