అంగారక సంకష్ట చతుర్థి.. ఈ రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే ఎంత ఫలితమంటే!
అంగారక సంకష్ట చతుర్థి.. ఈ రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే ఎంత ఫలితమంటే!
ప్రతి మాసంలో కృష్ణపక్ష చవితి నాడు సంకష్ట చతుర్థిగా జరుపుకుంటారు. వినాయక చవితిని జరుపుకోలేని వారు సంకష్ట చతుర్థి చేసుకుంటే వినాయక చవితి అంత ఫలం ఉంటుందని, వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ప్రస్తుతం వైశాఖ మాసంలో కృష్ణపక్ష చతుర్థి తిథి మే 5వ తేదీన వచ్చింది. ఇది మంగళవారం కావడం వల్ల దీన్ని అంగారక సంకష్ట చతుర్థి అని అంటారు. ఈ రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అంగారక సంకష్ట చతుర్థి రోజు కందులు, బెల్లం ఉపయోగించి దీపారాధన చేస్తే ఎంతో మంచిదని కూడా చెబుతున్నారు. ఇంతకూ ఈ రోజు చేయవలసిన పరిహారాలు ఏంటి? ఈ రోజు దీపారాధన ఎలా చేయాలి? తెలుసుకుంటే..
కందులు, బెల్లం దీపం..
వివాహం కాకపోవడం, అప్పుల బాధలు, సంతాన సమస్యలు మొదలైన వాటితో ఇబ్బంది పడేవారు అంగారక సంకష్ట చతుర్థి రోజు కందులు, బెల్లం తో దీపం వెలిగించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని అంటున్నారు.
ఈ పరిహారం ఎందుకు శక్తివంతమైనదంటే..
అంగారక గ్రహానికి కందులు అంటే చాలా ప్రీతి. అంగారకుడికి ఇష్టమైన దాన్యంతో చేసే పరిహారం వల్ల కుజదోషం, అప్పుల బాధలు తొలగించే శక్తి ఉంటుందట. ఇక ఇందులో ఉపయోగించే బెల్లం వినాయకుడికి ఎంతో ప్రీతి. వినాయకుడికి బెల్లాన్నిఅర్పిస్తే అన్ని రకాల గ్రహ దోషాలను శాంతింపజేస్తుందట.
ఏ దిశలో వెలిగించాలంటే..
కందులు, బెల్లం దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో వెలిగించడం మంచిది.
దీపారాధన విధానం..
ఒక ఇత్తడి పళ్లెం లేదా రాగి పళ్లెం తీసుకోవాలి. ఆ పళ్లెంలో కందులు పోయాలి. బెల్లం ఉండను తీసుకుని దాన్ని ప్రమిద లాగా తయారు చేయాలి. బెల్లానికి మధ్యలో గుంట చేసి ప్రమిద లాగా తయారు చేయాలి. ఈ ప్రమిదలో ఆవు నెయ్యి వేయాలి. అందులో ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం కోసం ఏక ఒత్తి ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. ఈ దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో వెలిగించాలి. అలాగే దీపారాధన తర్వాత సంకట హర గణపతి స్తోత్రాన్ని పఠించాలి.
కందులు, బెల్లం దీపం వల్ల కలిగే ప్రయోజనాలు..
అంగారక సంకష్ట చతుర్థి రోజు కందులు, బెల్లం తో దీపారాధన చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.
భూవివాదాలు కానీ, భూముల విషయాలలో ఏదైనా సమస్యలు కానీ ఉంటే.. అంగారక సంకష్ట చతుర్థి రోజు వెలిగించే కందులు, బెల్లం దీపం వల్ల సమస్యలు పరిష్కం అవుతాయి.
సంతానం కలగక ఇబ్బంది పడేవారిు కందులు, బెల్లం దీపాన్ని అంగారక సంకష్ట చతుర్థి రోజు వెలిగించడం వల్ల సంతానం కలగడంలో అడ్డంకులు తొలగి పిల్లలు కలిగే యోగం పెరుగుతుంది.
వివాహంలో ఆలస్యం, ఆటంకాలు ఎదురుకావడం వంటి సమస్యలు ఎదుర్కునేవారు అంగారక సంకష్ట చతుర్థి రోజు కందులు, బెల్లం దీపాన్ని వెలిగిస్తే వివాహం జరుగుతుంది.
దీపం వెలిగించిన తర్వాత మరుసటి రోజు.. కందులను, బెల్లాన్ని పారే నీటిలో కలిపేయాలని. లేదంటే.. కందులు నానబెట్టి ఆ కందులు, బెల్లాన్ని ఆవుకు తినిపించాలి.
*రూపశ్రీ.