హరికృష్ణను దూరంగా పెడుతున్నారా..!!
posted on Dec 29, 2013 3:36PM
తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ నేత నందమూరి హరికృష్ణ మరోసారి అసంతృప్తిని వ్యక్తపరిచారు. తనకు ప్రజాగర్జనలో పాల్గొనేందుకు ఆహ్వానం పంపలేదంటూ ఆవేదన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. సమైక్యాంధ్ర అన్నందుకే పార్టీ కార్యక్రమాలకు తనను దూరం పెట్టారన్న అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ హరికృష్ణ రాజ్యసభ సభ్వత్వానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి సమైక్యవాదాన్ని హరికృష్ణ బలంగా విన్పిస్తున్నారు.
మరోవైపు ప్రజాగర్జన కోసం తాము ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం పంపలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కేవలం జిల్లా నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపించామన్నారు. మిగతా నాయకులు ఎవరైనా స్వచ్చంధంగా పాల్గొనవచ్చునని చెప్పారు.