ఏపీకి బిగ్ షాక్.. ప్రాజెక్టులను ఆపాలంటూ ఎన్జీటి ఆదేశాలు!

 

పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే పనులు కొనసాగించాలని సూచించింది. 

అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారంటూ వట్టి వసంతకుమార్, శ్రీనాథ్ రెడ్డి ఫిటిషన్లు వేశారు. ఈ ఫిటిషన్‌పై స్పందించిన ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై గతంలోనే విచారణ చేపట్టిన ఎన్జీటీ.. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే మీరేం చేస్తున్నారంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పీసీబీ), కేంద్ర పర్యావరణ శాఖలపై అక్షింతలు వేసింది. దీనిపై ఆయా బోర్డులతో ఓ జాయింట్ కమిటీని నియమించింది. నష్టాన్ని అంచనావేసి నివేదిక ఇవ్వాల్సిందిగా నాలుగు వారాల సమయమిచ్చింది. తాజాగా ఆ కమిటీ నివేదిక అందజేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది.