జగన్ అక్రమాస్తుల కేసు: ఎన్ శ్రీనివాసన్ను ప్రశ్నిస్తున్న సిబిఐ
posted on Jun 18, 2012 2:59PM
జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ సిబిఐ అధికారులు ముందు హాజరయ్యారు. వైయస్ జగన్కు చెందిన సాక్షి, కార్మైల్, భారతి సంస్థల్లో పెట్టుబడులపై సిబిఐ అధికారులు శ్రీనివాసన్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇండియా సిమెంట్స్కు నీటి కేటాయింపులో ప్రయోజనం చేకూర్చారని, అందుకు ప్రతిగా ఇండియా సిమెంట్స్ వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని సిబిఐ రెండు వరాల ముందు సిబిఐ నోటిసులు జారీచేసింది.
ఇండియా సిమెంట్స్ ప్లాంట్లకు నిబంధనలకు విరుద్ధంగా నీటి కేటాయింపు జరిగిందని, వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగానే ఇండియా సిమెంట్స్ నీటి కేటాయింపును పొందిందని అంటున్నారు. ఇండియా సిమెంట్స్కు ప్రభుత్వం కడప, కర్నూలు, అనంతపురం, రంగా రెడ్డి జిల్లాల్లో సున్నపురాయి నిక్షేపాలను కూడా కేటాయించింది. ఇండియా సిమెంట్స్తో పాటు పెన్నా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్లకు కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఇతర రెండు సిమెంట్ కంపెనీలకు సున్నంరాయి గనుల కేటాయింపుపై ప్రశ్నించేందుకు సిబిఐ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ధర్మాన ప్రసాద రావు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.