అప్పుడు 'జనతా గ్యారేజ్'.. ఇప్పుడు 'ఖుషి'
on Sep 1, 2023
మైత్రి మూవీ మేకర్స్ కి సెప్టెంబర్ 1 లక్కీ డేట్ లా ఉంది. ఏడేళ్ల క్రితం మైత్రి నిర్మించిన 'జనతా గ్యారేజ్' 2016, సెప్టెంబర్ 1 విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రమిది. అప్పటికిది ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా.. టాలీవుడ్ లో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. నేటితో 'జనతా గ్యారేజ్' విడుదలై ఏడేళ్లు పూర్తయింది. అయితే ఈరోజు మైత్రి మరింత 'ఖుషి'గా ఉంది.
విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి రూపొందించిన 'ఖుషి' సినిమా నేడు(సెప్టెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి 'ఖుషి' రూపంలో హిట్ వచ్చినట్లే అంటున్నారు. అందుకే మైత్రి నిర్మాతలు ఫుల్ ఖుషి గా ఉన్నారు. మొత్తానికి అప్పుడు 'జనతా గ్యారేజ్', ఇప్పుడు 'ఖుషి'తో మైత్రికి సెప్టెంబర్ 1 బాగా కలిసొచ్చింది. ఇక్కడ మరో ప్రస్తావించదగ్గ విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ రెండు సినిమాల్లో సమంత హీరోయిన్ కావడం విశేషం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
