చిరు పిటిషన్.. జీహెచ్ఎంసీకి హైకోర్టు అక్షింతలు!

మెగాస్టార్ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి అక్షింతలు వేసింది. ఇంతకీ చిరంజీవి ఎందుకు హైకోర్టుకెక్కారు.. హైకోర్టు జీహెచ్ఎంసీకి అక్షింతలు వేసింది అన్న వివరాలలోకి వెడితే.. చిరంజీవి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రెన్నోవేషన్ పనులు చేపట్టారు. అందులో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు.  ఇంటి పునరుద్ధరణలో భాగంగా తాను చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చిరంజీవి జిహెచ్ఎంసి కి దరఖాస్తు చేసుకున్నారు.  గత నెల 5న చిరంజీవి జీహెచ్ఎంసీకి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకుంటే.. దానినై జీహెచ్ఎంసీనుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో చిరంజీవి  జిహెచ్ఎంసి తీరుపై కోర్టుకెక్కారు.  చిరు తరఫున వాదించిన న్యాయవాదు.. చిరంజీవి ఇంటికి సంబంధించి 2002లోనే జిప్లస్2 నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామనీ, ఇప్పుడు పునరుద్ధరణ పనులు మాత్రమే చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలంచి క్రమబద్ధికరించాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.  దీనిపై జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది.. చిరంజీవి దరఖాస్తు అందిందనీ,  చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని  కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జిహెచ్ఎంసి కి పిటిషనర్ దరఖాస్తు పైన చట్ట ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.  ఈ సందర్భంగా జీహెచ్ఎంసీపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమ‌తులు ఇచ్చేందుకు ఎంత గ‌డువు కావాల‌ని ప్ర‌శ్నించింది. అక్ర‌మ నిర్మాణాల‌కు అధికారులు వత్తాసు ప‌లుకుతున్నార‌న్న ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్న కోర్టు.. స‌క్ర‌మ నిర్మాణాల‌కు  అనుమ‌తులు ఇవ్వ‌లేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
Publish Date: Jul 16, 2025 12:28PM

ఫైబర్ నెట్ సమూల ప్రక్షాళనపై బాబు దృష్టి.. జీవీరెడ్డే రైట్!

జగన్ హయాంలో  ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లొ  పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో ఫైబర్ నెట్ లో  నియమించి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఫైబర్ నెట్ ను వైసీపీ కార్యకర్తలు, నాయకులకు రాజకీయ ఆశ్రయ కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫైబర్ నెట్ ద్వారా జగన్ సొంత మీడియా ఉద్యోగులకు సైతం వేతనాలు వెళ్లాయన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా సైబర్ నెట్ ను అడ్డు పెట్టుకుని రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయలు గండి కొట్టారని అప్పట్లో తెలుగుదేశం, జనసేనలు ఆరోపించాయి. సరే ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అద్భుత విజయం సాధించి అధికార పగ్గాలు చేసట్టింది.  కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సైబర్ నెట్ ప్రక్షాళనే ధ్యేయంగా చంద్రబాబు తెలుగుదేశం అధికార ప్రతినిథి జీవీ రెడ్డిని చైర్మన్ గా నియమించారు. విద్యావంతుడు, న్యాయవాది అయిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్ కమిషనర్ గా బాధ్యతలు చేపడుతూనే ప్రక్షాళక చర్యలకు ఉపక్రమించారు.  అయితే.. ఫైబర్ నెట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి జీవీరెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరించడంతో  జీవీరెడ్డి నేరుగా సీఎం చంద్రబాబుకు విషయాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం ఒకింత సంయమనంతో వ్యవహరించాలని సూచించడంతో సహనం కోల్పోయిన తన పదవికి రాజీనామా చేసి వైదొలిగారు. తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేసి రాజకీయాల నుంచే వైదొలిగారు.   అయితే ఇటీవల సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ పై నిర్వహించిన సమీక్షలో నాడు జీవీరెడ్డి చెప్పిన విషయాలన్నీ అక్షరసత్యాలన్న విషయం వెలుగులోకి వచ్చింది.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ కేవలం  130 మంది సిబ్బందితో  చాలా ఎఫెక్టివ్ గా పని చేసింది. అదే వైసీపీ హయాంలో ఉద్యోగుల సంఖ్య పది రెట్లకు పైగా పెరిగింది.  ఈ పెరిగిన నియామకాల్లో అత్యధికులు వైసీపీ విధేయులే ఉన్నారన్న విషయం కూడా చంద్రబాబు సమీక్షలో వెలుగు చూసింది.  అంత భారీగా సిబ్బంది పెరిగినా వైసీపీ హయాంలో ఫైబర్ నేట్ సాధించింది శూన్యం. పైగా ఆ శాఖ పని తీరు తిరోగమనం దిశగా సాగింది. అంతకు ముందు వైసీపీ హయాంలో  ఫైబర్ నెట్ యాక్టివ్ కనెక్షన్ల సంఖ్య ఎనిమిది లక్షలు ఉంటే.. జగన్ హయాంలో ఇది నాలుగు లక్షలకు అంటే సగానికి పడిపోయింది.   వాస్తవానికి జీవీరెడ్డి  ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న స్వల్పకాలంలో గుర్తించి సరి చేయడానికి ప్రయ త్నించిన విషయం కూడా ఇదే. ఆయన అదనపు సిబ్బందిని, కార్యాలయానికి రాకుండా పేస్కేళ్లలో ఉన్న వారిని తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. ఫలితం లేకపోయింది. ఇప్పడు ఇదే విషయం చంద్రబాబు సమీక్షలో వెలుగు చూసింది. దీంతో ఆయన ఇప్పుడు ఫైబర్ నెట్ ప్రక్షాళనకు సీరియస్ గా నడుంబిగించారని తెలుస్తోంది. ఫైబర్ నెట్ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  
Publish Date: Jul 16, 2025 11:40AM

మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను మంగళవారం (జులై 15) హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని కోర్టు పేర్కొంది. దీంతో ఆయనకు అరెస్టు నుంచి ఎటువంటి రక్షణా లేకుండా పోయింది. ఇప్పటికే సుప్రీం కోర్టు బెయిలు విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా ఈ లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే మిథున్ రెడ్డి కదలికలపై కూడా సిట్ నిఘా పెట్టింది.  దీంతో మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకావాలున్నాయని అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే  రాజ్ కేసిరెడ్డి, మాజీ సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, మాజీ ఓఎస్డీగా కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులను సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరంతా ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.  
Publish Date: Jul 16, 2025 10:58AM

నరేంద్ర మోదీ వారసుడు గడ్కరీ!

రాష్ట్రీయ సయం సేవక్ సంఘ్  అధినేత మోహన్ భగవత్..  ఇంచుమించుగా వారం రోజుల కిందట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూలై 9న  ప్రధానమంత్రి  రిటైర్మెంట్  గురించి, సూచన ప్రాయంగా చేసిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది. నిజానికి..  ఆర్ఎస్ఎస్ అధినేత, ప్రదాని మోదీని ఉద్దేశించే  రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారా, లేక అన్యాపదేశంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా అనే విషయంలో స్పష్టత లేకపోయినా  మోహన్ భగవత్ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.   ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు  భగవత్  వ్యాఖ్యలను మోదీని విమర్శించేందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అయితే..  పార్టీ  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం ,రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అనేది ఉండదని, ఉండరాదని అంటున్నారు. కాగా..  తాజాగా, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ ఇంకో ముందడుగు వేశారు. నరేంద్ర మోడీ 75 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిగా చేయాలని   ప్రతిపాదించారు.   దేశానికి తదుపరి ప్రధానమంత్రి గడ్కరీ కావాలి.. ఎందుకంటే గడ్కరీ సామాన్యులకు అండగా ఉన్నారు. రహదారులు మౌలిక సదుపాయాల పరంగా దేశాభివృద్ధికి గడ్కరీ గట్టి పునాదులు వేశారు అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. అలాగే, ధనిక, పేదల మధ్య పెరుగుతున్న అంతరం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గడ్కరీ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటే..  ఆయనకు దేశాభివృద్ధికి సంబంధించి ఒక భావన ఉందని, అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిని  చేయాలని అన్నారు. 75 ఏళ్లు నిండిన వారు రాజీనామా చేయాల్సి ఉంటుందని మోహన్ భగవత్ సూచించారు.  కాబట్టి గడ్కరీకి సమయం ఆసన్నమైందని తానూ  భావిస్తున్నట్లు గోపాల  అన్నారు. అంతే కాదు..  ఆయన ఇక్కడ కర్ణాటక మాజే ముఖ్యమంత్రి యెడియూరప్పను, 75 సంవత్సరాలు నిండగానే  రాజీనా చేయించిన విషయాన్ని గుర్తు చేసారు. ఆయనకో రూలు మోడీకి ఓ రూలు ఏమిటని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Publish Date: Jul 16, 2025 7:58AM

మహిళా లోకానికి ఆదర్శం డ్రైవర్ సంద్యా రాణి!

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్..  అన్నారు  చిలకమర్తి వారు.  ప్రసన్నయాదవం  పద్యకావ్యంలో... నాలుగు పాదాల చంపకమాల పద్యంలో ఇది నాలుగో పాదం. తెలుగు భాషఫై కొద్దిపాటి మక్కువ, కొంచెంగా ప్రవేశం ఉన్న ఎవరికైనా ఈ పద్య పాదం తరచూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా..  డ్రైవర్   సంధ్యారాణి వంటి వారి కథలు విన్నపుడు చిలకమర్తి వారి పద్యం  చటుక్కున వచ్చి నాలుక పై వాలుతుంది. కొద్దిగా ప్రేమగా నేర్పిస్తే ఆడ లేడీస్ అన్ని విద్యలు ఇట్టే  నేర్చుకుంటారని, ఈ పద్య పాదం అర్థం. సరే. ఆ విషయాన్ని అలా ఉంచి అసలు విషయంలోకి వస్తే..  ఒరిస్సా ప్రభుత్వం తొలిసారిగా  ఒక మహిళను ప్రభుత్వ వాహన డ్రైవర్ గా నియమించింది. ఈ వార్త ఒరిస్సాలోనే కాదు, దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   నిజానికి  కారు డ్రైవింగ్ అన్నది  ముదితలకు రాని విద్య కాదు.  మహిళలు నేర్వని విద్యా కాదు.  హైదరాబాద్ వంటి మహానగారాల్లో వందల మంది.. కాదు  వేల మంది మహిళలు, కార్లు నడుపుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ లో పురుషులను దాటి దూసుకు పోతున్నారు. సొంత కార్లే కాదు.. క్యాబులూ నడుపుతున్నారు. నిజానికి.. మహిళలు సొంత కార్లు క్యాబులు కాదు, ఏకంగా యుద్ధ విమానాలనే నడుపుతున్నారు. పహల్గావ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మన వైమానిక దళం పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను, నేలమట్టం చేసిన ఆపరేషన్ లో  విమెన్ పైలెట్స్  చేసి చూపిన సాహస విజయం ప్రపంచాన్నే విస్మయ పరిచింది.  ఇలా భారతీ మహిళలు అన్నిరంగాలలోకి చొచ్చుకు పోతున్నపుడు, ఒక మహిళ ప్రభుత్వ కారు డ్రైవర్  కొలువు పొందడంలో విశేషం ఏముందని అనిపించవచ్చును. కానీ  ఉంది... ఎందుకంటే, ఒరిస్సా ప్రభుత్వంలో ప్రప్రధమ డ్రైవర్  సంధ్యారాణి. అంతే కాదు ఆమెకు ఇది వరకూ ప్రైవేట్ స్కూల్ బస్ వంటి భారీ వాహనాలను నడిపిన అనుభవం కూడా ఉంది.  అదొకటి  అయితే, సంధ్యారాణికి మొదటి నుంచి డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. విద్యార్థిగా ఉన్నరోజుల్లోనే బైక్ నడపడం నేర్చుకున్నారు. వివాహం తర్వాత కారు కూడా నేర్చుకోవాలని తన భర్తకు తెలిపారు. అలా మెల్లిగా కారును డ్రైవ్ చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత సంధ్యారాణి భర్త నానో కారు ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆమె, తన స్నేహితులను రాష్ట్రంలోని వివిధ టూరిస్ట్ ప్రాంతాలకు కారులో తీసుకెళ్లేవారు. అలా డ్రైవింగ్ అనుభవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. తర్వాత ఆమెకు పెద్ద వాహనాలు నడపాలని కోరిక కలిగింది. భర్త, బంధువుల సహకారంతో రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో కటక్ ఛాటియాలోని హెవీ మోటార్ వెహికిల్ శిక్షణ కేంద్రంలో డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ పొందారు. శిక్షణ అనంతరం 2023లో విదేశాలలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు. ఆ తర్వాత వివిధ ప్రైవేటు స్కూల్ బస్సులు నడిపారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో డ్రైవర్ పోస్ట్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దాని గురించి తెలుసుకున్న సంధ్యారాణి దరఖాస్తు చేసుకున్నారు. 2025 జూన్ లో ఒడిశా వాణిజ్యం, రవాణా, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి ఉషా పాధీకి అధికారిక డ్రైవర్‌గా సంధ్యారాణి నియమితులయ్యారు.  ఒక విధంగా ఇది మహిళా సాధికారిత దిశగా మరో ముందడుగు అని చెప్పాలి. నిజానికి చిన్ననాటి చిరు కోరికను  స్వయం కృషితో వృత్తిగా మలచుకున్న సంధ్యారాణి మహిళలకే కాదు.. అందరికీ ఆదర్శమే. అలాగే  ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అన్నట్లుగా.. ఆమె నియామకం మహిళా సాధికారత, సాంప్రదాయేతర వృత్తులలో చేర్చడం వైపు బలమైన అడుగు. అలాగే..  ఇది ఆరంభం మాత్రమే .. ముందు ముందు ప్రతి  సంవత్సరం 500మంది మహిళలకు డ్రైవింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఒరిస్సా ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఆమె వేసిన ముందడుగు..  మహిళా లోకానికి మరో ఉపాధి మార్గాన్ని చూపింది. అందుకే  డ్రైవర్ రాణి .. సంద్యారాణి  మహిళా లోకానికి ఒక ఆదర్శం.
Publish Date: Jul 16, 2025 7:47AM

మాజీ ప్రధాని పీవీపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 'లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ' అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించిన చంద్రబాబు . అనేక పార్టీలను ఒప్పించి పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారన్నారు. దేశంలో లైసెన్స్‌ రాజ్‌ విధానానికి స్వస్తి చెప్పారని, పెట్టుబడిదారులు సులభంగా వచ్చేలా చర్యలు తీసుకుని దేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేసిన సంస్కరణలకు ఆద్యుడు పీవీ అని కొనియాడారు. పీవీ తీసుకున్న చర్యల వల్లే ఐటీ విప్లవం వచ్చిందన్న ఆయన.. . పీవీ తెచ్చిన సంస్కరణలను వాజ్‌పేయీ కొనసాగించారని గుర్తు చేశారు. వాజ్‌పేయీ హయాంలో హైవేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు వచ్చాయన్న చంద్రబాబు.. 2014లో మోడీ కూడా అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. మోదీ హయాంలో భారత్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని, సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌పేరుతో ముందుకెళ్తున్నాం.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచామన్నారు.  మంగళవారు (జులై 15) ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. పలు వురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్‌తో పాటు.. ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించబోతున్నారు. వీటితోపాటు, ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Publish Date: Jul 16, 2025 7:34AM

టెస్ట్ చరిత్రలో విండీస్ చెత్త రికార్డు.. 27 పరుగులకే ఆలౌట్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో విండీస్ రెండో అత్యల్ప స్కోరు చేస్తే... ఆస్ట్రేలియా టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌ను కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది టెస్ట్‌ల్లో రెండో అత్యల్ప స్కోరు. జమైకాలోని కింగ్‌స్టన్‌ వేదికగా మూడో టెస్ట్‌ లో 175 పరుగులతో కంగారూ జట్టు విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్‌ స్వీప్ చేసింది.  కెరీర్‌లో వందో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. స్టార్క్ 6 వికెట్లు తీయగా.. బొలాండ్ 3 (హ్యాట్రిక్), హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశారు. ఆసీస్ బౌలర్ల  దెబ్బకు ఏకంగా ఏడుగురు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. గ్రేవిస్ అత్యధికంగా 11 పరుగులు చేయగా.. మైకేల్ లూయిస్, అల్జారీ జోసఫ్ తలో 4 పరుగులు చేశారు.  స్పార్క్ తన మొదటి ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. మొత్తం  15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ఆ క్రమంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 5 వికెట్టు సాధించిన బౌలర్‌గా స్టార్క్ రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలను 121 పరుగులకు ఆలౌట్ చేసి సంబరపడిన విండీస్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. విండీస్ బ్యాటర్లలో ఏడుగురు డకౌట్ అయ్యారు. టెస్ట్ చరిత్రలో 1955లో ఇంగ్లాండ్‌పై 26 పరుగులకే అలౌట్ అయిన న్యూజిలాండ్ అత్యల్ప స్కోర్లలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. మళ్లీ ఇంత కాలానికి విండీస్ ఆ చెత్త రికార్డుకు చేరువై రెండో అతి చెత్త ఇన్నింగ్ ఆడింది. మన భారత్ 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకు ఆలౌట్ అయి ఆ చెత్త రికార్డుల్లో 8వ స్థానంలో ఉంది.
Publish Date: Jul 16, 2025 7:16AM

1900 తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు

లాస్‌ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా చోటు దక్కింది. చివరిసారిగా 1900 ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఆడారు. ఈ క్రీడా సంరంభంలో భాగంగా 2028 జులై 12 నుంచి క్రికెట్ మ్యాచులు మొదలు అవుతాయి. గ్రూప్ దశలో ప్రతి టీమ్ రెండు టీ20 మ్యాచులు ఆడనుంది. జులై 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచులను ఏర్పాటు చేశారు. జులై 14, 21 తేదీల్లో మాత్రం క్రీడాకారులకు విశ్రాంతిని ఇచ్చేందుకు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించరు. రోజుకు రెండు గ్రూప్ దశ మ్యాచులు జరిగేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.00 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 6.30 గంటలకు రెండో మ్యాచ్ నిర్వహిస్తారు. కాలిఫోర్నియాలోని పోమోనా నగరంలోగల ఫెయిర్‌గ్రౌండ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి . అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు టీమ్స్ చొప్పున తలపడనున్నాయి. ఒక్కో జట్టు కోసం 15 మంది సభ్యుల స్క్వాడ్‌ను ఎంపిక చేస్తారు. క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ దృష్ట్యా నిర్వాహకులు ఈ క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చారు. అమెరికాలో కూడా క్రికెట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అప్పట్లో మూడు వేదికల్లో మ్యాచులను నిర్వహించారు. ఇక 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్ బాల్, బేస్‌బాల్, లక్రాస్‌, స్క్వాష్ క్రీడలకు చోటు దక్కింది.  ప్యారిస్ వేదికగా 1900లో జరిగిన ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్ మ్యాచులు జరిగాయి. అప్పట్లో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్‌లు మాత్రమే తలపడగా యూకేను విజయం వరించింది. టెస్ట్, వన్డేల్లాంటి దీర్ఘ ఫార్మాట్‌ల నిర్వహణకు తగినంత సమయం లేకపోవడమే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ స్థానం కోల్పోవడానికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతారు. స్టేడియంలు, ఇతర మౌలిక వసతుల లేమి కూడా ఈ పరిస్థితికి కారణం. ఇక క్రికెట్ కేవలం దక్షిణాసియా దేశాలకే పరిమితమైన క్రీడ అన్న భావన కూడా ప్రతిబంధకంగా మారింది. ఒలింపిక్స్ కమిటీలో క్రికెట్ ఆడే దేశాలకు మొదట్లో ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం కూడా ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒలింపిక్స్‌లో నిత్యం సత్తా చాటే అమెరికా, చైనా ల్లాంటి దేశాల్లో క్రికెట్‌కు ఆదరణ తక్కువే. అయితే, టీ20 ఫార్మాట్ రాకతో పరిస్థితి మారింది.  ఈ నేపథ్యంలో 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా చోటు కల్పిస్తూ ఒలింపిక్స్ కమిటీ ముంబైలో జరిగిన 141వ సమావేశాల్లో నిర్ణయించింది.
Publish Date: Jul 16, 2025 7:07AM

కేరళ నర్స్ ప్రియకు ఉరి నుంచి ఊరట!

ఆశలన్నీ ఆవిరై పోయిన సందర్భంలో.. కేరళ నర్స్‌ నిమిష ప్రియకు ఊరట లభిచింది. మరో కొన్ని గంటల్లో ఉరి కంబం ఎక్కవలసిన ఆమెకు, యెమెన్‌ ప్రభుత్వం ఉరి శిక్షను వాయిదా వేసి, మరో ఆశకు ప్రాణం పోసింది.  నిజానికి మరి కొద్ది గంటల్లో అంటే బుధవారం (జులై 16) అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను యెమెన్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఆమె మరణశిక్షను తప్పించడానికి యెమెన్‌ జైలు అధికారులతోపాటు ప్రాసిక్యూషన్‌ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.  ఈ కేసులో బాధితురాలికి సాయం చేసేందుకు భారత్ ప్రభుత్వం మొదటి నుంచి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిమిష, బాధిత కుటుంబాల మధ్య పరస్పర అంగీకారం వచ్చేలా చేసి  కేసును పరిష్కరించుకునేలా మరింత సమయం ఇవ్వాలని కోరాం. ఈ విషయంలో స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్‌ ఆఫీసుతో నిరంతరం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్‌ అధికారులు అంగీకారం తెలిపారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ సంప్రదింపులు జరపుతున్నారు. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బాధిత కుటుంబానికి ఒక మిలియన్‌ డాలర్ల అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.6కోట్ల  క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్దంగా ఉంది. ఇందుకు బాధిత కుటుంబం అంగీకరిస్తే నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.   అసలింతకీ ఏమిటీ కేసు అంటే.. కేరళ పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్‌ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో థామస్‌ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్‌ తెరవాలనుకొన్నారు.ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్‌ అదిబ్‌ మెహది అనే వ్యక్తిని నిమిష, థామస్‌ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వారు అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిష యెమెన్‌లోనే ఉంటూ సెంటర్‌ను కొనసాగించారు. ఈ సమయంలో మెహది- నిమిష ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్‌పోర్టు లాక్కొన్నాడు. అతడిపై 2016లో ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోయేసరికి, 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది. మోతాదు ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్‌ ట్యాంక్‌లో పడేసింది. అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో 2020లో ఆమె ఉరిశిక్ష విధించగా, 2023లో చివరి అప్పీల్‌ను యెమెన్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం నిమిష ప్రియ యెమెన్‌ రాజధానిలోని సనా జైలులో ఉంది.
Publish Date: Jul 16, 2025 6:46AM

మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. సమరానికి సిద్దమవుతున్న పార్టీలు

తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్‌ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తుండటంతో ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిచాలని భావిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలుస్తుండగా, రేపో.. మాపో ఆర్డినెన్స్‌ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇప్పటికే ఎన్నికలను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వగా.. ఆలోపే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతానికి పంచాయతీలకంటే ముందు పరిషత్‌ ఎన్నికలే నిర్వహిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఓటర్‌ జాబితా సిద్ధం కాగా.. కావాల్సిన బ్యాలెట్‌ బాక్సులు, సామగ్రి, ప్రింటింగ్‌ కూడా అధికారులు పూర్తిచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. మెజారిటీ స్థానాలను ఆ పార్టీనే దక్కించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి సింహభాగం స్థానాలు దక్కాయి. వేరే పార్టీల్లో గెలిచిన వారు సైతం అప్పట్లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికీ..  ఇంకా బీఆర్‌ఎస్‌లో తాజా మాజీ ప్రజాప్రతినిధుల శాతం అధికంగానే ఉంది. గ్రామాల్లో ఇంకా ఆ పార్టీ కేడర్‌ బలంగా ఉండగా, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ను బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలతో పోటీ హోరాహోరీగా ఉండనుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామనే అంశంతో కాంగ్రెస్‌ ముందుకు వెళ్లనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఇటీవలి కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎక్కువ సంఖ్యలో నిర్మించడం, సన్న బియ్యం పథకం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే బీఆర్‌ఎస్‌ తమకున్న కేడర్‌, గతంలో చేసిన పనులు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తరచూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే పక్షంలో తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గేట్‌వేగా ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం అనుకుంటోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుని.. సరైన అభ్యర్థులను నిలిపితే ఫలితం ఉంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పంచాయతీలను పార్టీ గుర్తుపై కాకుండా ఇతర గుర్తులపై గెలుచుకోవాల్సి ఉంటుంది. పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ ముందుగా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించి, ప్రభుత్వ పని తీరుకు గెలుపు అని చెప్పాలని భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తుండగా.. గతంలో రిజర్వేషన్లు తక్కువగా ఉన్న సమయంలోనూ బీసీలు జనరల్‌ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఒకవేళ బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వలేని పక్షంలో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ గతంలో భావించింది. దానిపై కొంత విమర్శలు రావడంతో ఎలాగైనా చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కేబినెట్‌ తీర్మానం చేసింది. దాంతో ఆశావహులు అప్పుడే పల్లెల్లో ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు. మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో అధికార పక్షం విపక్షాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
Publish Date: Jul 15, 2025 6:05PM

ఏపీ మద్యం స్కాం.. ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్టు?!

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని పేర్కొంటూ కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు   సుప్రీంను ఆశ్రయించారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంటూ.. అప్పటి వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు  ఏపీ హైకోర్టు మిథున్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ మంగళవారం (జులై 15) తీర్పు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ లేకుండా పోయింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   మద్యం కుభకోణంలో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారు.ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అరెస్టయ్యారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. అయితే మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సుప్రీం తిరస్కరించడంతో ఆయన ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 
Publish Date: Jul 15, 2025 4:18PM

గండికోటలో మైనర్ విద్యార్థిని దారుణ హత్య

వైయస్సార్ కడప జిల్లాలో  ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది.ఇక్కడ ఇంటర్ విద్యార్థిని   దారుణ హత్యకు గురైంది. హత్య గురైన బాలిక మృతదేహం ముళ్ళపొదల్లో నగ్నంగా పడి ఉండడం  చూస్తే హంతకుడు హత్యాచారానికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి.అందిన సమాచారం మేరకు  బాలిక ప్రొద్దుటూరులోని  గీతం జూనియర్ కాలేజీలో  ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి   ఇంటి నుంచి వెళ్లింది. ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామానికి చెందిన లోకేష్,  అదే గ్రామానికి చెందిన  బాలికను తన ద్విచక్ర వాహనంపై ఉదయం  ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గండికోట కు తీసుకువెళ్లాడు. తరువాత 10:47 గంటల సమయంలో లోకేష్ ఒక్కడే తన ద్విచక్ర వాహనంపై గండికోట నుంచి వెనక్కు వచ్చేసినట్లు  సిసి ఫుటేజీలో రికార్డు అయ్యింది. కాగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో   బాలిక కాలేజీకి రాలేదని  కళాశాల యాజమాన్యం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు . ఉదయం 8 గంటలకే తమ కుమార్తె కాలేజీకి వచ్చిందని  చెప్పిన కుటుంబ సభ్యులు ఆ వెంటనే కాలేజీకి వచ్చి విచారించారు.  లోకేష్ ఆ బాలికను బైక్ పై తీసుకు వెళ్లాడని తెలియగానే వారు గండికోటకే వెళ్లి ఉంటారని భావించిన  కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి , గండికోటకు వెతికేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు వైష్ణవికి సంభంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.సాయంత్రం గండికోట పై భాగంలో మైనర్ విద్యార్థిని కాలేజీ బ్యాగు , చున్ని కనిపించాయి. దీంతో ఆ చుట్టుపక్కల వెతికినా మైనర్ విద్యార్థిని ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అతని ఇచ్చిన సమాచారం మేరకు మైనర్ బాలిక మృతదేహం ఉన్న ప్రాంతాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులు మంగళవారం (జులై 15) ఉదయం గుర్తించారు. మైనర్ విద్యార్థినిని  హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
Publish Date: Jul 15, 2025 3:47PM

సంజయ్ దత్ ఆ పని చేసి ఉంటే ముంబై పేలుళ్లు జరిగి ఉండేవి కావా?

బాలీవుడ్ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్  ముంబై పేళ్లలకు సంబంధించి  మరోసారి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సంజయ్‌దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవారని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా ఓ నేషనల్  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో 1993లో జరిగిన పేలుళ్ల కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా  చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. న్యాయవాదిగా పలు సంచలన కేసులను వాదించిన ఉజ్వల్ నికమ్ ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి, నటుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్ గురించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   1993, మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ వచ్చింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూం సలేం తీసుకొచ్చిన ఆ వ్యాన్‌లో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయి. వాటిని సంజయ్ పరిశీలించారు. వాటిల్లో నుంచి ఒక ఏకే 47 తుపాకీని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నారు. అయితే..అప్పుడే ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగి,  అంత మంది చనిపోయి ఉండేవారు కాదని ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందనే కారణంతో సంజయ్‌పై అప్పట్లో టాడా కేసు నమోదైంది. సంజయ్ ఉగ్రవాది అని ఆరోపణలు వచ్చాయి. కోర్టు మాత్రం సంజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం   రుజువు కావడంతో సంజయ్‌ను దోషిగా నిర్దారిస్తూ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. పుణెలోని యరవాడ జైల్లో శిక్ష అనుభవించిన సంజయ్ 2016లో విడుదల అయ్యాడు. కాగా..  న్యాయవాది ఉజ్వల్ నికమ్ బీజేపీలో చేరి 2024లో ముంబై నార్త్-సెంట్రల్ లోక్‌సభ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయనను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సంజయ్‌దత్‌తో పాటు బీజేపీ అధిష్టానం సైతం ఉజ్వల్ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడినట్లైంది.
Publish Date: Jul 15, 2025 3:27PM

లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డిలో అరెస్టు భయం

తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ సిట్ కు సీబీఐ డైరెక్టర్ నేతృత్వం వహిస్తుండగా, రాష్ట్ర పోలీసు శాఖ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు.  సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది.  తన దర్యాప్తులో కనుగొన్న విషయాలను సిట్ సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదించింది.  లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి సిట్ 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో  బోలెబాబా డెయిరీ, ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. అలాగే సిట్ తన దర్యాప్తులో బాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న సహా పలువురు టీటీడీ ఉద్యోగులను విచారించింది.  ఈ విషయాన్ని కూడా సిట్ సుప్రీంకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఈ కేసులో నిందితులు దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది.   ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కేసులో దర్యాప్తు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడిని తీసుకువస్తోందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. కాగా సుబ్బారెడ్డి బెయిలు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు లిస్ట్ చేయవలసిందిగా.. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ నిలయ్ విపిన్ చంద్రఅంజారియాల ధర్మాసనం కోరింది. అదలా ఉంచితే.. లడ్డూ ప్రసాదం తీయారీలో వినియోగిచిన నెయ్యిలో కల్తీ వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారన్న భయం సుబ్బారెడ్డిలో పెరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Jul 15, 2025 3:07PM