TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమర్జెన్సీ టైంలో ఇందిర రాష్ట్రపతికి ఎలాంటి షాకిచ్చిందో తెలుసా?

Published on: Wed Jul 12, 2017 3:18PM

మరి కొద్ది రోజుల్లో మనకి కొత్త రాష్ట్రపతి రాబోతున్నారు. రామ్ నాథ్ కోవింద్, మీరా కుమార్లలో ఎవరో ఒకరు రాష్ట్రపతి భవన్ లో కాలుమోపుతారు. అయితే, రామ్ నాథ్ గెలుపు దాదాపూ కన్ ఫర్మే! ఎందుకంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మన దేశంలో ఇన్ డైరెక్ట్ కాబట్టి బీజేపి, దాని మిత్రపక్షాలు, ఇతర పార్టీలు మరికొన్నీ మద్దతిస్తోన్న రామ్ నాథ్ కోవింద్ గెలిచే అవకాశాలే పుష్కలంగా వున్నాయి. కాని, మరోసారి మన దేశంలో ప్రథమ పౌరుడ్ని ఎన్నుకునే కోలాహలం జరగబోతున్న సమయంలో మనం ఇందిరా గాంధీ గురించి మాట్లాడుకోవాలి! ఎందుకు అంటారా? బలమైన కారణమే వుంది…

 

రాష్ట్రపతి పదవి మొదట్లో ఎంతో శక్తివంతంగా ఏర్పాటు చేశారు మన రాజ్యాంగ పెద్దలు! ముఖ్యంగా, అంబేద్కర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చాలా పవర్స్ ఇచ్చారు. ప్రధాని, మంత్రి మండలి నిర్ణయాల్ని రాష్ట్రపతి ఎన్నిసార్లైనా వ్యతిరేకించే అవకాశం వుండేది. అలాగే ఇంకా చాలా అధికారాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేలా వుండేవి. అయితే, నెహ్రు నుంచి ఇందిరా గాంధీ వరకూ వున్న ఏ ప్రధాని విషయంలోనూ భారత రాష్ట్రపతులు దురుసుగా వ్యవహరించలేదు. ప్రధాని నిర్ణయమే అంతిమం అన్నట్టు ఆమోద ముద్ర వేసేసేవారు మన రాష్ట్రపతులు!

 

ఇక అప్పటి దాకా తమకు పవర్స్ వున్నా ప్రెసిడెంట్లు వాడనప్పటికీ… ఇందిర వచ్చాక పూర్తిగా కోరలన్నీ పీకేసిందంటారు రాజకీయ విశ్లేషకులు! ఆమె తన హయాంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో ఎన్నో భారీ మార్పులు జరిగాయి. అందులో రాజ్యాంగానికి చేసిన పెను మార్పులు కూడా ప్రధానమైనవి. ఎమర్జెన్సీ కాలంలోనే ఇందిరా గాంధీ పార్లమెంటు నుంచి సరైన ఆమోదం లేకుండానే సోషలిజమ్, సెక్యులరిజమ్ అన్న పదాలు జోడించింది రాజ్యాంగానికి. అదే పద్ధతిలో రాష్ట్రపతి పదవిని కూడా రబ్బర్ స్టాంప్ పొజీషన్ గా మార్చేసిందామె! కేవలం ఎన్నికల తరువాత ఏ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ముందుగా ఆహ్వానించాలి… అన్నదే ప్రస్తుతం ప్రెసిడెంట్ కు వున్న కీలకమైన అధికారం! మిగతావన్నీ ఇందిర ఎమర్జెన్సీ కాలంలో తొలగించేశారు! ప్రధాని, మంత్రి మండలి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు వ్యతిరేకించే అవకాశం లేకుండా కూడా ఆమే చేసింది. ఇష్టం వున్నా లేకున్నా క్యాబినేట్ నిర్ణయానికి తల ఊపాల్సిన స్థితిలోకి రాష్ట్రపతిని నెట్టేసింది!

 

ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ టైంలో రాష్ట్రపతిని కేవలం రబ్బర్ స్టాంప్ గా మార్చేసినా తరువాతి ప్రభుత్వాలు కూడా తిరిగి అధికారాలన్నీ ప్రథమ పౌరుడికి కట్టబెట్టలేదు. ఎందుకంటే, ప్రజల చేత నేరుగా ఎన్నుకున్న కేంద్ర ప్రభుత్వానికే అంతిమ నిర్ణయం తీసుకునే అధికారాలుండటం సబబు కాబట్టి! ప్రజల చేత ఎన్నుకోబడని పదవికి తిరుగులేని పవర్ వుంటే పాకిస్తాన్ లో మాదిరిగా జరిగే ప్రమాదమూ లేకపోలేదు!