ఐదు వరుస ఫ్లాపులు.. రష్మిక అయినా శర్వానంద్ను సేవ్ చేస్తుందా?
on Oct 27, 2021
కన్నడం నుంచి దిగుమతి అయ్యి, టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోన్న రష్మికా మందన్న స్వల్ప కాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలున్నాయి. ఆ రెండూ పేరుపొందిన నటులతో చేస్తున్నవే. 'మిషన్ మజ్ను'లో సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా నటిస్తోన్న ఆమె, 'గుడ్బై'లో అమితాబ్ బచ్చన్తో కలిసి నటిస్తోంది. ఇప్పటిదాకా తను నటించిన అన్ని భాషల్లోనూ హిట్లు కొట్టింది. తెలుగులో అయితే బ్లాక్బస్టర్స్ అందుకుంది. మలయాళంలో మాత్రం ఇంకా ఆమె ఎంట్రీ ఇవ్వలేదు. ఆమె తొలిసారి అల్లు అర్జున్ జోడీగా నటిస్తోన్న 'పుష్ప' పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ కాబోతోంది.
ఇది కాకుండా తెలుగులో ఆమె నటిస్తోన్న మరో సినిమా 'ఆడవాళ్లూ మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి నిన్నటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవలి వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా శర్వానంద్ ఫ్లాపులు ఎదుర్కొంటూ వస్తున్నాడు. 'పడిపడి లేచే మనసు' నుంచి అతడి పరాజయ పరంపర మొదలైంది. ఆ తర్వాత 'రణరంగం', 'జాను', 'శ్రీకారం' కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపయ్యాయి. ఎంతో క్రేజీ ప్రాజెక్టుగా రీసెంట్గా ఆడియెన్స్ ముందుకు వచ్చిన 'మహాసముద్రం' డిజాస్టర్ అయ్యింది.
దీంతో 'ఆడవాళ్లూ మీకు జోహార్లు' సినిమాతో రష్మిక అయినా అతడిని వరుస ఫ్లాపుల నుంచి గట్టెక్కిస్తుందా?.. అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అఖిల్ అక్కినేనికి తొలిసారి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'తో హిట్ దక్కడానికి కారణం పూజా హెగ్డే అంటూ తీర్మానించేస్తున్న జనం.. ఇప్పుడు శర్వానంద్కు రష్మిక అలాంటి ఎక్స్పీరియెన్స్ని ఇస్తుందేమోనని అంటున్నారు.