లాభాల్లో అడుగుపెట్టిన 'ప్రతిరోజూ పండగే'
on Dec 27, 2019
సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి డైరెక్ట్ చేసిన 'ప్రతిరోజూ పండగే' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. తొలివారంలోనే ఆ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిందని ట్రేడ్ విశ్లేషకులు తెలియజేశారు. డిసెంబర్ 20న రిలీజైన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి వారంలోనే రూ. 17.25 కోట్ల షేర్ రాబట్టిందనీ, ప్రపంచవ్యాప్తంగా దాని వసూళ్లు సుమారు రూ. 20 కోట్లనీ వారు చెబుతున్నారు. దీంతో రెండో వారం ఆరంభం నుంచే బయ్యర్లు లాభాలు చూడనున్నారు. వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, వాళ్ల మానాన వాళ్లను వదిలేస్తూ మానవ సంబంధాలను మర్చిపోతున్నామనే ఇతివృత్తంతో, తాతామనవళ్ల అనుబంధాన్ని హైలైట్ చేస్తూ మారుతి ఈ చిత్రాన్ని రూపొందించాడు. అల్లు అరవింద్ ప్రెజెంట్ చేసిన ఈ మూవీలో సత్యరాజ్, సాయితేజ్ తాతామనవళ్లుగా చేసిన నటన అందరి మనసుల్నీ చూరగొంటోంది. అలాగే సాయితేజ్ తండ్రిగా రావు రమేశ్ ప్రదర్శించిన అభినయం అలరిస్తోంది.
క్రిస్మస్ పండుగ రోజును 'ప్రతిరోజూ పండగే' బాగా సొమ్ము చేసుకుంది. నైజాంలో తొలి వారం రూ. 7.4 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఆంధ్రా ఏరియాలో రూ. 7.85 కోట్లనూ, రాయలసీమలో రూ. 2 కోట్లనూ రాబట్టింది. ఇదివరకు వరుసగా ఆరు ఫ్లాపులతో కెరీర్లో క్లిష్ట స్థితిని ఎదుర్కొన్న సాయితేజ్కు ఇది వరుసగా రెండో హిట్. కిశోర్ తిరుమల డైరెక్షన్లో అతను చేసిన మునుపటి మూవీ 'చిత్రలహరి' సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు 'ప్రతిరోజూ పండగే' మూవీ తొలివారంలోనే రూ. 20 కోట్ల మార్కును అందుకోవడంతో సాయితేజ్ కెరీర్కు బూస్ట్ వచ్చినట్లయింది.