ఆ నటికి రాజకీయనాయకుడితో సంబంధాలు?
on Dec 22, 2020
టీవీ సీరియల్ 'పాండ్యన్ స్టోర్స్' ద్వారా ఆడియెన్స్ను అలరించిన నటి వీజే చిత్ర డిసెంబర్ 9న తన హోటల్ గదిలో ఉరేసుకున్న స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెది ఆత్మహత్యగా పోస్ట్ మార్టమ్ రిపోర్ట్లో డాక్టర్లు వెల్లడించారు. ఆరు రోజుల పాట విచారించిన అనంతరం చిత్ర భర్త హేమనాథ్ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతను జైలు ఊచల్ని లెక్కిస్తున్నాడు.
అయితే ఈ కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. చిత్ర కేసుకు సంబంధించి హేమనాథ్ తండ్రి రవిచంద్రన్ చెన్నై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్కు ఓ పిటిషన్ సమర్పించారు. చిత్ర మృతి విషయంలో తన కుమారుడు అనుమానితుడు కాదని ఆయన వాదించారు. టీవీ సీరియల్స్లో శృంగారభరిత సన్నివేశాల్లో నటించడం ఆపేయమంటూ తన కుమారుడు చిత్రను వేధించాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
చిత్రకు రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయనీ, ఒక రాజకీయవేత్త ఆమెతో రోజూ ఫోన్లో మాట్లాడేవాడని తన పిటిషన్లో రవిచంద్రన్ ఆరోపించారు. చిత్రకు అదివరకే ముగ్గురు వ్యక్తులతో ఎఫైర్స్ ఉన్నాయనీ, వారిలో ఒక వ్యక్తితో వ్యవహారం పెళ్లి దాకా వచ్చి, చివరి నిమిషంలో బ్రేకప్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్టులపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆయన కోరారు. ఒక పేరు పొందిన టీవీ యాంకర్ డేటింగ్ కోసం చిత్రను తీసుకెళ్లాడనీ, తాము సన్నిహితంగా మెలగిన క్షణాలను తన కెమెరాతో చిత్రించి, ఆమెను బ్లాక్మెయిల్ చేశాడని వినిపిస్తోందనీ, దీనిపైనా దర్యాప్తు చేయమనీ పోలీసులకు రవిచంద్రన్ విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 9న తమ కుటుంబసభ్యులతో కలిసి చిత్ర, హేమనాథ్ సంతోషంగా గడిపిన సమయానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ను ఆయన పోలీసులకు అందజేశారు. 2021 ఫిబ్రవరిలో వారి పెళ్లికి ఒక మ్యారేజ్ హాల్ను బుక్ చేసే విషయమై మాట్లాడుకోవడానికి తామందరం కలిశామని ఆయన వివరించారు. అంత సంతోషంగా గడిపి, పెళ్లికోసం హడావిడి చేసిన చిత్ర 24 గంటలు గడవక ముందే హేమనాథ్తో ఎందుకు గొడవపడుతుందని ఆయన ప్రశ్నించారు.