ట్విట్టర్లో రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
on Jun 8, 2015
'బద్రి', 'జానీ' చిత్రాల హీరోయిన్గా కంటే.. పవన్ కళ్యాణ్ బెటర్ హాఫ్ గానే రేణు దేశాయ్ తెలుగువారికి సుపరిచితం. పవన్తో రెండు సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రేణు.. పవన్తో సహజీవనం చేసినా, వివాహం చేసుకున్నా, విడిపోయినా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. పవన్ నుంచి విడిపోయాకా.. ట్విట్టర్ రూపంలో రేణు మీడియా వారికి దగ్గరైంది. దాంతో ఆమె చేస్తున్న ప్రతి పోస్ట్పై స్పెషల్ ఫోకస్ పడుతోంది. అలా ఫోకస్ అయిన లేటెస్ట్ పోస్ట్ ఏమిటంటే.. సెకండ్ మ్యారేజ్ గురించి ఆమె చెప్పుకొచ్చిన మాటలు. 'పెళ్లి అనేది జీవితంలో ఒకసారే జరగాలి. ఇది అనాదిగా భారతీయ సంస్కృతిలో ఉన్న వ్యవహారం. అయితే ఈ మధ్య కాలంలో విలువలు మారడంతో.. విడాకులు తీసుకుని మరో పెళ్లికి సిద్ధపడడం మాములైపోతోంది. పిల్లలున్న మగాడు మరో పెళ్లి చేసుకోవడం పెద్ద సమస్య కాదు కానీ.. అదే ఆడదాని విషయంలో మాత్రం అది సులభమైన విషయం కాదు. అంతే కాదు.. ఒక స్త్రీ ఎప్పుడు తల్లి అవుతుందో అప్పుడే ఆమెలోని మిగిలిన ఎమోషన్స్ అన్నీ చచ్చిపోతాయి' అని ఆమె రాసుకొచ్చింది. కొద్ది రోజుల క్రితమే 'నాకు పుట్టిన పిల్లలు పవన్ కళ్యాణ్ పిల్లలుగా కంటే నా పిల్లలుగానే సమాజంలో ఎదిగేందుకు ఇష్టపడతాను' అనే తరహాలో ట్విట్టర్లో తెలిపింది రేణు. ఆత్మాభిమానం ఉన్న స్త్రీశక్తికి రేణు దేశాయ్ నిలువుటద్దంలా ఉందంటున్నారు ఈ వ్యాఖ్యల్లో భావాన్ని అర్థం చేసుకున్న వారంతా.