Read more!

రామాయణంలో విశాల నగర విశ్లేషణ!!

 

రామాయణంలో విశాల నగర విశ్లేషణ!!

పూర్వం కృత (సత్య) యుగంలో కశ్యప ప్రజాపతి ఇద్దరు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు, దైత్యులు ఎంతో సఖ్యతగా, ధార్మికంగా జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీర సాగరాన్ని మధిస్తే అందులోనుండి అమృతం పుడుతుంది, అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు అనుకున్నారు.  ఆ సాగర మధనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొతాన్ని నాశనం చెయ్యసాగింది. అప్పుడా దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్లి ఆయనను రక్షించమని ప్రార్ధించారు. శంకరుడు బయటకి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చినదాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు. కళ్ళు ఎరుపెక్కలేదు. ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్లీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతోపాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడాయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు. అప్పుడు మళ్లీ చిలకడం ప్రారంభించారు.  అందులోంచి నురగలు వచ్చాయి. ఆ నురగల నుండి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్లమంది వచ్చారు.


అలా వచ్చిన అందమైన అప్సరసలని, దేవత రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వారు దేవ వేశ్యలు అయ్యారు. తరువాత అందులో నుండి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు. రాక్షసులు ఆ సురరాసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుణిని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉచ్చైఃశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు. అలానే కౌస్తుభాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించారు. తరువాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు. చివరగా విష్ణువు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు.


కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా పలికింది నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు. వారు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికంతటికి దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు సౌచంగా (భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం) ఒక 1000 సంవత్సరములు ఉండగలిగితే, నీకు ఈ లోకాలని శాసించగల, ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు.


దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చెయ్యడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, నేను నీకు సేవ చేస్తాను అమ్మ అన్నాడు. దితి సరే అనడంతో రోజూ ఫలాలు తీసుకోచ్చేవాడు. రోజు తన తల్లి పాదములు పట్టేవాడు. అలా 990 సంవత్సరములు పూర్తయ్యాయి. ఒకరోజు దితి స్నానం చేసి జుట్టు వదులుగా చేసి కూర్చుని ఉన్నప్పుడు ఆ జుట్టు పాదాలకి తగిలింది. అలా తగలడం చేత ఆమె సౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకద్దు అని అరిచింది. ఆ ఏడుపు దితికి వినబడి, దితి కూడా నరకద్దు అని ప్రార్థించింది. అప్పుడు ఇంద్రుడు బయటకి వచ్చి, నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు. నాయందు సౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు. కాని నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయు స్కంధాలకి అధిదేవతలగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకములోని, ఇంద్రలోకములోని, అంతరిక్షంలోని వాయు స్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి వాయు స్కంధాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ ఏడుగురిని మరుత్తులు అని పిలుస్తారు. దితి 990 సంవత్సరములు తపస్సు చేసిన ప్రదేశమే విశాల నగరం. 


                            ◆ వెంకటేష్ పువ్వాడ.