నాలాంటి కొత్త నటుల్ని కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బకొట్టింది!
on Jun 24, 2021
మెగాస్టార్ చిరంజీవి సినిమా 'చూడాలని వుంది'లో తొలిసారి స్క్రీన్ మీద నటించినప్పుడు తేజ సజ్జా వయసు మూడంటే మూడేళ్లు. అప్పట్నుంచీ 2006 దాకా బాలనటుడిగా 50కి పైగా సినిమాల్లో అతను నటించాడు. అంటే సినిమా సెట్ల మీదే అతను పెరుగుతూ వచ్చాడన్న మాట. నందినీరెడ్డి డైరెక్ట్ చేసిన 'ఓ బేబీ' మూవీలో ఓ కీలక పాత్ర చేసిన అతను, ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన 'జాంబీరెడ్డి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.
అయితే కరోనా మహమ్మారి తనలాంటి కొత్త నటుల ఆశలపై తీవ్రంగా దెబ్బకొట్టిందని వాపోతున్నాడు తేజ. అయితే అతడు హీరోగా నటించిన ఫస్ట్ ఫిల్మ్ 'జాంబీరెడ్డి' (2021) థియేటర్లలో విడుదలవడం మాత్రం లక్కీ అని చెప్పాడు. షూటింగ్ చేయడానికి క్లిష్టమైన పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ముందుగా షూటింగ్ను కంప్లీట్ చేయగలిగామనీ, అందుకే థియేటర్లు ఓపెన్ అవగానే సినిమాను రిలీజ్ చేశామనీ తెలిపాడు. ఆ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు చూడటం, తన నటనను ప్రశంసించడం ఆనందాన్నిచ్చిందన్నాడు.
కానీ 'జాంబీరెడ్డి' తర్వాత అతను హీరోగా చేసిన 'ఇష్క్' మూవీ రిలీజ్కు దగ్గరయ్యాక తిరిగి థియేటర్లు మూతపడటంతో, దాన్ని విడుదల చేయలేకపోవడం మాత్రం అతడికి బాధ కలిగించింది.
"సినిమా సెట్స్ మీద పెరుగుతూ రావడం వల్ల షూటింగ్ లైఫ్కు బాగా అలవాటుపడిపోయాను. కానీ మహమ్మారి టైమ్లో, ఇది చాలా డిఫరెంట్గా ఉందని అందరూ ఫీలయ్యారు. నేను పనిచేసిన రెండు సినిమాల సెట్స్ను చాలా సురక్షితంగా ఉంచారు. అయినప్పటికీ కెమెరా ముందు నటులు ఎక్స్పోజ్ అవుతుంటారు. అందువల్ల ఇన్ఫెక్షన్ సోకే రిస్క్ ఎక్కువ. ఆ ఫీలింగ్ నాకు కొత్త. సెట్స్ మీదకు వెళ్లేటప్పుడు ఏదైతే అదవుతుందని మానసికంగా ప్రిపేర్ అయ్యేవాడ్ని. ఆ విషయంలో నేను లక్కీ. చాలామంది తాము ప్రేమించేవాళ్లను, సన్నిహితుల్ని కోల్పోయారు. నేను క్షేమంగా ఉండటం ఆశీర్వాదంగా భావిస్తున్నా." అని చెప్పాడు తేజ.
తిరిగి సెట్స్ మీదకు రావడం కోసం అతను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. అలాగే 'ఇష్క్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. "నటించడానికి అవకాశం దొరికిన ఒక యూనిక్ స్టోరీ అది. అలాంటి వైవిధ్యమైన స్క్రిప్టులు మాత్రమే నాలాంటి నటులను నిలబెడతాయని నేను నమ్ముతున్నా." అని అతను తెలిపాడు. 'ఇష్క్'లో తేజ సరసన నాయికగా ప్రియా ప్రకాశ్ వారియర్ నటించింది.
Also Read