కేసీఆర్ కు క్లాసు తీసుకుంటా... రేవంత్ రెడ్డి

 

టీడీపీ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విమర్శల వర్షం కురించారు. టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల పేరిట క్లాసులు తీసుకుంటున్న కేసీఆర్ కు కావాలంటే నేను క్లాసులు తీసుకుంటానని విమర్శించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు ఉంది కేసీఆర్ వ్యవహారం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీ విలువలను దిగజార్చిన కేసీఆర్, సభా సంప్రదాయాలపై నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. ఇవి కేవలం కేసీఆర్ భజన శిక్షణాతరగతులని, ప్రజల సమస్యలపై చర్చిచే తరగతులు కావని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాం, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డిలు కూడా టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతులకు వెళ్లడం దారుణమని, వారిద్దరూ టీఆర్‌ఎస్‌ సభ్యులుగా మారిపోయారని ధ్వజమెత్తారు. వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.