సరిలేరు 'మహేష్'కెవ్వరు.. 'బాహుబలి' రికార్డులు బ్రేక్ చేయగల హీరో!
on Aug 9, 2022
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. 'రాజకుమారుడు'(1999) సినిమాతో హీరోగా పరిచయమైన ప్రిన్స్ మహేష్ బాబు.. సూపర్ స్టార్ గా ఎదగటానికి ఎంతో సమయం పట్టలేదు. 'మురారి'(2001), 'ఒక్కడు'(2003), 'అతడు'(2005) సినిమాలతో సంచలన విజయాలను అందుకోవడమే కాకుండా.. నటుడిగానూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ జనరేషన్ లో ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని విధంగా ఏకంగా ఎనిమిది నంది అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక 2006 లో వచ్చిన 'పోకిరి' సినిమాతో మహేష్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ఏకంగా సౌత్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. 'పోకిరి' చిత్రం ఎన్నో భాషల్లో రీమేక్ అయినప్పటికీ ఏ హీరో కూడా మహేష్ స్క్రీన్ ప్రజెన్స్, ఆటిట్యూడ్ ని మ్యాచ్ చేయలేకపోయాడు. పండుగాడిగా మహేష్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. 'పోకిరి' సినిమా వచ్చి 15 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఆ చిత్రంతో సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు మహేష్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు(ఆగస్టు 9న) ఫ్యాన్స్ 200 కి పైగా 'పోకిరి' స్పెషల్ షోలు ప్లాన్ చేయగా అన్నీ హౌస్ ఫుల్ కావడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక రికార్డు. ఇప్పటిదాకా ఏ హీరో సినిమా కూడా ఈ స్థాయిలో స్పెషల్ షోలు వేయడం, 15 ఏళ్ళు దాటినా అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం జరగలేదు. మహేష్ మేనియా ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
'పోకిరి' తర్వాత 'దూకుడు', 'బిజినెస్ మేన్', 'సీతమ్మ వాకిట్లో', 'శ్రీమంతుడు' వంటి విజయాలను అందుకొని సినిమా సినిమాకి తన రేంజ్ ని, మార్కెట్ ని పెంచుకుంటూ వచ్చాడు మహేష్. ప్రస్తుతం ఆయన కెరీర్ పీక్స్ లో ఉంది. ఎందరో హీరోలు వంద కోట్ల షేర్ మార్క్ అందుకోవడానికి కష్టపడుతుంటే.. మహేష్ మాత్రం ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే వరుసగా నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో వరుసగా మూడు సార్లు వంద కోట్లకు పైగా షేర్ రాబట్టిన మహేష్.. ఈ ఏడాది వచ్చిన 'సర్కారు వారి పాట'తో వరుసగా నాలుగోసారి ఈ అరుదైన ఫీట్ సాధించి రికార్డు సృష్టించాడు. నిజానికి 'సర్కారు వారి పాట' విడుదలైన మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ కేవలం మహేష్ స్టార్డమ్ తో ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
మహేష్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటై ఉన్నాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ తో కాగా, మరొకటి రాజమౌళితో. గతంలో మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాతో వరుసగా ఐదోసారి వంద కోట్ల షేర్ క్లబ్ లో చేరడం మహేష్ కి చాలా సాధారణ విషయం.
ఇక 'బాహుబలి' ఫ్రాంచైజ్, 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. మహేష్ తో భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా రీజినల్ సినిమాలతోనే వంద కోట్ల షేర్ మార్క్ ని అవలీలగా అందుకునే మహేష్.. రాజమౌళితో చేయనున్న పాన్ ఇండియా సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంతో 'బాహుబలి' రికార్డులు బ్రేక్ చేయడమే కాకుండా, మహేష్ గ్లోబల్ స్టార్ గా మారే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read