వైసీపీలో చేరిన మంత్రి దేవినేని ఉమా సోదరుడు

 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే అధికార పార్టీ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్‌ వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం వైసీపీ నేత వసంత్‌ కృష్ణ ప్రసాద్‌‌.. చంద్రశేఖర్‌ను లోటస్‌పాండ్‌‌కు తీసుకొచ్చారు. సినీనటుడు అలీకి వైసీపీ కండువా కప్పిన అనంతరం వైఎస్ జగన్.. చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. చంద్రశేఖర్‌కు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. అనేక కారణాల వల్ల పార్టీ మరాల్సి వచ్చిందని చెప్పారు. టీడీపీలో అవినీతి పెరిగిపోయిందని విమర్శలు గుప్పించారు. ఇరిగేషన్ ప్రాజక్టుల్లో దోపిడీ జరిగిందని ఆరోపించారు. కేసుల నుంచి టీడీపీ నేతలు తప్పించుకోలేరని చంద్రశేఖర్ అన్నారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.