రాజమౌళి 'మహాభారతం' కోసం ఎదురుచూస్తున్న విజయేంద్రప్రసాద్!
on Oct 20, 2021
యస్.యస్. రాజమౌళికి దేశవ్యాప్తంగా వచ్చిన పేరు ప్రఖ్యాతులు చూసి టాలీవుడ్ అంతా గర్విస్తోంది. అయితే అందరికంటే ఎక్కువగా ఆనందిస్తోంది, గర్విస్తోంది మాత్రం ఆయన తండ్రి, సీనియర్ రైటర్ వి. విజయేంద్రప్రసాద్. పుత్రోత్సాహంతో ఆయన హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుందని ఎవరైనా ఈజీగా ఊహించేస్తారు. అలాంటి రాజమౌళి 'బాహుబలి' సిరీస్ తర్వాత 'ఆర్ఆర్ఆర్' మూవీని రూపొందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలతో వారు యువకులుగా ఉన్న కాలంలో జరిగినట్లు ఒక ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమాని ఆయన తీస్తున్నారు. దీనికి స్క్రిప్ట్ అందించింది విజయేంద్రప్రసాదే.
అయితే రాజమౌళి తీసే ఒక సినిమా కోసం ఆ తండ్రి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అది.. పంచమ వేదంగా భావించే 'మహాభారతం'. అవును.. "ఎప్పటికైనా మహాభారతం తీయాలని ఉంది. దాన్ని తీయగలనా, లేదా అని టెస్ట్ చేసుకోడానికి ఒక శాంపిల్ లాగా బాహుబలిని తీస్తున్నా" అని ఆ సినిమా తీసేప్పుడు రాజమౌళి చెప్పారు. "ఆ టెస్ట్లో తను డిస్టింక్షన్లో పాసయ్యాడు. అందుకే మహాభారతం ఎప్పుడు తీస్తాడా అని ఎదురుచూస్తున్నా" అని చెప్పారు విజయేంద్రప్రసాద్.
ప్రస్తుతం 'బాహుబలి' హీరో ప్రభాస్ రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ రూపొందిస్తోన్న 'ఆదిపురుష్'లో శ్రీరామునిగా నటిస్తున్నాడు. దీంతో ఇప్పుడు రాజమౌళి 'మహాభారతం' గురించిన చర్చ ఫిల్మ్నగర్లో జరుగుతోంది. అది వాస్తవ రూపం దాల్చితే శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రౌపది పాత్రలను ఎవరు పోషిస్తారనే ఆసక్తికరమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేశ్తో తాను సినిమా చేస్తానని ఇదివరకే రాజమౌళి ప్రకటించారు. ఆ తర్వాత ఆయన 'మహాభారతం' వైపు దృష్టి పెడతారని భావిస్తున్నారు. చూద్దాం.. రాజమౌళి మనసులో ఏముందో...
Also Read