2జీ స్కాంలో మన్మోహన్ సింగ్ బెదిరించారు... బైజాల్

2జీ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మండిపడ్డారు. బైజాల్ 'ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫామ్స్- 2జీ, పవర్ అండ్ ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్ ఏ ప్రాక్టీషనర్స్ డైరీ' పేరుతో రాసిన పుస్తకంలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. మన్మోహన్ సింగ్ వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఈ రోజు తను విచారణను ఎదుర్కొనడానికి కారణం మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లేనని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2జీ వ్యవహారంలో సహకరించకుంటే హాని తప్పదని తనను హెచ్చరించారని, యూపీఏ ప్రభుత్వం వలన తన పరువు, ప్రతిష్ట దిగజారిపోయిందని అన్నారు. టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియమకాన్ని వ్యతిరేకించానని, మన్మోహన్ సింగ్ మాత్రం అవేమి పట్టించుకోకుండా మారన్ ను నియమించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మారన్ కూడా తనను బెదిరించారని 2009-10లో 2జీ స్కామ్ బయటపడిన తరువాత దానికి సంబంధించిన పలు కీలక ఫైళ్లను యూపీఏ ప్రభుత్వం తొలగించిందని బైజాల్ తన పుస్తకంలో ఆరోపించారు.