ఆ సీఎంకు గాడిదలంటే భయం

గుజరాత్ గాడిదలంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలను ఉద్దేశించే అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై యూపీ సీఎంకు కౌంటర్ ఇచ్చారు ప్రధాని. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.

 

 

ఈ సందర్భంగా కాంగ్రెస్-ఎస్పీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాడిదలంటే అఖిలేష్‌కు భయమెందుకని ప్రశ్నించారు.. అయినా తిడితే నన్ను గాని బీజేపీని గాని తిట్టాలి గాని పాపం గాడిదలు ఏం చేశాయన్నారు. గాడిదలు తమ యజమానులకు విధేయంగా ఉంటాయని..మానవాళికి ప్రేరణనిస్తాయన్నారు. వాటికి తిండి పెట్టకపోయినా..ఎన్ని కష్టాలు పెట్టినా యజమాని చెప్పిన పనిని చెప్పినట్లుగా చేసే మనస్తత్వం గాడిదకు ఉంటుందని స్పష్టం చేశారు.

 

 

జాతిపిత మహాత్మాగాంధీ, పండిట్ దీన్ దయాళ్ వంటి మహనీయులు గుజరాత్‌లోనే జన్మించారన్న సంగతిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని..అది తనతో పాటు ఎస్పీని కూడా ముంచేస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు.