రజనీకాంత్, నేను రాజకీయాలు మాట్లాడుకోం!
on Jun 2, 2022

రజనీకాంత్, కమల్ హాసన్.. ఇద్దరినీ నటులుగా దాదాపు ఒకే సమయంలో లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ పరిచయం చేశారు. ఒకరు మాస్ స్టార్గా, మరొకరు క్లాస్ స్టార్గా ఎదిగారు. మార్గాలు వేరైనా, అప్పట్నుంచీ కమల్, రజనీ మధ్య స్నేహం కొనసాగుతూ వస్తోంది. ఇటీవల చెన్నైలో రజనీని కమల్ కలవడం వార్తల్లో నిలిచింది. ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు? రాజకీయాల గురించి చర్చించుకున్నారా?.. అనే ప్రశ్నలు అందరిలోనూ మెదిలాయి.
లేటెస్ట్గా తన 'విక్రమ్' సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో మీడియా వారితో మాట్లాడిన కమల్.. తమ భేటీ గురించి స్పందించారు. "మేము తరచుగా కలుస్తూనే వుంటాం. గత నలభై ఏళ్లుగా ఇది జరుగుతూనే వుంది. మా సినిమాలు రించి, స్నేహితుల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. 'విక్రమ్ సినిమాకి చాలా మంచి వైబ్రేషన్స్ వున్నాయి, కంగ్రాచ్యులేషన్స్' అని రజనీ చెప్పారు." అని కమల్ తెలిపారు.
'రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటారా?' అని అడిగితే, "చాలా తక్కువ. మా ఇద్దరిది భిన్నమైన ఫిలాసఫీ. మేము ఎప్పుడూ పొలిటికల్ డిబేట్స్ జోలికి వెళ్ళం. మా స్నేహానికి గౌరవం ఇస్తాం" అని స్పష్టం చేశారు.
కమల్ హాసన్తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేసిన 'విక్రమ్' మూవీని లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేశాడు. రేపు, జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. కమల్ స్వయంగా నిర్మించిన ఈ మూవీని తెలుగులో నితిన్ కుటుంబానికి చెందిన శ్రేష్ఠ్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



