ఆదిశంకరుల అద్భుత మార్గం!!

 

ఆదిశంకరుల అద్భుత మార్గం!!

ధర్మగాని సంభవించినపుడల్లా నేను అవతరిస్తాను' అని ప్రకటించిన దైవం మరొకసారి ఈ భూలోకంలో ప్రజల మధ్యకు తరలివచ్చాడు. పన్నెండు సంవత్సరాలకే  గ్రంథరచన పరిసమాప్తి చేసినట్లు పేరుపొందిన ఆ అద్భుత బ్రాహ్మణ బాలకుడు ఎవరో కాదు శ్రీ ఆచార్య శంకరులు.  ఈసారి భగవంతుడు దక్షిణాపథంలో అవతరించాడు.

ఏ కాలంలోనైనా మహోత్తమ తత్త్వవేత్తగా శంకరులను స్తుతించుకోవచ్చు. తన కాలంలో అత్యుత్తమ హైందవుడడు అయిన శ్రీ శంకరులు, భారత దేశపు పశ్చిమ తీరాన కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో క్రీ.శ. 788 న జన్మించాడని విద్వాంసులు అభిప్రాయం. ఆయన శైవకుటుంబంలో జన్మించాడనీ శాక్తవంశంలో పుట్టాడనీ అభిప్రాయభేదాలు ఉన్నాయి. శ్రీ శంకరుల జీవితం అడుగడుగునా ఆధ్యాత్మిక ప్రతిభతో ఉంటుంది. అయితే ఆయన ప్రతిభలోనూ, ఆయన అభిప్రాయాలలోనూ తార్కికత ఎంతో గొప్పగా ఉంటుంది. కేవలం మూడంగా వాదించకుండా ప్రతి విషయంలో తర్కం నిండి సూక్ష్మతతో, తాత్త్విక గాంభీర్యంతో మిరుమిట్లు గొలుపుతుంది.

మానవుల ఆధ్యాత్మిక ప్రగతి పథాన ధ్రువ తారయై నిలిచిన ఈ బాలఋషి శతాబ్దాల తరబడి శాంతికి, ఆనందానికి మార్గ దర్శకుడైనాడు.  పరమపదానికి చేర్చే ఈ కఠోరమార్గాన ప్రతి బాటసారీ లోలోపల ఇలా ఆలోచిస్తాడు. "పరమాత్మ సత్యతమ దర్శనం బహుశా ఇక్కడే కలిగి ఉంటుంది" అని. 

శంకరుల వారు చిన్న వయసులోనే  వేదాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఆయనలో ఉన్న స్వచ్ఛమైన ఆలోచనా మార్గం, లోతైన పరిశీలనా దృష్టి, అన్ని కోణాల నుండి విషయాన్ని అర్థం చేసుకునే విలక్షణ గుణం అన్నిటినీ కలుపుకుని సాహిత్యం మొత్తాన్ని అధ్యయనం చేసి, సాటిలేని తన ప్రతిభతో ఎంతో గొప్ప నిర్వచనాలను, సహేతుకమైన వివరణలను, సమగ్రమైన తత్వశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు.  సంసారమనే చట్రంలో చిక్కుకుంటే ఆత్మసాక్షాత్కారం, మోక్షం సాధ్యం కాదని గ్రహించి తన చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి తన జీవితం మొత్తాన్ని భగవంతుడి సాక్షాత్కారం కోసం, భారతదేశంలో ఎంతో గొప్పదైన పవిత్రతను పునఃప్రతిష్టించడానికి అంకితం చేశాడు.

అంత్యకాలంలో తప్పకుండా నీ దగ్గరకు వస్తానని   తల్లిని ఊరడించి మమకారరహితుడైన శంకరుడు సన్యాసలో రహాసస్య విషయాలను  తనకు బోధించి పరమపదానికి దారి చూపగల గురువును అన్వేషిస్తూ బయలుదేరాడు. నర్మదానదీ తీరాన ఓంకారనాథ పుణ్యతీర్థాన ఉన్న గోవింద భగవత్సాదులు తన గురువని తెలుసుకుని నిజాన్ని అన్ని విధాలా తెలుసుకుంటూ  ప్రజ్ఞానిధియై  గురుసాన్నిధ్యంలోనే నివసించాడు. 

ఈయన  ఏకదేవ వాదాలకూ ద్వైతసిద్ధాంతాలకూ కూడలి స్థానంగా అద్వైత వేదాంతాన్ని ప్రతిష్ఠింపమన్న గురువు ఆజ్ఞను అనుసరించి ఆ ఓనిని తన భుజస్కంధాలపై ఎత్తుకుని  ప్రతిభ మరియు తార్కిక దృష్టి కలిగిన ఈ యువకుడు వేదసంస్కృతికీ మతానికీ పుట్టినిల్లయిన వారణాసి చేరి వైవిధ్యంలో ఏకత్వ సందేశాన్ని ప్రచారం చేయసాగాడు. వివిధ సంప్రదాయాలకు పెద్దగా వ్యవహరిస్తున్న  విద్వాంసులతో హేతుబద్ధంగా చర్చలు, తర్కమైన విశ్లేషణలు  చేసి వారి సిద్ధాంతాలలో ఉన్న లోపాలను, దోషాలను  నిరూపిస్తూ తన సిద్ధాంతాన్ని సర్వోత్కృష్టంగా ప్రతిష్ఠించాడు. ఇక్కడే శ్రీ శంకరుల శిష్య చతుష్టయంలో మొదటి వాడు అయిన కాలక్రమాన పద్మపాదుడని పేరు తెచ్చుకున్న సనందనుడు శంకరుడి పాదాలను ఆశ్రయించి శిష్యుడిగా మారిపోయాడు.

వారణాసి నుండి అద్వైత తత్త్వాన్ని బోధిస్తూ  ఆధ్యాత్మికతను విశిష్టంగా అందరికీ తెలియజేస్తున్న శంకరులు శిష్యులతో కలసి  బదరికాశ్రమానికి, మార్గమధ్యాన ప్రయాగ, హరిద్వారం, హృషీకేశం, శ్రీనగరం, రుద్రప్రయాగ, నందప్రయాగ, కామరూప, గోముఖీ పుణ్యతీర్థాలను దర్శిస్తూ వివిధ దేవతలను దర్శించుకుంటూ, పూజిస్తూ నిర్గుణ ఆరాధకుడిని అయినా దేవుళ్లను పూజించడం పట్ల, ఇతర దేవుళ్ళ విషయంలో భక్తిరహితుడు కాదని నిరూపించాడు. ఇది శంకరుల నుండి అందరూ నేర్చుకోవలసిన గొప్ప విషయం.

◆ వెంకటేష్ పువ్వాడ