స్వామీ గౌడ్ కు వ్యతిరేఖంగా ఏకమయిన స్వతంత్ర అభ్యర్దులు
posted on Feb 11, 2013 9:56PM
ఏదో అదృష్టం బాగుండి తెలంగాణా ఉద్యమం పుణ్యమాని సకల జనుల సమ్మె జరగడం, దానితో తన రాజకీయ జీవితానికి బీజం వేసుకొని మెల్లగా తెరాస పార్టీలో జేరడం, అటు పిమ్మట కేసీఆర్ దయకి పాత్రుడవడంతో తెలంగాణా జేయేసీ కన్వీనర్ పదవి కూడా వచ్చి వళ్ళోవాలడం అన్నీ చకచక జరిగిపోయాయని సంతోషిస్తున్న తెరాస నేత స్వామీ గౌడ్ ను, ఒకవైపు తెలంగాణా యన్.జీ.ఓ. గృహ సొసైటీ అక్రమాల కేసు భూతంలా వెంటాడుతుంటే, మరో వైపు సొసైటీ సభ్యులు వెంటనే డైరెక్టర్ పదవి నుండి వెంటనే తప్పుకోమని డిమాండ్ చేయడం స్వామి గౌడ్ కు చాల ఇబ్బందికరంగా మారింది.
రాజకీయాలలోకి వచ్చాడు గనుక, అదంతా రాజకీయ కుట్ర అని ఎంతకొట్టి పారేసినా, కోర్టులు మాత్రం అందుకు అంగీకరించక కేసు నడపాల్సిందే! అని పట్టుబడుతూ ఆయన సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కేసీఆర్ దయతలచి శాసనమండలి సీటుకు కూడా టికెట్ ఇచ్చి రాజకీయంగా మరో మెట్టు పైకి ఎక్కేందుకు ప్రోత్సహిస్తుంటే, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న 15 మంది స్వతంత్ర అభ్యర్ధులు ఒప్పందం చేసుకొని తమలో ఒక్కరే పోటీలో నిలబడి, స్వామీ గౌడ్ ను ఎలాగయినా ఈ ఎన్నికలలో ఓడించాలని నిర్ణయించుకొన్నారు. తనకి ఎంత కేసీఆర్ మద్దతు ఉన్నపటికీ, ఇంతమంది కలిసి తనకు వ్యతిరేఖంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, స్వామీ గౌడ్ కొంచెం కంగారు పడుతున్నట్లు సమాచారం. ఆయన స్థానికేతరుడయిన కారణంగానే తాము ఆయనకి వ్యతిరేఖంగా పోటీ చేస్తున్నామని మీడియా వారితో వారు చెపారు. కర్ణుడి ఓటమికి వేయి శాపాలన్నట్లు స్వామీ గౌడ్ క్కూడా, పళ్ళెంలో పెట్టి దొరుకుతున్న శాసనమండలి సీటును అందుకొనేందుకు బోలెడు సమస్యలు అడ్డుపడుతున్నాయి. ఆయన వీటిని అన్నిటినీ అధిగమించి శాసనమండలిలో కాలుపెట్టినట్లయితే, ఇక అయన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలయిందని భావించవచ్చును.