హైదరాబాద్‌లో సమైక్యతా పరుగు

 

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జాతీయ సమైక్యతా పరుగును ప్రారంభించారు. ఐక్యతా రన్‌ పటేల్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగుతుంది. అంతకు ముందు రాజ్ నాథ్ అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతి హైదరాబాద్లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. మోదీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్నాథ్ కోరారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ రాజేంద్ర నగర్‌లోని సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు.