ప్రపంచానికి భారతీయ వరం యోగా దినోత్సవం!

శనివారం  జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన యోగ విద్యను ఈ రోజు ప్రపంచం మొత్తం సొంతం చేసుకుంది. 2014 లో మన దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదే సంవత్సరం డిసెంబర్ 14న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సభ, భారతీయ యోగ విద్యను గుర్తించి, ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహించాలనే చారిత్రక నిర్ణయం తీసుకుంది.
 ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అగ్ర రాజ్యం అమెరికా సహా 177 దేశాలు, యోగ దినోత్సవం తీర్మానాన్ని సమర్ధించాయి. ఆ విధంగా 2015 జూన్ 21 న ప్రప్రథమంగా ప్రపంచ యోగ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ యోగ దినోత్సవం 11వ వార్షికోత్సవం జరుపు కుంటోంది. 

నిజానికి యోగ అనేది  ఒక విద్య, వ్యాయయం మాత్రమే కాదు  భారతీయ జీవన విధానం.  భారతీయ ఋషులు  ప్రకృతి ధర్మాలకు తమ తపఃశక్తిని, మేథో సంపదను జోడించి  ప్రపంచ మానవాళికి అందించిన అపూర్వ కానుక యోగ విద్య. భారతీయ ఋషి పుంగవుల విశాల దృక్పథానికి, వందల వేల సంవత్సరాల కృషికి ప్రతిఫలంగా లభించిన పవిత్ర విద్య, దివ్య ఔషదం యోగ విద్య. ఆ మహోన్నత విద్య మరుగున పడిపోకుండా..ముందుకు తీసుకుపోయే  సంకల్పంతో  ప్రధాని మోడీ మానసిక పుత్రికగా జన్మించి, ప్రపంచ ఆమోదం  పొందిన యోగా దినోత్సవం పదేళ్ళ ప్రయాణంలో ఎన్నోమైలు రాళ్ళను దాటింది. 

అన్నిటినీ మించి, యోగా అంటే కేవలం సనాతన హిందూ ధర్మానికి సంబందించిన  విద్య.. హిందువులు మాత్రమే ఆచరించే మతపరమైన విధి అనే అపప్రద ఈ పదేళ్ళ కాలంలో  చాలా వరకు తొలగి పోయింది. యోగ  ఒక మతానికి పరిమితం కాదు, ఒక ధర్మానికి, దేశానికి, ప్రాంతానికి పరిమితం కాదు. సర్వ మానవాళికి సంబంధించిన  ప్రశాంత ఆరోగ్య జీనన  విధానం యోగ అనే భావనను ఈరోజున ప్రపంచం విశ్వసిస్తోంది. అందుకే..  ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు ఉన్నాయో, అన్ని మతాల వారు, అన్ని ధర్మాల వారు  యోగా  దినోత్సవంలో  ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పాల్గొనడమే కాదు.. యోగ విద్యను  నిత్య జీవితంలో సాధన చేస్తున్నారు.

 ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రాచుర్యం కారణంగా కావచ్చును  ఈరోజున ఆధునిక ఆలోపతి వైద్య శాస్త్రం కూడా.. ముందెన్నడూ లేనంతగా యోగ సాధనను ప్రోత్సహిస్తోంది. అవును  అనేక దీర్ఘ కాలిక వ్యాధులకు, ఔషధాలు, శస్త్ర చికిత్సలతో పాటుగా (కొన్ని కొన్ని సందర్భాలలో ప్రత్యాన్మాయంగానూ కూడా) యోగ సాధనను, డాక్టర్లు  ప్రిస్క్రెబ్  చేస్తున్నారు. ఒక్క వైద్య శాస్త్రంలో మాత్రమే కాదు.. మేనేజిమెంట్ స్టడీస్, ఇతరత్రా క్షేత్రాలలో సైతం యోగ  విద్య, యోగ సాధన అంతర్భాగంగా మారి పోయాయి.నిజానికి, ఈ రోజున సినిమా హీరోలు, హీరోయిన్లు,ఇతర సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు డైలీ వర్కవుట్ లో యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.   అదలా ఉంటే ఈ సంవత్సరం జరుపుకుంటున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ఒకటి కాదు, ఇంకా ఎక్కువే ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సం కూడా  యోగా దినోత్సవాన్ని ఓ చక్కని థీమ్ తో జరుపుకోవడం జరుగుతోంది. అవును..  ప్రధానమంత్రి నరేందమోదీ నెలనెలా ఆకాశవాణి ద్వారా తమ మనసులోని భావాలను పంచుకునే, మన్ కీ బాత్  కార్యక్రమంలో 2025 యోగా దినోత్సవం కోసంగా ప్రటించిన, మకుటం యోగా ఫర్ వన్ ఎర్త్ .. వన్ హెల్త్  థీమ్ గా ఈ సంవత్సరం  యోగా దినోత్సవాన్ని ప్రపంచం జరుపుకుంటోంది. అలాగే ఈ సంవత్సరం మన విశాఖ పట్నంలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి,నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వయంగా పాల్గొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu