అది యువత హక్కు.. పవన్

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ నెల 26 వ తేదీన విశాఖపట్నంలోని ఆర్.కే బీచ్ దగ్గర ప్రత్యేక హోదా కోసం యువత నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. దీనిపై  ఏపీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ.. ఈ విషయమై ఇంతవరకూ తమను ఎవరూ సంప్రదించలేదని, ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లేదని, ఒకవేళ ఇప్పుడు అడిగినా బందోబస్తు ఏర్పాటు చేయలేమని అన్నారు. ఇక దీనికి గాను పవన్ కళ్యాణ్ నిరసన దీక్షకు అనుమతించకపోతే విద్యార్థుల్లో అశాంతి రగిలే అవకాశముందని, శాంతియుతంగా నిరసన తెలియజేయడం యువత హక్కు అని పవన్ పేర్కొన్నారు. విశాఖలో యువత నిరసన దీక్షకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, ఈ నిరసన దీక్ష రాజకీయాలకు అతీతమైందని, హామీల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేయడం దేశ పౌరులుగా వారి హక్కు అని పవన్ తన ట్విట్టర్లో తెలిపారు.