ఢిల్లీ సీఎం తో ప్రకాష్ రాజ్ భేటీ

 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాని,రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని  ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రకాష్ రాజ్ రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటించగానే ఆమ్ ఆద్మీ పార్టీ తమ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ప్రకాష్ రాజ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించినందుకు కేజ్రీవాల్ కి ధన్యవాదాలు తెలియజేశానని పేర్కొన్నారు. పలు అంశాలకు సంబంధించి సమస్యలపై తన బృందం రూపొందించిన వాటిపై చర్చించామని, వాటి పరిష్కారానికి వివిధ మార్గాలు పంచుకోవాలని కోరినట్టు తెలిపారు. గతవారం ప్రకాష్ రాజ్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న తన నిర్ణయాన్ని వెల్లడించగా.. ప్రకాశ్‌రాజ్‌ తీసుకున్న నిర్ణయానికి కేటీఆర్‌ సంపూర్ణ మద్దతు తెలిపినది విదితమే.