ఓటీటీ బాటలో విజయ్ సేతుపతి మరో చిత్రం
on May 5, 2021
కరోనా సెకండ్ వేవ్ ఉధృత రూపం దాల్చడంతో.. బిగ్ స్క్రీన్ పై సందడి చేయాల్సిన పలు చిత్రాలు వరుసగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ కోవలోనే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి టైటిల్ రోల్ లో నటించిన తమిళ సినిమా `తుగ్లక్ దర్బార్` ఓటీటీలోకి రాబోతుందంటూ కొద్దిరోజుల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. ఢిల్లీ ప్రసాద్ దీనాదయాళ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో రాశీ ఖన్నా, పార్తిబన్, మంజిమా మోహన్, గాయత్రి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో విజయ్ సేతుపతి దర్శనమివ్వనున్నారు.
కట్ చేస్తే.. `తుగ్లక్ దర్బార్` తరహాలోనే మరో విజయ్ సేతుపతి స్టారర్ కూడా ఓటీటీలోకి రానుందట. అయితే.. ఈ సారి వచ్చేది కోలీవుడ్ ప్రాజెక్ట్ కాదు మాలీవుడ్ బొమ్మ. ఆ చిత్రమే.. `19 (1) (a)`. కేరళకుట్టి నిత్యా మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంద్రజిత్ సుకుమారన్, ఇంద్రన్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. డెబ్యూ డైరెక్టర్ ఇందు వి.ఎస్ రూపొందించిన ఈ చిత్రాన్ని ఆంటో జోసేఫ్ నిర్మించారు. తొలుత ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీకే ఓటేయక తప్పలేదు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
కాగా, `19 (1) (a)` విజయ్ సేతుపతికి రెండో మలయాళ సినిమా. ఇదివరకు ఆయన జయరామ్ ప్రధాన పాత్రలో నటించిన `మార్కోని మత్తాయ్` (2019)లో అతిథిగా మెరిశారు.
Also Read