'గబ్బర్ సింగ్' నిర్మాత గణేష్ ఇంటిపై ఐటి దాడులు
posted on Feb 11, 2013 2:39PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' నిర్మాత బండ్ల గణేష్ ఇంటి పై ఐటీ అధికారులు దాడి చేశారు. ఏకకాలంలో ఆయన ఆఫీస్, ఇ౦టిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. బండ్ల గణేష్ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన కీలక పత్రాలను సోదా చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చిన గణేష్ ఒక్కసారిగా భారీ నిర్మాతగా మారారు.
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అండతో బండ్ల గణేష్ భారీ నిర్మాతగా మారారని ఆ మధ్య వార్తలు కుడా వచ్చాయి. గణేష్ పవన్ కళ్యాణ్ తో తీసిన తీన్ మార్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి బొత్స సత్యనారాయణ కూడా తన ఫ్యామిలీతో హాజరయ్యారు. రవితేజ తో ఆంజనేయులు సినిమా నిర్మించిన గణేష్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వెంట వెంటనే రెండు భారీ సినిమాలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ కావడంతో బాగా పాపులర్ అయ్యారు.
ప్రస్తుతం గణేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్ లో 'బాద్ షా' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకకాలంలో నిర్మాత గణేష్ ఇన్ని పెద్ద సినిమాలు ఎలా నిర్మిస్తున్నారు? ఇంత భారీ పెట్టుబడి ఎలా పెడుతున్నారనే విషయాలపై ఐటి అధికారుల్లో అనుమానాలు రావడంతో రైడ్ చేసినట్లు తెలుస్తోంది.